క్రీస్తును తెలుసుకోవడం నుండి ప్రపంచాన్ని మార్చడం వరకు…..
యెష 22:19-23; రోమా 11:33-36; మత్త 16:13-20 (A / 21)
“మనలో ప్రతి ఒక్కరం ఒక
చిన్న రాయి వంటివారము. కానీ యేసు చేతులలో సంఘము కట్టబడుటలో
పాలుపొందుతాము” (పోప్ ఫ్రాన్సిస్)
నేటి సువార్తలో, యేసు తన శిష్యులను “మనుష్యకుమారుడు ఎవరని
జనులు అనుకోనుచున్నారు?” అని ఒక ప్రశ్న అడుగుతాడు. అది రెండు వేల ఇరువై ఆరు సంవత్సరాల
క్రితం ఎంత సందర్భోచితంగా ఉందో,
ఈనాటికీ అంతే
సందర్భోచితంగా ఉంది.
ఆ తర్వాత “అయితే నేను
ఎవరని మీరను చెప్పుకొనుచున్నారు?”
(మత్త 16:13-15) అని వ్యక్తిగతం చేస్తాడు. యేసు ఒక సర్వే నిర్వహించడం లేదు. ఆయన ఒక
వ్యక్తిగత నిబద్ధతను కోరుతున్నాడు. అందుకు పేతురు “నీవు
క్రీస్తువు. జీవముగల దేవుని కుమారుడవు” (మత్త 16:16) అని జవాబిస్తున్నాడు. యేసును క్రీస్తుగా గుర్తించడం అంటే ఒక
మత విశ్వాసాన్ని అంగీకరించడం కంటే ఎక్కువ!! దాని అర్థం మానవాళిపై ఆయనకున్న
దృష్టిని అంగీకరించి, ఆయన పరిచర్యలో భాగం కావడం.
యేసు సామాజిక వర్గాలు, మతపరమైన సరిహద్దులు, సాంస్కృతిక పక్షపాతాలు, రాజకీయ అధికారం మరియు ఆర్థిక అసమానతలచే
విభజించబడిన ప్రపంచంలోకి ప్రవేశించాడు. ఆయన కుష్ఠరోగులను తాకాడు, పాపులను స్వాగతించాడు, పరదేశీయులతో మాట్లాడాడు, స్త్రీల గౌరవాన్ని కాపాడాడు, సమాజం వెలివేసిన వారితో కలిసి భోజనం
చేశాడు, మరియు పిల్లలను, పేదలను దేవుని రాజ్యానికి కేంద్రంగా నిలిపాడు.
ఆయన మానవ సంబంధాలను మార్చేవాడు. ఆయన మతపరమైన కపటత్వాన్ని “వీరు తమ పెదవులతో నన్ను
ఘనపరుస్తారు, కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి”
(మత్త 15:8) అని సవాలు చేశాడు. సామాజిక బహిష్కరణను “నేను
పరదేశిగా ఉన్నప్పుడు, మీరు నన్ను స్వాగతించలేదు” (మత్త 25:35) అని సవాలు చేశాడు. అధికార దుర్వినియోగాన్ని
“మీలో గొప్పవాడు కావాలని కోరుకునేవాడు మీ సేవకుడిగా ఉండాలి” (మత్త 20:26) అని సవాలు చేశాడు.
దేవుని రాజ్య సంస్కరణ అంటే సమాజాన్ని
నాశనం చేయడం కాదు.
దేవుని న్యాయం, కరుణ, సత్యం
మరియు ప్రేమకు అనుగుణంగా దానిని మార్చడం. ఈ మార్పు మన చుట్టూ ఉన్న అసమానతలను
ప్రశ్నించే హక్కుతో మొదలవుతుంది. నేను,
“యేసు నా రక్షకుడు”
అని చెప్పుకుంటే, నాలోనూ, సమాజంలోనూ
ఎటువంటి మార్పు రావాలి
అని ప్రశ్నించుకోవాలి!!! దోపిడీని, మానవ అక్రమ రవాణాను, లేదా మానవ గౌరవాన్ని మరియు బలహీనుల
నాశనాన్ని సహిస్తూ మనం క్రీస్తును ప్రకటించలేము. పరిశుద్ధ పౌలు , “ఈ లోకానికి అనుగుణంగా ఉండకండి. కానీ మీ మనస్సులను నూతనపరచుకోవడం ద్వారా
రూపాంతరం చెందండి” (రోమా 12:2) అని
మనలను హెచ్చరిస్తున్నాడు. అందువల్ల క్రైస్తవ శిష్యరికం అనేది మనల్ని మరియు మన
సమాజాన్ని నిరంతరం సంస్కరించుకోవడమే కదా!!
రెండవ వాటికను మహాసభ ఈ విషయాన్ని "మన
మానవత్వo
తనకు తానే క్రీస్తులా రూపాంతరం చెందడానికి క్రీస్తు తనను తాను సాక్షాత్కరించుకున్నాడు"
(GS, 22)
అని చాలా
అందంగా వ్యక్తీకరిస్తుంది. మనం క్రీస్తును కనుగొన్నప్పుడు, నిజమైన మానవులుగా మారడం అంటే ఏమిటో కూడా
మనం కనుగొంటాము. అందువల్ల కథోలిక సామాజిక బోధన – మానవ గౌరవం, సంఘీభావం, ఉమ్మడి
శ్రేయస్సు మరియు న్యాయంపై ఆధారపడిన సమాజాన్ని నిర్మించమని మనకు పిలుపునిస్తుంది.
దేవుని రాజ్యం అనేది మనం మరణానంతరం ఎదురుచూసే విషయం మాత్రమే కాదు. ఆ దేవుని రాజ్యం
సమీపంలోనే ఉంది (మత్త 3:2);
“గమనించదగినది ఏదో మనమధ్యనే
ఉంది” (లూకా 17:20); “ఇక్కడే, ఇప్పుడే
మీలోనే ఉంది” (లూకా 17:21).
మనం ద్వేషాన్ని
సయోధ్యగా, బహిష్కరణను స్వాగతంగా, దోపిడీని న్యాయంగా, మరియు ఉదాసీనతను సంఘీభావంగా
మార్చినప్పుడల్లా దానిని వ్యక్తపరచడం ప్రారంభిస్తాము. ఈ రోజు యేసు మనలో ప్రతి
ఒక్కరినీ "నేను ఎవరని నీవు అనుకోనుచున్నావు?" అని అడుగుతున్నాడు.
క్రీస్తును తెలుసుకోవడం అంటే క్రీస్తు ద్వారా/వలే రూపాంతరం చెందడం. క్రీస్తు ద్వారా/వలే రూపాంతరం చెందడం
అంటే మెస్సీయ రాజ్యపు విలువలకు అనుగుణంగా,
మన సంబంధాలలో, మన సమాజంలో, ప్రపంచంలో రూపాంతరానికి ఒక సాధనంగా
మారడం!!
"సంఘం అనేది ఒక జీవ
సమాజం.
అది
విభిన్నమైన అనేక రాళ్లతో ఏర్పడింది..." (పోప్ ఫ్రాన్సిస్)
No comments:
Post a Comment