AletheiAnveshana: వాక్య ధ్యానాoశము
Showing posts with label వాక్య ధ్యానాoశము. Show all posts
Showing posts with label వాక్య ధ్యానాoశము. Show all posts

Saturday, 7 June 2025

రండి. ఓ! పరిశుద్ధాత్మ అపొ 2:1-11; 1 కొరింథీ 12:3b-7,12-13; యోహాను 20:19-23 (8 ఈస్టర్/ సి)

 

రండి. ఓ! పరిశుద్ధాత్మ

అపొ 2:1-11; 1 కొరింథీ 12:3b-7,12-13; యోహాను 20:19-23 (8 ఈస్టర్/ సి)

అపొస్తలులు వేర్వేరు భాషలలో మాట్లాడి దేవుని అద్భుతమైన కార్యాలను ప్రకటించారు. అల్లెలుయా (Divine Office).

పస్కా పండుగ కాలం నేటి పెంతుకోస్తు పండుగతో ముగుస్తుంది. “పెంతుకోస్తు” అనే పదం గ్రీకు పదం “పెంటెకోస్టే” అనే పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం “యాభైవ”. అదేవిధంగా, “పెంటా” అంటే “ఐదు” అని అర్ధం. “పెంతుకోస్తు” అనే పదం యూదు మతంలో కోత పండుగ “షావూట్” ను ప్రతిబింబిస్తుంది. యూదుల దైవార్చన సంస్కృతిని అనుసరించి, క్రైస్తవ మతం ఈస్టరు “యాభైవ” రోజు వేడుకను కొనియాడుతుంది. జెరూసలేంలోని మేడ పైగదిలో సమావేశమైన అపోస్తలులపై పరిశుద్ధాత్మ దిగివచ్చి వారిని ధైర్య వంతులను చేసిన సందర్భాన్ని మాతృ శ్రీసభ జరుపుకుంటుంది. క్రీస్తు ఆత్మ అయిన  పరిశుద్ధాత్మ ద్వారా ఉత్పత్తి చేయబడిన విలువల పంటను తిరుసభ జరుపుకుంటుంది. మన విశ్వంలోని అనేక విషయాలు మన కంటికి కనిపించకపోయినా అవి వాస్తవమైనవే! మన కళ్ళతో మనం చూసేది మన భౌతిక ప్రపంచంలో ఒక భాగం మాత్రమే. పరిశుద్ధాత్మ ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందినది. తనను  మన భౌతిక కళ్ళతో చూడలేము.

పరిశుద్ధాత్మ ఫలం శిష్యులలో కొత్త మానవ స్థితిని సృష్టించింది. ఐక్యతను పెంపొందించింది. ప్రజల దురహంకారం బాబేలు గోపురాన్ని నిర్మించి  దేవుణ్ణి సవాలు చేయడానికి దారితీసినప్పుడు, దేవుడు ఒకరినొకరు అర్థం చేసుకోలేని విధంగా వారి భాషలను తారుమారు చేశాడు (ఆది 11: 1-9). కానీ పెంతుకోస్తు నాడు, విభిన్న దేశాలు మరియు భాషలు గల ప్రజలందరూ అపోస్తలుల భాషను అర్థం చేసుకునేలా చేశాడు. శిష్యులు మేడ పైగదిలో కన్య మరియతో సమావేశమైనప్పుడు, “... అకస్మాత్తుగా ఆకాశం నుండి బలమైన గాలి వీచినట్లుగా ఒక శబ్దం వచ్చింది. అది వారు ఉన్న ఇంటినంతా నింపింది. అప్పుడు వారికి అగ్నిలాంటి నాలుకలు కనిపించాయి. అవి విడిపోయి ప్రతి ఒక్కరిపై నిలిచాయి” (అపో 2:2-3). ఇది హీబ్రూ భాషలో “రువా” అనే పదానికి వివరణాత్మాక సంఘటన గానూ వున్నది.

అపోస్తలులందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయి ధైర్యంగా ప్రకటించడం ప్రారంభించారు. ఒకప్పుడు అధికారులకు భయపడిన వీరు, జైలు శిక్ష, హింస, బలిదానానికి సయితం భయపడని ధైర్యవంతులైన ప్రబోధకులుగా రూపాంతరం చెందారు. "ప్రేమ, ఆనందం, శాంతి, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం, సాత్వికత మరియు స్వీయ నియంత్రణ" (గలతీ 5:22) అనే సమాజాలను నిర్మించడానికి పరిశుద్ధాత్మ తోడుగా నడిపించెను. అలాగునే  మన బలహీనతలో మనకు సహాయపడుతూ (రోమా 8:26)  సందేహం, భయం మరియు మన వికృత కోరికల బానిసత్వం నుండి ఆధ్యాత్మిక స్వేచ్ఛలో ఎదగడానికి మనకు వీలు కల్పించడం (2 కొరింథీ 3:17; రోమా 8:21) తధ్యం. దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించమని ఆత్మ మనకు నిర్దేశిస్తూ సత్యంలో మనల్ని ప్రతిష్టిoచి (యోహాను 17:17) మనల్ని అంతర్గతంగా రూపాంతరం చేయగలరు.

తిరుసభ పితృ పాదులు బేసిల్ ది గ్రేట్ (క్రీ.శ. 329-379) మన జీవితాల్లో పరిశుద్ధాత్మ పాత్రను ఇలా వివరిస్తున్నాడు: “ఆత్మ మనకు స్వర్గాన్ని, స్వర్గానికి మార్గాన్ని మరియు దేవుని బిడ్డలుగా దత్తత తీసుకోవడాన్ని పునరుద్ధరించును. మనం దేవుణ్ణి నిజంగా తండ్రి అని పిలవగలమనే విశ్వాసాన్ని మనలో కలిగిస్తూ వెలుగు బిడ్డలుగా ఉండటానికి మరియు శాశ్వతమైన మహిమను ఆస్వాదించడానికి క్రీస్తు కృపను మనకు ప్రసాదించును. ఒక్క మాటలో చెప్పాలంటే, తను ఈ లోకంలో మరియు తదుపరి లోకంలో ఆశీర్వాదాల సంపూర్ణతను ప్రసాదించును”. పరిశుద్ధాత్మ మన ఆత్మకు ఆత్మ, మన జీవిత జీవితం, మన ఉనికికి ఉనికి. తాను మన పవిత్రకర్త. మన అంతరంగిక స్వభావానికి అతిథి. విశ్వాస జీవితంలో పరిణతి చెందడానికి, తనతో మన సంబంధం మరింత స్పృహతోనూ వ్యక్తిగతంగా మారాలి. కాబట్టి ఈ పెంతుకోస్తు వేడుకలో మన అంతర్గత ఉనికి తలుపులను తెరుద్దాం. రండి! ఓ! పరిశుద్ధాత్మమా! నాలోనికి రండి!!!

మీ ఆత్మను పంపండి. కొత్త జీవితం ప్రారంభమవుతుంది. మీరు భూ ముఖాన్ని పునరుద్ధరిస్తారు”. అల్లెలుయా (Divine Office).

Saturday, 31 May 2025

ఆయన నాలో శాశ్వతంగా ఉండటానికి ఆరోహణమయ్యేను అపొ 1:1-11; ఎఫె 1:17-23; లూకా 24:46-53 (6 /C)

ఆయన నాలో శాశ్వతంగా ఉండటానికి ఆరోహణమయ్యేను

అపొ 1:1-11; ఎఫె 1:17-23; లూకా 24:46-53 (6 /C)

“నేను నా తండ్రి మరియు మీ తండ్రి, నా దేవుడు మరియు మీ దేవుడు వద్దకు ఆరోహణమవుచున్నాను”. అల్లెలూయ.

 

యేసు పునఃరుత్థానము తర్వాత 40వ రోజున ప్రభువు పరలోక ఆరోహణమును ఈరోజు మన తిరుసభ  జరుపుకుంటుంది. యేసు ఆరోహణము ద్వారా ప్రభువు తన భూసంబంధ పని అయినటువంటి మన విమోచనను పరి పూర్తి చేశాడని మాతృ శ్రీసభ మనకు చెబుతుంది. తన పునరుత్థాన రోజు మరియు తన ఆరోహణ రోజు మధ్య వందలాది మందికి తన అనేక ప్రత్యక్షతల ద్వారా, యేసు రెండు విషయాలను నిరూపించాడు. మొదటిది, తాను వారిని విమోచించడానికి వచ్చిన వాగ్దత్తపు మెస్సీయ అని నిరూపించాడు. రెండవది, తమ సజీవ విశ్వాసంలో పట్టుదలతో ఉన్నవారు మరణాన్ని కూడా అధిగమించి దేవుని రాజ్యాన్ని వారసత్వంగా పొందుతారని ఆయన నిరూపించాడు. అలాగునే ప్రభువు తమతో ఉన్నాడనీ, వారి పరిచర్య పనిలో వారికి సహాయం చేస్తాడని వారికి పూర్తిగా హామీ ఇచ్చాడు.

యేసు పూర్తిగానూ శాశ్వతంగానూ తన తండ్రితో తిరిగి ఐక్యమయ్యాడు. అపొస్తలుల కార్యముల వాస్తవ మాటలు ఏమిటంటే, ఒక మేఘం ఆయనను వారి దృష్టి నుండి తీసుకువెళ్ళింది” (అపొ 1:9). పాత నిబంధనలో మనకు కన్పించే దేవునికి చిహ్నంగా వున్నటువంటి ఉరుము, మెరుపు, పర్వతం, వాయువు, అగ్ని, గుడారం మొదలైన చిహ్నాల వలే నేటి పఠనంలో కన్పించే “మేఘం” ఇతర చిహ్నాల మాదిరిగానే దేవునకు ఒక చిహ్నంగా వున్నది. కాబట్టి, మేఘం ఆయనను తీసుకువెళ్లింది” అనే వాక్కు - తండ్రి దేవుడు మానవశరీరం ధరించిన తన కుమారుని తిరిగి తన వద్దకు తీసుకువెళ్లాడని అర్థం. మరియు మార్కు సువార్తలో కన్పించే, ప్రభువైన యేసు... పరలోకానికి తీసుకెళ్లబడ్డాడు” అన్నఅర్థం కూడా అదే! ఆయన వెళ్ళిపోవడం శాశ్వతం. తిరిగి న్యాయాధిపతిగా రావడం తధ్యం. ఇప్పుడు శిష్యులు యేసును ఆకాశపు గఘనాలలో కనుగొనలేరు. కాబట్టి ఆకాశం వైపు చూడకుండా “తమ కళ్ళను దించుకొని భూమివైపు చూడాలని” పిలుపును పొందారు. ఆతని సాన్నిధ్యం మన మధ్యననూ  మన ఒక్కొక్కరిలోనూ  నెలకొని వున్నది.

ఈ నాటి, ఆరోహణ పండుగ నాడు, యేసు తన తండ్రితో సమాన మహిమను పంచుకోవడానికి ఆరోహణమ వ్వడం వలన, ఆయన “మహోన్నత స్థితి”ని మనం కొనియాడుతునాము. యేసు తన శిష్యులను విడిచిపెట్టే ముందు, వారికి తమ లక్ష్య దశాదిశ నిర్దేశo చేసాడు. నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును, నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నందున వీటికంటె గొప్ప క్రియలు చేయును” (యోహాను 14:12-13) అని మరింత అద్భుతమైన క్రియలు చేయడానికి వారికి అభయ మిచ్చాడు యేసు. తాను చేయలేనిది వారు చేయగలుగుతారు.  వారు లోకమంతటికీ సువార్తను ప్రకటించగలరు. ఈ రక్షణ సువార్తను ప్రకటించి స్వస్థపరిచే పనిని కొనసాగించడానికి వారికి దిశను చూపించాడు. వారు పరిశుద్ధాత్మ నుండి శక్తిని పొందుతారు. వారు ఇక ఎప్పటికీ ఒంటరిగా ఉండలేరు.

పరిశుద్ధాత్మ బహుమతి కోసం యెరూషలేములో వేచి ఉండమని మన ప్రభువు వారిని ఆదేశించాడు (లూకా 24 49; అపొ 1:4-5). యెరూషలేములో, వారు వాగ్దానం చేయబడిన ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తూ ఆత్మ వరాన్ని పొందుకున్నారు. శాశ్వత ఆత్మ కోసం మనం కోరుకునే "అత్యధికమైన విలువైన వాగ్దానాన్ని" తన శిష్యులకు ఇచ్చినట్లు ఆయన మనకు ఇవ్వలేదా? మన ఆత్మలలో వాటి నెరవేర్పు కోసం వేచి చూద్దాం. సరైన సమయంలో, “యేసు పరలోకానికి వెళ్ళినట్లే పరలోకం నుండి తిరిగి  (సరియైన సమయంలో) వస్తాడు” (అపొ 1:11). ఆ చివరి వాగ్దానం , “నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని నా దగ్గరకు తీసుకెళ్తాను, తద్వారా నేను ఉన్న చోట మీరు కూడా ఉంటారు (యోహాను 14:3) అన్నది కూడా నెరవేరుతుంది. ఈలోగా మనం “మన నడుములు కట్టుకుని, మన దీపాలను సవరించుకొని” ప్రభువు రాక కోసం ఎదురు చూస్తున్న” వారిగా ఆయన మనల్ని కనుగొనవచ్చు గాక!

నేడు మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమయ్యాడు. మన హృదయాలు ఆయనతో పాటు ఆరోహణ మవ్వాలి

 

 

Saturday, 24 May 2025

లోకానికి భిన్నమైన శాంతి: అపొ 15:1-2,22-29; ప్రక 21:10-14,22-23; యోహాను 14:23-29 (ఈస్టర్ 6/ సి)

 



లోకానికి భిన్నమైన శాంతి

ప్రభువు తన పవిత్ర వాక్కును జ్ఞాపకం చేసుకున్నాడు మరియు ఆయన తన ప్రజలను ఆనందంతో బయటకు తీసుకువచ్చాడు. అల్లెలుయా.

అపొ 15:1-2,22-29; ప్రక 21:10-14,22-23; యోహాను 14:23-29 (ఈస్టర్ 6/ సి)

ఒక రోజు, చిన్న థెరేసమ్మకు ఎంచుకోవడానికి వివిధ బహుమతులు అందించబడ్డాయి. ఆమె చిన్న వయస్సులో ఉన్నప్పటికీ, చాలా దృఢ సంకల్పంతో "నేను అన్నింటినీ ఎంచుకుంటాను" అని చెప్పింది. ఒక వయోజనురాలిగా, తిరుసభలో ప్రేమించబడాలని కోరుకోవడంలో ఈ ఎంపికను గ్రహించాలని ఆమె అర్థం చేసుకుంది. ఎందుకంటే ప్రేమ లేని శరీరం అర్థరహితం అవుతుంది. దేవుడు ప్రేమ మరియు అది తన ఏకైక కుమారుని మానవ రూపాంతరం ద్వారా దేవుని నుండి వచ్చిన అత్యున్నత సందేశం. ఆతని సర్వవ్యాప్త ప్రేమ నుండి శాంతి” పుట్టింది. అందుకే ఆయన "శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను” (యోహాను 14:27) అని వచించాడు. మనకు శాంతి కావాలి కానీ చుట్టూ భయాలు మరియు హింసాత్మక చర్యలను మనం చూస్తున్నాము. మనం ఆయన వైపు తిరిగినపుడు, మనం శాంతిని మాత్రమే సాధిస్తాము. అది ఆయన సంపూర్ణ ప్రేమ ఫలం. లోకం ఇచ్చినట్లుగా ఆయన దానిని మనకు ఇవ్వడు (యోహాను 14:27), ఎందుకంటే యేసు శాంతి నిశ్చలత మరియు నిర్లక్ష్యత కాదు, కానీ దానికి పూర్తి వ్యతిరేకం. ఇది సోదరభావంగా మారే సంఘీభావం. మనల్ని మనం మరియు ఇతరులను కొత్త కళ్ళతో చూసే సామర్థ్యమును ఈ సంఘీభావం కల్పిస్తుంది. దీని నుండి  విషయ వస్తువులను ఉన్నవి ఉన్నట్లుగా రుజువర్తనంగా మరియు పారదర్శకంగా మనం చూడటానికి అనుమతించే గొప్ప ప్రశాంతత పుడుతుంది. అంతే గాని అవి కంటికి కనిపించే విధంగా మాత్రం కాదు.

ఈరోజు, మనం యేసు తన ఆత్మ అయిన పవిత్రాత్మ ద్వారా ఇచ్చిన శాంతి బహుమతి గురించి ధ్యానిస్తున్నాము. హీబ్రూ పదం “షెకినా” దేవునిలో మాతృ కోణాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ఈ పదం స్త్రీలింగపరమైనది మరియు హీబ్రూ ప్రజ మతంలో యెహోవా సతిగా ఉపయోగించబడింది. సువార్తికుడు యోహాను పాత నిబంధనలోని ఈ భావానను గురించి ఎందుకు ఆలోచించలేదో, ప్రస్తావించ లేదో మనకు అర్ధం కాదు. ఆతని ఆ౦తర్య దృష్టా ఈ పదజాలం చాలా గంభీరమైన ప్రసున్నతి కలిగి ఉన్నది. అయితే, శాంతి అనే పదం హేబ్రియ భాషన “షాలోమ్”. “షాలోమ్” అంటే ఎప్పుడూ ఇబ్బందులు లేకపోవడం అని కాదు కానీ ప్రపంచ శాంతి కంటే అతి ఉన్నతమైనది. లోక బహుమతులు శరీరసమయాలు, ప్రాపంచిక విషయాలను మాత్రమె ప్రస్తావిస్తాయి. క్రీస్తు వరాలు శాశ్వతత్వం కోసం ఆత్మను సుసంపన్నం చేస్తాయి. ప్రపంచం అబద్ధమైన వ్యర్థాలను మరియు మనల్ని మోసం చేసే వాటిని ఇస్తుంది. క్రీస్తు గణనీయమైన ఆశీర్వాదాలను ఇస్తాడు, అవి మనల్ని ఎప్పటికీ నిరాశపరచవు. లోకం ఇస్తుంది మరియు లాగేసు కుంటుంది. క్రీస్తు ఎప్పటికీ మన నుండి తీసివేయబడని మంచి భాగాన్ని మాత్రమె ఇస్తాడు. ప్రపంచ శాంతి అజ్ఞానంతో ప్రారంభమవుతుంది, పాపంతో కూడి ఉంటుంది. అది అంతులేని ఇబ్బందులతో ముగుస్తుంది. క్రీస్తు శాంతి కృపతో ప్రారంభమవుతుంది, అనుమతించబడని పాపంతో కూడి ఉంటుంది మరియు శాశ్వత శాంతితో ముగుస్తుంది. మనలను చంపే బద్ధకం మరియు పునరుజ్జీవనం కలిగించే నిద్రల మధ్య వ్యత్యాసం వున్నట్లే, క్రీస్తు శాంతికి మరియు లోక శాంతికి మధ్య వ్యత్యాసం కూడా అంతే వుంటుంది.

తన అనుచరులైన మనకు ప్రభువైన యేసు అందించే శాంతిని మనం ఎలా పొందగలం? తన ఆత్మ, మనలో నివసించే పరిశుద్ధాత్మ బహుమతి మరియు తన ప్రేశిత క్రియ ద్వారా, మన కోపం, భయం మరియు గర్వం వంటి కోరికలను తనకు ఎలా అప్పగించాలో ప్రభువైన యేసు మనకు చూపిస్తాడు. తద్వారా మనం ఆయన శాంతి బహుమతిని పొందగలము. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలో మనకు సహాయం చేసి మనలను బలపరుస్తాడు. క్రీస్తు వలె తెలివిగా జీవించడానికి వీలు కల్పిస్తాడు. గౌల్‌ అనే ప్రాంత సంఘ బిషప్ అయిన సీజరియస్ (470-542 AD), క్రీస్తులో ఎదగడానికి క్రీస్తు పాత్రతో శాంతిని అనుసంధానించాడు. ఆయన ఇలా అంటాడు, నిజానికి, శాంతి అంటే మనశ్శాంతి, ఆత్మ ప్రశాంతత, హృదయ సరళత, ప్రేమ బంధం, దాతృత్వపు సహవాసం. ఇది ద్వేషాన్ని తొలగిస్తుంది, యుద్ధాలను నిలిపి వేస్తుంది, కోపాన్ని అణిచివేస్తుంది, గర్వాన్ని తొక్కుతుంది, వినయస్థులను ప్రేమిస్తుంది, అసమ్మతిని శాంతింపజేస్తుంది మరియు శత్రువులను అంగీకరించేలా చేస్తుంది. అది మరొకరికి చెందిన దానిని  కోరుకోదు”. ఒక క్రైస్తవుడు క్రీస్తు శాంతిని అమలు చేసినపుడు, దానిని క్రీస్తునందు తన పరిపూర్ణ పరిపక్వతకు చేరుతాడు. రాగ ద్వేషాలు కలిగిన భవభంధాల నుండి మనకు మనం విముక్తిని పొంద గలిగినపుడు మాత్రమే ఆ పరిపక్వతను సాధించగలము. మనం దేనినుండైనా, ఎవరి నుండైనా, మన దాతృత్వ చర్యల నుండైనా సరే, ఎటువంటి ఆశలు, పెట్టుకోనప్పుడు మాత్రమె ఆ నిర్లిప్తతను మనం సాధించగలం.

మనం కొన్నిసార్లు తప్పు చేయడానికి శోదించబడినప్పుడు లేదా క్రీస్తు శాంతికి విరుద్ధంగా చేసే క్రియ అంచున ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ మన ప్రవర్తనను గద్ధిస్తుంది. ప్రమాద సమయంలో కూడా, పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్కు మన మనస్సులలో తళుక్కున మెరుస్తూ గద్దింపుకు గురి చేస్తుంది (కీర్తన 32:8). అది పరిశుద్ధాత్మ మనల్ని తన త్రియేక దేవునితో ఐక్యతకు నడిపిస్తుంది. “సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు” (5:9).

దేవుడు మీ ఉద్దేశాలను గ్రహిస్తాడు పునీత  అగుస్టీను

 

 

 

Friday, 16 May 2025

“దీని ద్వారా నీవు నావాడవని అందరూ తెలుసుకుంటారు” అపొ 14:21-27; ప్రక 21:1-5a; యోహా 13:31-33a,34-35 (ఈస్టర్ 5/C)

 


దీని ద్వారా నీవు నావాడవని అందరూ తెలుసుకుంటారు”

అపొ 14:21-27; ప్రక 21:1-5a; యోహా 13:31-33a,34-35 (ఈస్టర్ 5/C)

చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది, మరియు చీకటి దానిని ఎన్నడూ అధిగమించలేకపోయింది”

 

పునీత మదర్ థెరిసా గ్యాంగ్రీను వ్యాధి ఉన్న వ్యక్తికి చికిత్స చేయడం గమనించిన తర్వాత, ఒక అమెరికను జర్నలిస్టు నాకు మిలియను డాలర్లు ఇచ్చినా అలా చేయను” అని అన్నాడు. అందుకు పునీత మదర్ థెరిసా నేను కూడా చేయను... కానీ నేను దేవుని ప్రేమ కోసం అలా చేస్తున్నాను” అని సమాధానమిచ్చారు. స్వార్థం ఒక్కొక్కప్పుడు మనల్నిమానవ సంబంధాలలో బంధించి ఉంచుతుంది లేకపోతె సంబధాలను త్రెంచుతుంది. అయితే ఇతరుల పట్ల శ్రద్ధ చూపడం,  ‘మంచి పొరుగు’ వారిగా ఉండటం అనే విలువలను పాటించడం వలన మాత్రమె మనలను ఈ భవబంధాలనుండి విడిపించగలదు.

మన రక్షకుడు ఈ లోకంనుండి నిష్క్రమించిన తర్వాత, భూమిపై మానవుల మధ్య తాను చేపట్టిన పని శాశ్వతంగా నిలిచి ఉండేలా ఏర్పాటు చేశాడు. తన ఆత్మ వహితులైన జనుల సమాజ ఏర్పాటుతో దానిని ప్రతిష్టాపన చేశాడు. తన నూతన ఉజ్జీవ సంస్కరణ శక్తితో ప్రభువు తన జనులను కలసి కట్టుగా వుంచేటటువంటి ఉద్దేశించిన బంధాలు మూడు. మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు! అందుకేనెమో యేసు మూడు పేటల బంధాన్నినిబంధనగా చేసాడు. అవి ప్రథమంగా క్రీస్తునందు విశ్వాసం. రెండు  ఒకరినందు మరొకరికి ప్రేమ. మూడవది లోక రక్షణ కోసం మన సర్వత్ర ప్రయత్నం. ఇవి క్రీస్తు శిష్యరికానికి కలిగిన మూడు ఆవిష్కరణలు. వీని ద్వారా సంఘం నిజమైన ఐక్యతలో స్థిరపడుతుంది. రక్షకుడు, నేటి సువార్త భాగంలో ఒకరియందు మరొకరికి  ప్రేమ" అనే అంశంపై ప్రత్యేకత చూపిస్తున్నాడు.

"మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది” అని అపొస్తలుడైన పౌలు మనకు చెబుతున్నాడు (రోమ 5:5). యేసు క్రీస్తు ప్రతీ అనుచరుని లక్షణం ప్రేమ. ఈ ప్రేమ గత గాయాలను క్షమించి మరచిపోవడానికి,  ప్రతీకార గాయానికి బదులుగా స్వస్థపరచి పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉంటుంది. క్షమాపణ, శాంతి, క్షమాపణ మరియు సయోధ్యకు యేసు సిలువ మాత్రమే మార్గం. యేసుక్రీస్తు తన మరణ పునరుత్థానముల ద్వారా మన కోసం గెలుచుకున్న మహిమా విజయం ప్రతీ సైతాను విధానాన్ని ఓడిస్తుంది. ఆయన తన శిష్యులను నిస్వార్థంగా ప్రేమించాడు. వారిని త్యాగపూరితంగా ప్రేమించాడు. వారిని అర్థం చేసుకొని ప్రేమించాడు. ఆయన వారిని క్షమించేలా ప్రేమించాడు. ఇది క్రైస్తవ శిష్యత్వానికి బాహ్య సంకేతం. అందుకే ఆయన స్పష్టంగా ఇలా అన్నాడు, “మీరు ఒకరినొకరు ప్రేమిస్తే, దీని ద్వారా మీరు నా శిష్యులని అందరు తెలుసుకుంటారు" (యోహా 13:35). మనం ఆయన ప్రేమను, సత్యాన్ని స్వీకరించి, ఆయన ఆత్మను అనుమతిస్తే, ఆయన ఆత్మ మన హృదయాలను మరియు మనస్సులను శుద్ధి చేస్తుంది. పరివర్తన చెందిస్తుంది. ఇది కొలతలు, సరిహద్దులు లేదా స్థాయిలు లేకుండా ప్రేమించడానికి, వంతెనలు, పరిమితు లేకుండా క్షమించడానికి, ప్రతిఫలం లేకుండా సేవ చేయడానికి అవసరమైన అంతర్గత స్వేచ్ఛ, ఆనందం మరియు బలాన్ని కనుగొనడానికి మనకు వీలు కల్పిస్తుంది యేసు ప్రేమ. ఇటువంటి ప్రేమ సామాజిక న్యాయం మరియు ధర్మాన్ని ప్రతిబింబిoపచేస్తుంది.

19వ శతాబ్దపు అధికారిక పత్రం (ఎన్సైక్లికల్) "రేరుం నోవారుం" ద్వారా తిరుసభ "పొరుగువారి ప్రేమ" లోని భావాన్ని దాని పరమార్థాన్ని చక్కగా వివరించింది. ఇది వ్యక్తి గౌరవం, సాధారణ మానవ మంచితనం, అందునా పారిశ్రామిక మూలధనం  కూలీల కష్టార్జితాల మధ్య కలిగియున్న సంబంధం గురించి చెపుతుంది. అదేవిధంగా వారి మధ్య కలిగియుండవలసిన సంఘీభావపు ప్రాముఖ్యతను కుడా నొక్కి చెబుతుంది. పరస్పర గౌరవం, న్యాయమైన విధానాలు మరియు సామాజిక శ్రేయస్సు కోసం ఉమ్మడి నిబద్ధతపై నిర్మించిన సమాజాన్ని ఈ అధికారిక పత్రం సమర్థిస్తుంది (పోపు లియో 13). ప్రేమను అభ్యసించడంలో మరొక అంశం మనల్ని మరియు ఇతరులను స్వస్థపరిచే శక్తిని కలిగి ఉంది. ప్రేమించడం అంటే స్వీకరించేవారిని మరియు ఇచ్చేవారిని కూడా స్వస్థపరచడం. ప్రేమించాలని నిర్ణయించుకోవడం అంటే జీవితానికి పూర్తి అంగీకారంతో ఉండటం. ఇది ఒక ఎంపిక అంతేకాని  కేవలం ఒక భావన కాదు. మనం ప్రేమించే, శ్రద్ధ వహించే, స్వస్థపరిచే, సహాయం చేసే మరియు క్షమించే వ్యక్తులుగా ఉండాలని ఎంచుకున్నప్పుడు, మన జీవితం ఎలా ఉండాలో అని అనుకున్నప్పుడు అలాగునే మనం కూడా ఎదుగుతాము.  దానిలో వేరే మార్గం కన్పించదు. అందువల్లనే యేసు నొక్కి చెబుతున్నాడు, 'నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా ఒకరినొకరు ప్రేమించుకోనుడి”.

 

"నేను మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను: నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా ఒకరినొకరు ప్రేమించుకొనుడి"


Saturday, 10 May 2025

“నేను వారిని ఎరుగుదును మరియు వారు నన్ను వెంబడిస్తారు” అపొ 13:14,43-52; ప్రక 7:9,14b-17; యోహాను 10:27-30 (ఈస్టర్ 4/C)

 


నేను వారిని ఎరుగుదును మరియు వారు నన్ను వెంబడిస్తారు”

అపొ 13:14,43-52; ప్రక 7:9,14b-17; యోహాను 10:27-30 (ఈస్టర్ 4/C)

ఎన్నుకోబడిన వారి దృష్టి దేవుని వైపు చూస్తారు” (Divine Office)

 

పాస్క కాలపు నాల్గవ ఆదివారంను “గుడ్ షెపర్డ్” ఆదివారం అని కూడా పిలుస్తారు. యేసు తనను తాను “మంచి కాపరి” అని పిలుచుకోవడం ద్వారా తన అధికారాన్ని సవాలు చేస్తున్నాడు (యోహా 10:11). సేవా జీవితానికి సంబంధించిన చాలా వృత్తులు ఒక కుటుంబం నుండి మాతృ తిరుసభ వరకు, ఒక సామాన్య కుటుంబంలోని తండ్రి నుండి పొత్తు కథోలిక తిరుసభ కుటుంబ  పరిశుద్ధ పోప్ తండ్రి గారి వరకు పోషింప బడుతున్నాయి. ఫ్రెంచ్ జెస్యూట్ గురువు, శాస్త్రవేత్త మరియు తత్వవేత్త అయిన తెయిల్‌హార్డ్ దే షార్దిన్ ఒకసారి ఇలా అన్నాడు, “నేను ఇప్పుడు ఇలా వున్నాను అంటే నా కుటుంబంవల్లనే. నా అభిప్రాయాలు, నా ఇష్టాలు మరియు అయిష్టాలు, నా విలువలు మరియు తీర్మానాలు చాలా వరకు నేను వచ్చిన కుటుంబం ద్వారానే నాలో రూపొందించబడ్డాయి.” అదేవిధంగా ప్రతీ తల్లిదండ్రులు తమ తమ కుటుంబ విశ్వాసపు జీవితానికి ముఖ్యమైన కాపరులుగా వుంటున్నారు. ఈ పాత్రను నెరవేర్చడంలో, తల్లిదండ్రులు లేదా కాపరులు తరతరాలుగా ఆధ్యాత్మిక అవసరాలను తీర్చే యేసు పిలుపు అనే విత్తనాలను నాటాలి.

దేవుడు తన నిబంధన సంబంధాన్ని మరియు తాను ఎన్నుకున్న ప్రజల పట్ల తాను కలిగియున్న శ్రద్ధను వివరించడానికి  “గొర్రెల కాపరి” అనే సారూప్య ప్రతిరూప ఉదాహరణను ఉపయోగిస్తాడు (కీర్త 80:1; 100:3). తన యవ్వనంలో తన తండ్రి మందను కాచిన దావీదును దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకు కాపరిగా అభిషేకించబడిన రాజుగా పిలిచాడు (యెహె 37:24). దావీదు వంశానికి చెంది దేవునిచే అభిషేకించబడిన రాజు అయిన యేసు, తన సంరక్షణకు అప్పగించబడిన ప్రజలందరికీ తనను తాను “మంచి కాపరిగా” పిలచుకున్నాడు (యోహా 10:29). ప్రభువైన యేసు మన ఆత్మలకు మంచి కాపరి మరియు సంరక్షకుడు అని అపొస్తలుడైన పేతురు మనకు చెబుతున్నాడు (1 పేతు 2:25). తనకు అప్పగించబడిన తన ప్రతి గొర్రెను ఆయన నిశితంగా మరియు వ్యక్తిగతంగా కాపాడుతాడు. ఆయన మనలోని ప్రతి ఒక్కరినీ తన శత్రువు అయిన సాతాను ఉచ్చుల నుండి కాపాడుతూ, తనను అనుసరించమని వ్యక్తిగతంగా పిలుస్తున్నాడు (యోహా 8:44). ప్రభువు మనలను మంచి పచ్చిక బయళ్ళు అయిన పరిశుద్ధాత్మ చెంతకు (యోహా 4:14; 7:38-39) నడిపిస్తున్నాడు. మనం ఆయన వాక్కును భుజించి, పరిశుద్ధాత్మ జీవజలాన్ని సేవిస్తే, ఆయన మహిమ మరియు గౌరవం కోసం ప్రతిరోజూ జీవించడానికి అవసరమైన పోషణ మరియు బలాన్ని మనం కనుగొనగలము.

అలెగ్జాండ్రియాకు చెందిన సిరిల్ (క్రీ.శ. 376-444) అనే పితృపాదుడు "వినుము" అనే పదం యేసు బోధించిన దానికి విధేయతను సూచిస్తుందని చెప్పాడు. యేసు వాక్కును వినే వ్యక్తులు ఆయనకు చెందినవారు. యేసుకు తెలియనివారు లేనే  లేరు. కానీ తెలుసుకోవడం అంటే ఆయన కుటుంబంలో భాగం కావడం అని అర్ధం. కాబట్టి, "నావాళ్ళు నాకు తెలుసు" (యోహాను 10:27) అని యేసు చెప్పినప్పుడు, ఆయన మనల్ని స్వీకరిస్తాడనీ, తనతో తన శాశ్వత ఆధ్యాత్మిక సంబంధాన్ని మనకు అందిస్తాడని అర్థం. ఆయన మనలా మారినప్పటి నుండి, ఆయన మానవులందరినీ తన బంధువులుగా చేసుకున్నాడు. అదే మానవ స్వభావాన్ని తాను పంచుకున్నాడు. క్రీస్తులో ఏకీకృత మానవ జాతి అనే భావన అన్ని రకాల మానవుల స్వాభావిక గౌరవాన్ని మరియు సామాజిక న్యాయం ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది (రేరం నోవారం – పోపు లియో 13). ఆయన మనుష్యవతార కారణంగా మనమందరం క్రీస్తుతో ఒకే ఆధ్యాత్మిక సంబంధంలో ఐక్యంగా ఉన్నాము. అయినప్పటికీ ఆయన పవిత్రత పోలికను కాపాడుకోని వారు ఆయన నుండి దూరం చేయబడతారు... ". నా గొర్రెలు నన్ను అనుసరిస్తాయి" అని క్రీస్తు చెప్పాడు. దేవుని కృప ద్వారా, మనం"దేవుని బిడ్డలము" (మత్త 5:9) గానే వుంటాము కానీ ఇకపై ఎన్నటికి అపవాది నీడలకు లోబడి ఉండలేము.

పునీత అగుస్టీను ఇలా అంటాడు, “మీరు ఆయనను విడిచిపెట్టకపోతే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు”. మనం ఆయనను విడిచిపెట్టకపోతే ఆయన మనలను ఎన్నటికీ విడిచిపెట్టడు. దేవుడిని, తిరుసభను లేదా ఇతరులను నిందించకూడదు. ఎందుకంటే మన విశ్వసనీయత సమస్య అనేది మన స్వయం కృతం. దేవుడు ఎవరికీ తన కృపను తిరస్కరించడు. నిరాకరించడు. దేవుని కృపను దృడoగా పొందుకోవడానికి ఇది మనకు బలమై ఉన్నది. ఇది మన యోగ్యత కాదు. కేవలం ఆయన “కృప” మాత్రమె. యేసు  సహవాసంలో ఉన్నవారు యేసుకు చెందినవారుగా శాశ్వత ఆనందాన్ని పొందుతారు. అపోస్థలుడు పేతురు గారి వారసుడు నవ పోపుగారు లియో (సింహరాయులు) 14 వారి ఆథ్యాత్మిక నడిపింపు మనలను దేవుని ప్రణాళికలో భాగస్తులను చేయ వలెనని ప్రార్ధన చేద్దాం.

మన హృదయాలను ఉత్తేజపరుద్దాం, మన విశ్వాసాన్ని తిరిగి ఉత్తేజపరుద్దాం...” (Divine Office)