AletheiAnveshana: వాక్య ధ్యానాoశము
Showing posts with label వాక్య ధ్యానాoశము. Show all posts
Showing posts with label వాక్య ధ్యానాoశము. Show all posts

Saturday, 14 February 2026

క్రీస్తు నివసించే చోట, ధర్మశాస్త్రం ప్రేమగా మారుతుంది సిరా 15:15–20; 1 కొరింథీ 2:6–10; మత్త 5:17–37 (A 6)

 

క్రీస్తు నివసించే చోట, ధర్మశాస్త్రం ప్రేమగా మారుతుంది

 

సిరా 15:15–20; 1 కొరింథీ 2:6–10; మత్త 5:17–37 (A 6)

దేవుడు తాను చేసినదంతా చూశాడు, అది చాలా బాగుంది. హల్లెలూయ.

 

పరలోక రాజ్యంలోని జీవన విధానం గురించి యేసు చెప్పిన పర్వత ప్రసంగాన్ని సువార్తికుడు మత్తయి మూడు భాగాలుగా కొనసాగిస్తున్నాడు. నేటి పఠనం ఆ మూడు భాగాలను అందిస్తుంది. మొదటి భాగం తోరాతో లేదా ధర్మ శాస్త్రంతో వ్యవహరిస్తుంది. రెండవ భాగం ఆరాధన మరియు మతపరమైన ఆచారాలతో వ్యవహరిస్తుంది మరియు ప్రభువు ప్రార్థనను కలిగి ఉంటుంది. మూడవ భాగం దేవుణ్ణి విశ్వసించడం మరియు పొరుగువారికి ప్రేమపూర్వక సేవ చేయడం గురించి వ్యవహరిస్తుంది. క్రైస్తవ శిష్యరికం అనేది  హృదయాన్ని తాకే మాటలు: “నేను ధర్మశాస్త్రాన్ని రద్దు చేయడానికి కాదు, నెరవేర్చడానికి వచ్చాను" (మత్త 5:17) అని యేసు మాట్లాడాడు. దేవుని ఆజ్ఞలు క్రీస్తులో రద్దు చేయబడలేదని, అయితే అవి ఆయనలో మాత్రమే నెరవేరాయని యేసు మనకు ధృవీకరిస్తున్నాడు.

 

చంప వద్దని, వ్యభిచరించ వద్దని, తప్పుగా ప్రమాణం చేయవద్దని యేసు ఆజ్ఞాపించాడు. క్రియ వెనుక దాగివున్న ఉద్దేశ్యపు లోతుల్లోకి వేళతాడు ఆయన. కోపం అవమానిస్తుందని, ధిక్కారం జీవితాన్ని గాయపరుస్తుందని ఆయన అంటాడు. కామంతో కూడిన చూపులు ప్రేమ నిబంధనను మోసం చేస్తాయి. అజాగ్రత్త మాటలు మరియు ప్రమాణాలు సత్యాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. యేసు మన జీవితాన్ని కష్టతరం చేయడం లేదు. ఆయన సత్యాన్ని వెల్లడిస్తున్నాడు. పాపం ప్రవర్తనలో కనబడే ముందు హృదయంలో ప్రారంభమవుతుంది.  ఎటువంటి రూపంలో దాగివున్న కోపాన్ని సహితం యేసు నిషేధించడంలేదు.  కానీ అది ధిక్కారం, సహవాసాన్ని నాశనం చేయడానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నాడు. ఆయన తన శిష్యులను ఉన్నత ప్రమాణాలకు పిలుస్తున్నాడు. వారు బలంగా ఉన్నందున కాదు, వారు పవిత్రంగా ఉండటానికి పిలువబడ్డారు కాబట్టి. యేసు తన సుప్రసిద్ధ ఆజ్ఞలను తీసుకొని మనల్ని లోతైన జీవితంలోనికి  నడిపిస్తాడు. పాపం చేతలో ప్రారంభం కాదు, హృదయంలో ప్రారంభమవుతుందని ఆయన చూపిస్తున్నాడు. చర్యలో కాదు, ఉద్దేశ్యంలో. క్రీస్తు "అక్షరానికి మించి తన ఆజ్ఞను నడిపించి మన ఆత్మకు తీసుకువస్తాడు" అని పునీత జాన్ క్రిసోస్టమ్ వివరించాడు. అదే విధంగా, హత్య కోపంతో ప్రారంభమవుతుంది. వ్యభిచారం  మరొకరిని ఒక వస్తువుకు తగ్గించే కామ చూపుతో ప్రారంభమవుతుంది. అబద్ధం విభజించబడిన హృదయంతో ప్రారంభమవుతుంది.


ఈ డిమాండ్ బోధన మనకు స్వస్థతను కలిగిస్తుంది. యేసు మనలను నిందించడం లేదు. ఆయన మన మానవ హృదయాన్ని నిర్ధారణ చేస్తున్నాడు. సయోధ్య ఇక్కడ ఒక నైతిక బాధ్యతగా మారుతుంది. ఆరాధన మరియు ప్రార్థనకు ముందు, శిష్యులమైన మనం శాంతిని కోరుకోవాలి. ఆగ్రహం, కామం, కులభరిత విభజన మరియు పరిష్కారం కాని సంఘర్షణలతో గుర్తించబడిన ప్రపంచంలో, నేటికీ ఇది ఒక తీవ్రమైన నైతిక డిమాండ్ కదా!! స్వచ్ఛత విషయాలలో, మానవ వ్యక్తిని నిష్పాక్షికంగా చూసే సంస్కృతిని యేసు సవాలు చేస్తున్నాడు. ఈ సువార్తను అనుసరించి,  “పవిత్రత అనేది అణచివేత కాదు, మరొకరి గౌరవం పట్ల గౌరవం అని బోధిస్తుంది మాతృ శ్రీ సభ. క్రీస్తు నివసించే చోట, చట్టం ప్రేమగా మారుతుంది మరియు ప్రేమ స్వేచ్ఛగా మారుతుంది. మనం బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు, శుద్ధి చేయబడిన హృదయాలను, స్వస్థత పొందిన (సం)బంధాలను మరియు సత్యంతో గుర్తించబడిన జీవితాలను కోరుకుందాం. అప్పుడు చట్టం ఇకపై మనపై చలామణి చేయలేదు - కానీ మనలోనే నివసిస్తుంది.

 

ఈనాటి సువార్త మన అంతర్గత ప్రపంచాన్ని పరిశీలించమని మనల్ని ఆహ్వానిస్తుంది. యేసు మనల్ని ఖండించడం లేదు. ఆయన మనల్ని మరింత లోతుగా ధ్యానించమని పిలుస్తున్నాడు. ఆయన విభజించబడని, స్వస్థత పొందిన మరియు స్వేచ్ఛగా ఉన్న హృదయాలను మాత్రమే కోరుకుంటున్నాడు. మనం దివ్యసత్ర్పసాదమును స్వీకరించినప్పుడు, ఈ సువార్తను పూర్తిగా జీవించిన వ్యక్తీ మరియు దేవుని ఏకైక కుమారుణ్ణి మనం స్వీకరిస్తున్నాము. ఆయనే మన హృదయాలను తిరిగి రూపొందించును గాక! మన ఉద్దేశాలను శుద్ధి చేయును గాక! మన జీవితాలను దేవుని రాజ్యానికి సజీవ సాక్షిగా చేయును గాక!

 

 

 

"నీ బలహీనత వల్ల ఒక సమయంలో నువ్వు తీసుకోలేని దాన్ని, నువ్వు పట్టుదలతో ఉంటే మరో సమయంలో గ్రహించగలవు."

Saturday, 7 February 2026

న్యాయో ధర్మ రక్షతి రక్షితః యెష 58:7-10; 1 కొరింథీ 2:1-5; మత్త 5:13-16 (A 5)

 

న్యాయో ధర్మ రక్షతి రక్షితః

యెష 58:7-10; 1 కొరింథీ 2:1-5; మత్త 5:13-16 (A 5)

"ప్రభువు శిలువ మనకు జీవవృక్షముగా మారింది."

 

ప్రవక్త యెషయా యూదా ప్రజల సజీవ విశ్వాసాన్ని యెరూషలేములో పునరుజ్జీవింపజేస్తున్న రోజుల్లోనే (సుమారు క్రీ.పూ.742), తన సమకాలీనుడైన ప్రవక్త ఆమోసు ఉత్తర ఇజ్రాయెలు ప్రాంత న్యాయస్థానాలలో (సుమారు 760–755 క్రీ.పూ.), న్యాయం నిరాకరించబడుతున్న పేదల కొరకు, వారి దుస్థితిని గురించి  (ఆమో 5:7-15) మరియు వారి వస్తువులు సహితం జప్తు చేయబడుతున్నాయని (5:11) తన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసాడు. తన వంతుగా, సామాజిక న్యాయం కోసం ఉద్వేగభరితమైన గొంతుతో యెషయా దండోరా చేసాడు. దేవుని సృజనాత్మకత మరియు తన మహిమ భూమినంతటిని  నింపుతుందనే అతని లోతైన నమ్మకం నుండి తన న్యాయమైన మరియు సమాకృత భావన పుట్టు కొచ్చింది (యెష 6:3). దైవిక ఉనికి పవిత్ర ఆలయాన్ని మాత్రమే కాకుండా మొత్తం సృష్టినంతటిని  నింపుతుందని నమ్మాడు. యెషయా మరియు ఆమోసు, ఇరువురునూ  పేదల దోపిడీ, నైతిక అవినీతి మరియు దైవిక తీర్పు అనివార్యతపై దృష్టి సారించారు. మానవులకు భూమిపై తగు న్యాయం వర్ధిల్లాలని యెహోవా కోరుకుంటున్నట్లు తమ గగ్ధత గొంతును వినిపించారు.

 

గడచిన ఆదివార ధన్యవచనాల బోధననంతరం, శిష్యరిక జీవితాన్ని వివరించడానికి నేడు “ఉప్పు” మరియు “వెలుగు” సుపరిచితమైన రూపకాలను యేసు ఉపయోగిస్తున్నట్లు నేటి సువార్త పఠనంలో మనం వింటున్నాము. నేటి సమాజం ఉప్పు మరియు “దీప స్థంభము”ను తేలికగా తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. నేటి ఆర్దికోన్నత స్థితే దీనికి కారణమని మనం చెప్పుకోవాలి. కానీ మన పురాతన సంస్కృతులలో, మనకు తెలిసినట్లుగా, ఈ వస్తువులు చాలా విలువైనవి. ఉప్పును రుచిని పెంచడానికి, సంరక్షణకారిగానూ మరియు వైద్యం చేసే ఏజెంట్‌గానూ ఉపయోగిస్తారు. ఉప్పును చూడలేము కానీ గ్రహించవచ్చు ఆస్వాదించవచ్చు. "చిన్న చిన్న చీమల" లాగా కష్టపడి పనిచేస్తూ, ఎల్లప్పుడూ మంచినే కాంక్షించి శ్రమిస్తూ సమాజంలో "గుర్తించ బడని" వ్యక్తులు చాలా మందినే ఉన్నారు. వీరే యేసు ఉపమాన పాఠoలోని ధన్యులు. వారిలో కొందరు "పర్వతం పైన" లేదా "దీప స్తంభం" (మత్త 5:14-15) పై  అర్హులయిన దరిద్రులకు న్యాయం చేయడానికి కృషి చేస్తున్నారు కదా!! మనమందరం ఉప్పు మరియు వెలుగుగా ఉండటానికి పిలువబడ్డాము. నజరేతులో తన 30 సంవత్సరాలకు పైగా, యేసు కూడా "ఉప్పు" లాంటివాడేనని మనం గ్రహించాలి!!

 

ఒకసారి, అలోషియస్ గొంజగా తన చిన్న తనంలో ఆడుకుంటున్నప్పుడు, ఎవరో ఒకరు తనను – కొన్ని నిమిషాల్లో తాను చనిపోతానని తెలిస్తే ఏమి చేస్తావని అడిగారట! అందుకు, "నేను ఆడుతూనే ఉంటాను" అని ఆ పునీత అలోషియస్ గొంజగా సమాధానం ఇచ్చాడట! ఆయన తన సాధారణ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉండేవాడు. సామాజిక న్యాయం పట్ల మన నిబద్ధత అనేది నేటి సువార్తలో యేసు మనకు ఇచ్చే తన ఉద్బోధ నుండి ప్రవహిస్తుంది. ఈ నిబద్ధత మనల్ని నడిపించే కొన్ని కార్యకలాపాలకు శారీరక మరియు ఆధ్యాత్మిక పనులుగా మరింత నిర్దిష్ట వ్యక్తీకరణగా  ఇవ్వబడ్డాయి. మనం ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇచ్చినప్పుడు, నగ్నంగా ఉన్నవారికి దుస్తులు ధరించినప్పుడు, దుఃఖిస్తున్న వారిని ఓదార్చినప్పుడు, మొదలైన వాటి ద్వారా, మనం భూమికి ఉప్పుగానూ  మరియు ప్రపంచానికి వెలుగుగానూ నిలుస్తాము. విశ్వాస సమాజంతో, పవిత్ర తిరుసభతో కలసి ఈ పనులను చేయ గలిగినప్పుడు, దాచబడలేని "పర్వతంపై నిలచి వెలిగే నగరం"గా మనము వ్యవహరిస్తున్నాము!

 

పోప్ ఫ్రాన్సీసు వారు  కథోలిక్కులను "అంచుల వరకు వెళ్లండి" అని పిలిపునందించాడు. అంటే "తన స్వంత భద్రతా సుఖానికి అతుక్కుపోయిన కార్పొరేటు విధి విధానాల వలయంలో చిక్కుకున్న సంఘం కంటే "నలిగి, మురికిగా మార్చ బడి వివస్తగా మార్చబడిన” క్రీస్తు సంఘాన్ని ఆలింగనం చ్చేసుకోవడాన్ని  ఆయన ఇష్టపడ్డాడు. నిష్క్రియాత్మక ఆశతో మన నిర్మాణాలలో మనం ఇక దాక్కుని ఉండలేము! “నిత్య అవసరతలు” పొందుకోలేనంత ఉబిలో కూరుకు పోయిన వారిని కలిసే ప్రమాదాన్ని సహితం ఎదుర్కోవాలని నేటి సువార్త మనల్ని ఆహ్వానిస్తుంది. ఇది పేదా బిక్కు వారికి తలోడ్డే సంస్కృతిని ప్రోత్సహించాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఈ రోజు మన సంఘానికి అవసరమైనది రక్త గాయాలను నయం చేసి, చలి హృదయాలను వేడి చేసి చైతన్య పరచే ధన్యులే కానీ భద్రతామయమైన సఖాన ఉయాలలూగడం కాదు.

 

క్రీస్తు వాక్కు సమృద్ధి ధన్యులైన వారితోనే నివసిస్తుంది.

 

 

 

 

 

Saturday, 31 January 2026

భయమును విశ్వాసంతో పోరాడు వారు ధన్యులు జెఫా 2:3; 3:12-13; 1 కొరింథీ 1:26-31; మత్త 5:1-12 (A 4)

 

 

 భయమును విశ్వాసంతో పోరాడు వారు ధన్యులు  

 

జెఫా 2:3; 3:12-13; 1 కొరింథీ 1:26-31; మత్త 5:1-12 (A 4)

"యెహోవా పర్వతమును ఎవరు ఎక్కుదురు? ఆయన పరిశుద్ధస్థలములో ఎవరు నిలబడుదురు?"

 

నేటి పర్వత ప్రసంగాన్ని గలిలయలో క్రీస్తు పరిచర్యకు కేంద్ర బిందువుగా పరిగణించవచ్చు. ఇది ఆతని బహిరంగ జీవిత మొదటి సంవత్సరంలో, సుమారు గలిలయ శీతాకాలం లేదా వసంతకాలపు మధ్య కాలంలో ఇవ్వబడింది అని వేద శాస్త్రులు భావిస్తున్నారు. బహిరంగ  పరిచర్య ప్రారంభంలోనే, అతి సాధారణ ప్రజల తమ జీవన పోరాటాలను గ్రహించిన యేసు ఒక పర్వత శిఖరం నుంచి, ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే మాటలయిన: "ఆత్మలో పేదలు ధన్యులు..." అని బోధించడం ప్రారంబించాడు. ఇవి నియమాలు లేదా నైతిక నినాదాలు అంత కంటే కానే  కావు. అవి దేవుని రాజ్యపు ముఖ చిత్రం. యేసు కాలంలోనే కాదు, నేటికీ సమాజం - విజయం, ఆధిపత్యం మరియు తనను తాను ఎలాగైనా రక్షించుకోవాలన్న కాంక్షను మాత్రమె కీర్తిస్తుంది. దానిని "ధన్యత లేదా ధన్యుడు" అని శ్లాఘిస్తుంది ఈ లోకం. కానీ యేసు అటువంటి తర్కాన్ని తలక్రిందులు చేస్తున్నట్లు మనకు ఈ నాటి ధన్య వచనాలలో కన్పిస్తుంది.

 

ఈ తర్కం యేసు అడుగుజాడల్లో నడిచే శిష్యత్వ ప్రయాణాన్ని కోరుతుంది. ప్రతి శుభప్రదంలోనూ లేదా ధన్య వచనంలోనూ చాలా అంతర్గత గమనాన్నే కలిగి వుంది. పేదలయిన వాళ్ళు  తమ  ఆత్మలో దేవునిపై ఆధారపడటాన్ని గుర్తిస్తారు. పాపం, అన్యాయం మరియు విసిగి విరిగి వేసారి పోయినందుకు దుఃఖించేటటువంటి వారే వీరు. సాత్వికులు దేవుని నియంత్రణలో ఆత్మ స్థైర్యమును కనుగొంటారు. నీతి కోసం ఆకలితో మరియు దాహంతో ఉన్నవారు లోతైన పవిత్రత కోసం ఆకాంక్షిస్టారు. కరుణామయ ప్రేమను వారు కలిగి ఉన్నట్లుగా వారు ప్రేమించబడతారు. వారి హృదయo స్వచ్ఛమైనది విభజించబడనిది. శాంతికాములు తండ్రి హృదయాన్ని ప్రతిబింబింప చేస్తారు. హింసింపబడినవారు ఇంకా హింసింపబడుతున్నప్పటికీ ఎల్లప్పుడూ నమ్మకంగానే  క్రీస్తులో ఉంటారు. ఇది యాదృచ్ఛిక లెక్క కాదు. ఇది క్రీస్తు మార్గం. సువార్తికుడు మత్తయి సమర్పించే అన్ని శుభప్రదాలలో శిలువ దాగి ఉందని గ్రహిద్దాం.

 

 

ఆంగ్ల పదం “బ్లెస్డ్" అంటే "సంతోషం(గా)” అని సాధారణ అర్ధం. కాని దాని కంటే ఎక్కువ అర్ధాన్ని ఈ పదం కలిగి వుంది. "బ్లెస్డ్" లేదా “సంతోషం(గా)” అన్న పదములకు గ్రీకు పదం “మకారియోస్‌” ను మత్తయి ఉపయోగించినట్లు మనకు అర్ధమౌతుంది కదా! ఈ పద అర్ధం కేవలం తాత్కాలిక “సంతోషం” కాదు. దేవునిలో పాతుకుపోయిన లోతైన మరియు అచంచలమైన ఆనందం. ఇది బాధలను తట్టుకుంటుంది. తిరస్కరణను భరిస్తుంది, హింసలోనూ అధికంగా తట్టుకుంటుంది. అందుకే యేసు, “సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును” అని చెప్పడానికి ధైర్యం చేసాడనుకుంటాను. నేటి ధన్య వచనాలు ఒక దైవ పిలుపు. ఓదార్పునిచ్చే స్థానం కాదు. ఇది గర్వ సంస్కృతిలో మనల్ని ఆత్మలో పేదలుగా ఉండటానికి సవాలు చేస్తుంది. ఉదాసీనత సంస్కృతిలో దుఃఖించడం నేర్చుకోవడానికి మనల్ని సవాలు చేస్తుంది. దూకుడు సంస్కృతిలో సాత్వికతను ఎంచుకోవాలని ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది. రాజీ సంస్కృతిలో నీతి కోసం ఆకలిని కలిగి ఉండాలని  మనల్ని ప్రోత్సహిస్తుంది. ప్రతీకార సంస్కృతిలో దయగలవారిగా ఉండటానికి మనకు శక్తినిస్తుంది. విభజించబడిన మనుష్యుల హృదయాల/మనసుల సంస్కృతిలో మనం స్వచ్ఛతను కోరుకోవాలని ఇది డిమాండ్ చేస్తుంది. విభజన సంస్కృతిలో శాంతిని సృష్టించేవారిగా ఉండటానికి ఇది మనల్ని బలోపేతం చేస్తుంది. విశ్వాసానికి వ్యతిరేకమైన సంస్కృతిలో దృఢంగా నిలబడటానికి ఇది మనల్ని బలపరుస్తుంది. శిలువ మరియు పునరుత్థానం ద్వారా చూసినప్పుడు మాత్రమే ఈ శుభ వచనాలు  అర్థవంతంగా ఉంటాయి.

 

 

మనం గర్వం కంటే వినయాన్ని, తీర్పు కంటే దయను, ఓదార్పు కంటే విశ్వాసాన్ని ఎంచుకున్న ప్రతిసారీ, మనం దేవుని రాజ్యాన్ని దృశ్యమానం చేయగలం. ధన్యతలు ఇప్పుడు మరియు ఎప్పుడునూ సమాజంలోని నిర్దిష్ట వాస్తవాలలో జీవించడానికి ఉద్దేశించబడ్డాయి. నేటి ధ్రువణ ప్రపంచంలో - రాజకీయ, జాతి, సైద్ధాంతిక - విభజనలను రేకెత్తించకుండా, వాటిని స్వస్థపరచడానికి, క్రీస్తు శాంతికి సాధనంగా మారడానికి మాతృ శ్రీసభ మనల్ని పిలుస్తుంది. విశ్వాసం అపహాస్యం చేయబడిన లేదా అణగదొక్కబడిన లౌకిక యుగంలో, ఈ ధన్యతలు మనల్ని దృఢంగా నిలబెట్టడానికి బలపరుస్తాయి - చేదుతో కాదు, ఆధ్యాత్మిక ఆశతో. మనం ధన్యతలను జీవిస్తే, ప్రపంచం ఎల్లప్పుడూ మనల్ని ప్రశంసించకపోవచ్చు - కానీ అది మనలో నివసిస్తున్న క్రీస్తును గుర్తిస్తుంది. ఇది తథ్యం.

 

"ఓ దేవా! విరిగిన మరియు నలిగిన హృదయాన్ని నీవు తృణీకరించవు" (కీర్త 51:17).

Friday, 23 January 2026

మనుష్యులను పట్టుకొనే జాలరులుగా పిలువబడిన వారు... యెష 8:23-9:3; 1 కొరింథీ 1:10-13, 17; మత్త 4:12-23 (A 3)


మనుష్యులను పట్టుకొనే జాలరులుగా పిలువబడిన వారు...

యెష 8:23-9:3; 1 కొరింథీ 1:10-13, 17; మత్త 4:12-23 (A  3)

 

...ప్రతి అర్చన వేడుక, ప్రధాన యాజకుడు క్రీస్తు మరియు అతని శరీరమైన పవిత్ర సంఘ  సంస్కారం (గా)... (సాక్రోసాంక్తుం కొన్సీలియుం)

 

ఒకసారి, ఎస్కిన్స్ అనే ఒక సాధారణ వ్యక్తి సోక్రటీసు వద్దకు వచ్చి, “నేను పేదవాడిని. నా దగ్గర ఇంకేమీ లేదు, గురు దక్షణగా నన్ను నేను నీకు అర్పించుకుంటాను” అని అన్నాడు. అందుకు సోక్రటీసు, “మీరు నాకు అన్నిటికంటే విలువైనదానిని ఇస్తున్నారని మీరు చూడలేదా?” అని సమాధానమిచ్చాడు. యేసు అంతగా నేపథ్యం లేని మత్స్యకారులను మనుషులను పట్టుకొనే జాలరులుగా మార్చాడు. యేసుకు కావలసింది తనకు తాముగా ఇచ్చుకొనే సాధారణ జనులు. గతంలో, “దైవ పిలుపు” అనే భావన గురుత్వ మరియు మఠవాస్య జీవితాన్ని ఉద్దేశించి మాత్రమె  బోధించేది. ఇప్పుడు అది బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరిని ఉద్దేశింప పునరుద్ధరించబడింది. దేవుడు మనలో ప్రతి ఒక్కరినీ  “నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను; నువ్వు నావాడివి” (యెష 43: 1) అని చెపుతూ ఎన్నుకున్నాడు. "మీరు నన్ను ఎన్నుకొనలేదు గాని, నేను మిమ్మును ఎన్నుకొంటిని; మీరు ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును మిమ్మును నియమించితిని. వెళ్లి ఫలించండి. నిలిచి ఉండే ఫలాలను ఫలింప చేయమని నేను నిన్ను నియమించాను" (యోహా 15:16) అని నేటి సువార్త ద్వారా, మనం మళ్ళీ మనుషులను పట్టే జాలర్లుగా యేసుచే పిలువబడుతున్నాము. మనం మంచి జాలరులమైతే.....

 

మంచి జాలరికి (i) చేప ఎరను పట్టే వరకు ఓపిక ఉండాలి. వారు అశాంతితో ఉంటే, ఇక ఎన్నటికి జాలరిగా మారలేరు. (ii) ఏమీ ఫలించనప్పటికీ నిరుత్సాహపడకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించే పట్టుదల వారికి ఉండాలి. (iii) అలాంటి సమయంలో ప్రజలకు నిజం చెప్పడంలో ఎటువంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేటటువంటి ధైర్యం ఆ జాలరులకు ఉండాలి. (iv) అటువంటి తరుణంలో జాలరికి మాట్లాడాలన్నా సరే సరైన క్షణం కోసం ఒక కన్ను వేసి ఉండాలి. చేప ఎరను కొరికే వరకు వేచి ఉండటానికి మౌనంగా వుండడం చాలా వుత్తమమం. (v) తెలివైన జాలరి తనను తాను తన స్పృహలోనే వుంచుకుంటూ తన స్వంత ఉనికిని గానీ, కనీసం  తన స్వంత నీడను కూడా ఎరవైపు పదనివ్వకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే చేప ఖచ్చితంగా అ ఏరను కాటు వేయదు. గేలానికి చిక్కదు. చివరగా, క్రీస్తు కోసం జాలరి ఎల్లప్పుడూ ప్రజలను తనవైపునకు ఆకర్షితులను చెసుకొనకుండా, యేసుక్రీస్తువైపు ప్రదర్శించడానికి లేదా మళ్ళించడానికి ప్రయత్నించాలి. మనుషుల దృష్టిని తమ వైపు కాకుండా, క్రీస్తువైపు మాత్రమే ఉంచడానికి లక్ష్యంగా పెట్టుకోవాలి. అలాకాక పొతే స్వరాజ్య పాలనలో క్రీస్తు పేరిట స్వంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొనే శోధనలో పడిపోవచ్చు. ఆ తరువాత సర్వ నాశనానికి గురుకావచ్చు. బాప్టిజం పొందిన ప్రతి క్రైస్తవుడు క్రీస్తు కోసం మనుష్యులను పట్టుకునే జాలరిగా మారుతూ ఈ లక్ష్యాలను పాటించడం మంచిది.

 

బప్తిస్మపు వెలుగులో ఉన్నవారికి ప్రపంచం చాలా అందంగా ఉంటుంది. యేసు వెలుగు లేకుండా చీకటిలో ఉన్నవారికి ప్రపంచం అతి భయంకరంగా ఉంటుంది. మనం వెలుగులో ఉన్నాము. ఇతరులను మనం ఈ వెలుగులోనికి తీసుకురావాలి. సీమోను పేతురు, ఆంద్రేయ, జేమ్స్ మరియు యోహానుల మాదిరిగానే, ప్రపంచంలో సజీవంగా మరియు చైతన్యంగా ఉన్న యేసుక్రీస్తు గురించి ప్రజలకు తెలియజేయడానికి మనం పిలువబడినావారము (మత్త 18:20). ఆయన వారిని ప్రేమిస్తున్నాడని మరియు వెలుగులోకి రమ్మని పిలుస్తున్నాడని మనం వారికి తెలియజేయాలి. యేసుక్రీస్తు మన కొరకు మాత్రమె రాలేదు. ప్రభువు నామమున స్వార్థపూరిత ఉద్దేశాలను పొందుకోవడానికి మనం పిలువబడలేదు. బదులుగా ఇతరులను క్రీస్తు వద్దకు తీసుకురావడానికి క్రీస్తు ఆత్మ వరమున పొందుకున్న మన స్వంత ప్రత్యేకమైన ప్రతిభను ఉపయోగించమని పిలువబడి నాము. పోపు ఫ్రాన్సీసు వారు, “లోతైన నీటిలోకి వెళ్లి చేపలు పట్టడానికి మీ వలలు వేయండి. మీరు కూడా ‘మనుష్యులను పట్టే జాలర్లు’ కావాలని పిలువబడినారు. ముఖ్యంగా మీ తోటివారిలో, మీ సహచరులలో, సువార్తకు సంతోషంగా సాక్ష్యమివ్వడానికి... మీ జీవితాన్ని అందించడానికి  వెనుకాడకండి” అని పిలుపు నివ్వడం మనం మర్చిపోకూడదు కదా!!!  

 

భూమిపై అర్చనా విధానం పరలోక ప్రార్థనా విధానంలో పాలుపంచుకొనే అవకాశం మనకు ముందస్తు రుచిగా ఇవ్వబడింది...” (సాక్రోసాంక్తుం కొన్సీలియుం)

Friday, 16 January 2026

ఇదిగో! దేవుని గొఱ్ఱె పిల్ల యెష 49:3, 5-6; 1 కొరింథీ 1:1-3; యోహా 1:29-34 (A/2)

 

ఇదిగో! దేవుని గొఱ్ఱె పిల్ల

 

యెష 49:3, 5-6; 1 కొరింథీ 1:1-3; యోహా 1:29-34 (A/2)

 

ప్రభువు నామమున వచ్చువాడు ధన్యుడు. అల్లెలుయా ( Divine Office)

 

క్రిస్టమస్ మరియు ప్రభువు బాప్తిస్మపు ఆనందం తర్వాత, మాతృ శ్రీసభ ఇప్పుడు మనల్ని సాధారణ అర్చన కాలానికి నడిపిస్తుంది. సాధారణం అంటే అప్రధానమైనది కాదు, కానీ మన విశ్వాసం మౌనంగా, నిశ్శబ్దంగా, స్థిరంగా మరియు నమ్మకంగా ఎదగగడానికి ఉద్దేశించిన క్రమబద్ధమైన అర్చన కాల సమయం. నేడు, ఈ అర్చన సీజను ప్రారంభంలోనే, తిరుసభ జోర్డాను వద్ద బాప్తిస్మ యోహాను ప్రకటనను మన ముందు ఉంచుతుంది. తన వైపు దృష్టిని ఆకర్షించకుండా, అధికారాన్ని కాంక్షించకుండా, వివరణలు ఇవ్వకుండా కేవలం, “ఇదిగో! అని యోహాను యేసును దేవుని గొఱ్ఱె పిల్ల అని పిలుస్తున్నాడు. ఇది యూదులకు పస్కా గొఱ్ఱె పిల్లను గుర్తు చేసింది. దాని రక్తం ఇశ్రాయేలును మరణం నుండి రక్షించిన విధానాన్ని (నిర్గ 12) గుర్తు చేసింది. ఇది వధకు గొఱ్ఱె పిల్లలా నడిపించబడిన బాధలో ఉన్న సేవకుని గురించి మాట్లాడిన ప్రవక్త యెషయాను ప్రతిధ్వనించింది (53:7). పాపాన్ని దానిని సమూలంగా పరిష్కరించేందుకు దేవుడే యేసును పంపాడని యోహాను అర్ధం చేసుకొని సాక్ష్య మిస్తున్నాడు.

 

 

ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించండి. యోహాను ఇలా అంటున్నాడు, “నేను ఆయనను ఎరుగను.” అంటే ఇది తన అజ్ఞానం కాదు. అది వినయం. విశ్వాసం మానవ నిశ్చయత నుండి మాత్రమే రాదని యోహాను మనకు బోధిస్తున్నాడు. యేసు తన హోదా ద్వారా కాదు, శక్తి ద్వారా కాదు, ఆత్మ కదలిక ద్వారా గుర్తించబడ్డాడు. యేసుపై దిగి వచ్చిన అదే ఆత్మ నేడు ఆయనను గుర్తించడానికి మన కళ్ళు తెరిపించేటి  ఆత్మ. దేవుని గొఱ్ఱె పిల్ల మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆయనను గుర్తించగలమా? మనం తరచుగా దేవుని బలం కోసం, విజయం కోసం నిశ్చయతతో వెతుకుతాము. కానీ దేవుడు గొఱ్ఱె పిల్లగా వస్తాడు. అతడు సౌమ్యుడు, వినయాన్వితుడు, దుర్బలుడు. అప్పుడు చాలామంది ఆయనను గమనించక ఆయనను కోల్పోయారు. ఇప్పుడు చాలామంది ఆయనను గమనించక కోల్పోతున్నారు. ఎందుకంటే ఆయన మన అంచనాలకు మించి వున్నాడు. మనం ఆయన అంచనాలను కనుగోనలేము. అయినప్పటికీ యోహాను మనకు స్పష్టంగా చెబుతున్నాడు: “ఈ గొఱ్ఱె పిల్ల లోక పాపాన్ని తీసివేస్తుంది” అని. వ్యక్తిగత తప్పులు మాత్రమే కాదు, మానవాళిని దేవుని నుండి వేరు చేసే లోతైన విచ్ఛిన్నతను సహితం ఆయన తెసివేస్తాడు. అందుకే యేసు ఒక గురువు లేదా నైతిక ఉదాహరణ కంటే ఎక్కువ మేలైన వాడు. ఆయన విమోచకుడు. ఆయన యోహాను కంటే ముందు ఉన్నవాడు. ఆయన ఆత్మతో నిండి ఉన్నవాడు. ఆయన నీటితో శుద్ధి చేయబడడు, ఆనీటిని శుద్ధి చేస్తాడు. పరిశుద్ధాత్మతో బాప్తిస్మం తీసుకుంటాడు. పరిశుద్దాత్మలో మనకు బాప్తిస్మమిస్తాడు. ఆయన బయట మాత్రమే కాకుండా, లోపలిని సహితం శుద్ధి చేసి కొత్త జీవితాన్ని మనకు ఇస్తాడు.

 

బాప్తిస్మమిచ్చు యోహాను యేసుతో పోటీ పడలేదు. కానీ "ఆయన హెచ్చింప బడాలి. నేను తగ్గింప బడాలి" అని సాక్ష్యం ఇచ్చాడు. స్వీయ-ప్రమోషన్‌ కోసం ప్రోత్సహించి పోటీపడే ప్రపంచంలో, యోహాను స్వీయ-సమర్పణ విలువను బోధిస్తున్నాడు. గందరగోళ అల్లర్లను, ఆకర్షణను కోరుకునే సంస్కృతిలో, మౌనంగా, నిశ్శబ్దంగా స్పష్టంగా క్రీస్తు వైపు లోకాన్ని ఎలా చూపించాలో ఆయన మనకు బోధిస్తున్నాడు. నిజమైన శిష్యరికం అంటే మనల్ని మనం తెలియ జేసుకోవడం కాదు—అది క్రీస్తును కనిపించేలా చేయడం. యేసు లోక పాపాన్ని తొలగించి యన్నట్లు మనం గ్రహించినట్లయితే, ఆయనకు చెందినవారుగా  పాపమునకు భిన్నంగా జీవించాలి. అలా కాకపొతే మనం గొఱ్ఱె పిల్లను స్వీకరించలేము మరియు చేదు, అన్యాయం, నిజాయితీ లేదా ఉదాసీనతతో జీవితాన్ని జీవించడం కొనసాగించలేము.

 

గొఱ్ఱె పిల్లను అనుసరించడం అంటే – తీర్పు కంటే దయ, గర్వం కంటే వినయం, శక్తి కంటే సేవ మరియు ప్రతీకారం కంటే క్షమాపణను ఎంచుకోవడం. మనం ప్రార్థనకు వచ్చిన ప్రతిసారీ, గురువు  : “ఇదిగో దేవుని గొఱ్ఱె పిల్ల” అన్న యోహాను మాటలను పునరావృతం చేయడం వింటాము. కానీ ప్రశ్న ఇంకా మన ముందే మిగిలిపోయి వుంటుంది. మనం నిజంగా ఆయనను చూస్తున్నామా, గమనిస్తున్నామా —లేదా ఈ మాటలు నిత్యకృత్యంగా మారి పోయాయా? ఆయన దివ్య వాక్యంలోనూ, దివ్య సత్ప్రసాదoలోనూ,  గాయపడినవారిలోనూ, మన దైనందిన జీవితంలోని నిశ్శబ్ద క్షణాల్లో ఆయనను మనం గుర్తించ గలుగుతున్నామా? మనం ఈ సాధారణ అర్చన కాల సమయాన్ని ప్రారంభించు చునప్పుడు, నిశ్శబ్దంగా కానీ స్పష్టంగా తనను సూచించే విధంగా జీవించమని ప్రభువు మనల్ని సాధారణ విశ్వాసంలోకి ఆహ్వానిస్తున్నాడు. మన మాటలను, మన ఎంపికలను మరియు మన ప్రేమ జీవితాన్ని యోహాను “ఈయన దేవుని కుమారుడు” అని ఒకసారి జోర్డాన్‌లో చెప్పినట్లుగా ప్రపంచానికి చెప్పనివ్వండి.

 

శాంతి బంధంలో ఆత్మ ఐక్యతను కాపాడుకోవడానికి మీరు చేయగలిగినదంతా చేయండి” ( Divine Office)

Friday, 9 January 2026

“క్రీస్తు నీటిని శుద్ధి చేయడానికి బాప్తిస్మం తీసుకున్నాడు” యెష 42:1-4, 6-7; అపొ 10:34-38; మత్త 3:13-17 (A)




క్రీస్తు నీటిని శుద్ధి చేయడానికి బాప్తిస్మం తీసుకున్నాడు

యెష 42:1-4, 6-7; అపొ 10:34-38; మత్త 3:13-17 (A)

మహాత్మ్యముగల దేవుని స్వరం జలాలపై ప్రతిధ్వనిస్తుంది.”

 

ఈ రోజు మనం ప్రభువు జ్ఞానస్నాసపు పండుగను జరుపుకుంటున్నాము. ఇది యేసు ఉనికి మరియు ఆతనిలోని మన ఉనికిని వెల్లడిచేస్తుంది. జోర్డాను నది వద్ద,  పాపులు పశ్చాత్తాపం కోరుకునే నీటిలోకి యేసు అడుగుపెడు తున్నాడు. అయినప్పటికీ అతను పాపరహితుడు. అతను “పాపం తప్ప అన్ని విషయాలలో మనలాగే ఉన్నాడు” (హెబ్రీ 4:15) అని లేఖనాలు మనకు చెబుతున్నాయి. అయితే అతను బాప్తిస్మం తీసుకోవాలని ఎందుకు కోరుకున్నాడు?  మన పితృపాదులు నాజియాన్జస్‌ అనే ప్రాంతానికి చెందిన పునీత గ్రెగొరీ వారి మాటల ద్వారా మన మాతృ తిరుసభస, “క్రీస్తు శుద్ధి చేయబడాల్సిన అవసరం ఉన్నందున కాదు, నీటిని శుద్ధి చేయడానికి బాప్తిస్మం తీసుకున్నాడు” అని మనకు చక్కటి సమాధానమిస్తుంది. తాను శుద్ధి చేయబడటానికి యేసు జోర్డాను నదికి వెళ్ళలేదు.  ఆ నీటిని శుద్ధి చేయడానికి అతను నది లోపలికి వెళ్ళాడు. అతని సన్నిధి లేదా ఉనికి ద్వారా, నీళ్లు మార్పు చెందాయి. పవిత్రులు జలంలో దిగడం వల్ల ఆ జలం పవిత్రమౌతాయి గానీ ఎటువంటి జలం ఏనాటికీ పవిత్రులను కడుగలేదు కదా!! బాప్టిజంలో మనకు కొత్త జీవితాన్ని ఒసగడానికై, క్రీస్తు నీటిలోకి దిగడం ద్వారా అన్ని జలాలను పవిత్రం చేశాడని పవిత్ర సత్యోపదేశo మనకు బోధిస్తుంది (CCC 536–537).

 

దీని అర్థం – ప్రతి బాప్టిజం మన బప్తిస్మముతో సహా – ఈ క్షణం నుండే దాని పరమ శక్తిని పొందుతుంది. మనపై నీరు పోయబడినప్పుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు, క్రీస్తు స్వయంగా ఈ చర్యను ప్రభావితం చేస్తున్నాడు. మనల్ని శుద్ధి చేస్తూ, స్వస్థపరుస్తూ, తిరిగి నూతనంగా సృష్టిస్తున్నాడు. యోర్దాను నది వద్ద, స్వర్గం తెరుచుకుంది. ఆత్మ దిగి వచ్చింది. తండ్రి స్వరం, "ఈయన నా ప్రియమైన కుమారుడు" (మత్త 3:17) అని వినబడింది. ఇక్కడ పవిత్ర త్రిమూర్తులలో ప్రతీ ఒక్కరి రహస్యం వెల్లడైంది. ఒకప్పుడు పాపంతో మూసివేయబడిన స్వర్గం మళ్ళీ తెరవబడింది. పునీత గ్రెగొరీ చెప్పినట్లుగా, ఆదాము మూసివేసిన ద్వారాలను క్రీస్తు తెరిచాడు. జోర్డాను అరణ్యం గుండా ప్రవహిస్తుంది. అది బంజరు మరియు పోరాట ప్రదేశం అయినప్పటికీ అక్కడే వెలుగు విస్ఫోటనం చెందుతుంది. యెషయా వాగ్దానం: "చీకటిలో నడిచిన ప్రజలు గొప్ప వెలుగును చూశారు" (యెష 9:2) అన్న ప్రవచనం  నెరవేరింది. బాప్తిస్మమే  ఈ వెలుగు. సత్యోపదేశo దీనిని ప్రకాశం అని పిలుస్తుంది. ఎందుకంటే ఇది ఆత్మను ప్రకాశవంతం చేస్తుంది కాబట్టి  (CCC 1216).

 

కానీ ఈ ఉత్సవం క్రీస్తు బాప్తిస్మము గురించి మాత్రమే కాదు, ఇది నేటి మన బాప్టిజం గురించిన ఉద్దేశ్యాన్ని కలిగి వుంది. పునీత గ్రెగొరీ, “క్రీస్తు బాప్తిస్మం తీసుకున్నాడు. మనం ఆయనతో పాటు దిగి వెళ్దాం. తద్వారా మనం ఆయనతో కూడా లేచి నూతన జీవితంలోకి నడవవచ్చు” అని మనల్ని ఇలా సవాలు చేస్తున్నాడు. బాప్టిజంలో మనం క్రీస్తుతో మరణిస్తున్నామని తద్వారా మనం ఆయనతో లేచి నూతన జీవితంలో నడుస్తున్నామని (రోమా 6:4) పునీత పౌలుడు మనకు చెబుతున్నాడు.  మీరు చర్చికి హాజరయ్యే వ్యక్తులు మాత్రమే కాదు. మీరు బాప్తిస్మం తీసుకున్నవారు. నీవు భయంలో లేదా చీకటిలో జీవించకూడదు. నీవు వెలుగు బిడ్డవు. నీవు  సువార్తకు ప్రేక్షకునివి  కాదు – నీవు క్రీస్తుకు ప్రత్యక్ష సాక్షివి. పాపం నిశ్శబ్దంగా తిరిగి వచ్చే చోటును  మరియు సమయాన్ని తిరస్కరిoచు. రాజీపడని వెలుగును ఎంచుకో!! నీ ఇల్లు, కార్యాలయం మరియు సమాజాలలో నీవు దేవుని కుమారుడవు కుమార్తెవు. అలాగునే మాట్లాడండి. వ్యవహరించండి. పవిత్ర జలంతో నిన్ను నీవు ఆశీర్వదించుకున్నప్పుడు, గుర్తుంచుకో - ఈ జలాలను క్రీస్తు నీ కోసం శుద్ధి చేసాడని!!!

 

"ఈయన నా కుమారుడు, ఆయనయందు నేను చాలా సంతోషిస్తున్నాను. కాబట్టి, ఆయన మాట వినండి".