AletheiAnveshana: వాక్య ధ్యానాoశము
Showing posts with label వాక్య ధ్యానాoశము. Show all posts
Showing posts with label వాక్య ధ్యానాoశము. Show all posts

Saturday, 15 November 2025

నీతి సూర్యుడు రానై యున్నాడు మలాకీ 3:19-20; 2 థెస్స 3:7-12; లూకా 21:5-19 (C 33)

 

నీతి సూర్యుడు రానై యున్నాడు

 

మలాకీ 3:19-20; 2 థెస్స 3:7-12; లూకా 21:5-19 (C 33)

మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును” (మలాకీ 4:2)

 

నేటి సువార్త మనుష్యకుమారుని రెండవ రాకడ గురించి హెచ్చరిస్తుంది. అర్చనా సంవత్సరం ముగిసే సమయానికి, మాతృ శ్రీసభ “పరూసియా” (క్రీస్తు పునరాగమనం) రహస్యాన్ని మన ముందు ఉంచుతుంది. అదే సమయంలో "అంతిమ  విషయాలు" - మరణం, తీర్పు, నరకం లేదా స్వర్గం వంటి విషయాల గురించి ఆలోచించమని మనల్ని ఆహ్వానిస్తుంది. గ్రీకు పదం “పరూసియా” అనేది  పారా” (ప్రక్కన) మరియు “ఊసియ” (సారాంశం) అనే రెండు పదముల కలియకే “పరూసియా”. దీని సాహిత్యపరమైన అర్థం “ఉనికి,” లేదా “రాక”. ఈ “పరూసియా” నూతన నిబంధనలో తరచుగా “యేసు రెండవ రాకడ”ను అందునా ఆదిమ క్రైస్తవ్యం సుమారు క్రీ. శ. 64 దశకంలోనూ మరియు నేటి సిద్దాంతిక వేదాంతం సూచిస్తూ వుంటుంది. యూదుల లేఖనాలలో “ప్రభువు రోజు” అనే భావన ఒకటి ఉంది. ఆయా లేఖనాలు “సమయం” రెండు యుగాలలో ఉన్నట్లుగా భావిస్తున్నాయి. అది మొదట, పూర్తి చెడుగానూ, నయం చేయలేనిదిగానూ మరియు నాశనానికి మాత్రమే అర్హమైన యుగంగానూ  ఉంటుంది. రెండవది రాబోయే దేవుని స్వర్ణయుగం. కానీ ఈ రెండింటి మధ్య “ప్రభువు రోజు/గడియ”  అనేది ఉంటుంది. ఇది విశ్వ తిరుగుబాటు మరియు విధ్వంసం. ఇది ఒక నూతన యుగపు తీరనీ, ప్రసవ వేదనల భయంకరమైన సమయంగానూ సూచిస్తుంది. దీనినే మన క్రైస్తవ్యం “పరూసియా”లేదా “ప్రభువు రోజు” అని ప్రతిబింబింప చేస్తుంది.

 

అది ఒక భయానక దినం. “ఇదిగో ప్రభువు దినము వచ్చును. అది క్రూరమైనది, ఉగ్రతతోను, తీవ్రమైన కోపముతోను, భూమిని నాశనం చేయుటకును పాపులను దానినుండి నశింపజేయుటకును వస్తుంది” (యెష 13:9; యోవే 2:1-2 పోల్చండి; ఆమో 5:18-20; జెఫా 1:14-18). అది అకస్మాత్తుగా వస్తుంది. “రాత్రి దొంగ వచ్చునట్లు ప్రభువు దినము వచ్చును” (1 థెస్స 5:2; 2 పేతు 3:10 పోల్చండి). అది లోకము ముక్కలైపోయే దినం అవుతుంది. “ఆకాశ నక్షత్రములును వాటి నక్షత్రరాసులును తమ కాంతిని లోల్పోతాయి. సూర్యుడు ఉదయించినప్పుడు వెలుగు లేకుండా చీకటిగా ఉండును. చంద్రుడు తన కాంతిని కోల్పోవును.... కాబట్టి, ఆయన ఉగ్రమైన కోప దినమున ఆయన ఉగ్రత వలన భూమి తన స్థానము నుండి కదలింపబడును” (యెష 13:10-13; యోవే 2:30-31; 2 పేతు 3:10). యేసు కాలంలో యూదు మతపరమైన ప్రాథమిక భావనలలో లూకా సువార్తికుడు మనకు సమర్పించే  “ప్రభువు దినం” అందులో ఒకటి (లూకా 21:9; 21:11; 21:25-26).

 

దేవుడు న్యాయవంతుడు మరియు ప్రతి వ్యక్తికి అతను భూమిపై సంపాదించిన దానినే (బట్టే) ఇస్తాడు. ఆయన ఏకపక్షంగా శిక్షించడు. ప్రతిఫలం దానిని బట్టే వుండును. ఆయన మన స్వేచ్ఛను గౌరవిస్తాడు. అయినప్పటికీ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, మనకు ఇకపై ఎంచుకునే స్వేచ్ఛ ఉండదని మనం గుర్తుంచుకోవాలి. "పశ్చాత్తాపపడకుండా మరియు దేవుని దయగల ప్రేమను అంగీకరించకుండా ప్రాణాంతకమైన పాపంలో చనిపోవడం అంటే మన స్వంత స్వేచ్ఛా ఎంపిక ద్వారా ఆయన నుండి శాశ్వతంగా వేరుగా ఉండటం" (సత్యోపదేశం లేదా CCC 1033).

 

నేటి సువార్త రెండవ భాగంలో, తన అనుచరులు తన ఎడల కలిగిన తమ నమ్మకాల వలన హింసలను ఎదుర్కొంటారని యేసు హెచ్చరిస్తున్నాడు. లూకా సువార్తికుడు హింసను యేసు అనుచరులకు ఒక అవకాశంగా ప్రతిపాదిస్తున్నాడు. ఎందుకంటే “ఇది మీకు సాక్ష్యమివ్వడానికి దారితీస్తుంది” (లూకా 21:13). కాబట్టి హింసల కాలంలో దేవుని జ్ఞానం మరియు శక్తి యేసు తన అనుచరులకు ఒక ఉదాహరణగా చూపబడుతుంది. హింసను ఎదుర్కొనే పట్టుదల వారి రక్షణకు దారి తీస్తుంది. కష్ట సమయాల్లో కూడా విశ్వాసులకు తాను అండగా ఉన్నాడని ఇక్కడ యేసు తన అనుచరులకు హామీ ఇస్తున్నాడు. చివరికి, యేసు తన మరణంతోనే దీనికి సాక్ష్యమిస్తున్నాడు. యేసు శిష్యులుగా, మనం కష్టాలను ఎదుర్కొన్నప్పుడు దేవుని దయా రక్షణను విశ్వసిస్తూ, ఆయన మాదిరిన అనుసరించడానికి ప్రయత్నిoచుదాము.

 

“ఆయన లోకమునకు న్యాయమునుబట్టియు, తన సత్యమునుబట్టి జనములకు తీర్పు తీర్చును”

 

 

Friday, 7 November 2025

మీరు దేవుని ఆలయం: యెహె 47:1-2,8-9,12; 1 కొరింథీ 3:9-11,16-17; యోహా 2:13-22 (C 32)

 

మీరు దేవుని ఆలయం

 

యెహె 47:1-2,8-9,12; 1 కొరింథీ 3:9-11,16-17; యోహా 2:13-22 (C 32)

సైన్యములకధిపతియగు యెహోవా, నీ నివాసస్థలము ఎంత మనోహరమైనది!” (కీర్త 84:1)

 

నేటి మన అర్చన పఠనాలలో మనకు కన్పించే జెరూసలేం దేవాలయం రక్షణ చరిత్రలో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. క్రీస్తు పూర్వం 966 సంవత్సరాల క్రితం సొలోమోను మహా రాజు,  దేవుని అద్భుత నివాస స్థలమైన మొదటి ఆలయాన్ని యేరుసలేములో తన ప్రజలమధ్య నిర్మించాడు. దాని ద్వారా జెరూసలేము ఇజ్రాయేలీయుల రాజరిక మరియు మత కేంద్రంగా మొదట రూపు దిద్దుకొన్నది. అయితే, ఆ ఆలయాన్ని క్రీస్తుపూర్వం 586 సం.లో బాబిలోనియన్లు నాశనం చేస్తూ స్థానికులను తమ దేశానికి బానిసలుగా తరలించారు. తరువాత నాయకుడు జెరుబ్బాబెలు నాయకత్వంలో, ఆ యూదులు బాబిలోను నుండి తిరిగి వచ్చి తమ పవిత్ర ఆలయాన్ని పున:నిర్మించడం ప్రారంభించుకున్నారు. ఇది క్రీస్తు పూర్వం 516 సం.లో, పర్షియా రాజు డారియుసు I పాలనలో, ప్రవక్తలు హగ్గయి మరియు జెకర్యా కాలంలో పూర్తికాబడి మరొకసారి సర్వాధిపతి దేవునకు అంకితం చేయబడింది. శతాబ్దాల తరువాత, హేరోదు రాజు అదే ఆలయాన్ని పునరుద్ధరించి మరి కొంతగా విస్తరింప చేశాడు. అది ఇజ్రాయేలీయుల  ప్రతిభకు గర్వకారణం! కానీ యేసు మాత్రం దాని  భవిష్య పతన వాణిని చెప్పినట్లుగా, రోమన్లు దానిని సుమారు క్రీ. శ. 70 సం.లో ​​సర్వ నాశనం చేశారు.

 

నేటి సువార్తలో,  అదే ఆలయాన్ని శుభ్రపరిచే యేసు కోపాగ్ని కథను మనం వింటున్నాము. సువార్తికుడు లూకా దానిని రెండు భాగాలుగా ప్రస్తావిస్తున్నాడు. మొదటిగా, ఆలయ ప్రాంగణంలో డబ్బును చిల్లరిగా మార్చేవారిని మరియు వ్యాపారులను యేసు తరిమికొట్టడం, మరియు రెండవదిగా, “ఈ ఆలయాన్ని నాశనం చేయండి, మూడు రోజుల్లో నేను దానిని తిరిగి నిర్మిస్తాను” అని ఆలయ విధ్వంసం గురించి ఆయన ప్రవచనం చేపినప్పుడు యూదులకు కోపం వచ్చింది. కారణం ఆ ఆలయం యూదు జీవితానికి గుండె. దాని నాశనం వారి వినాశనమే! ఆలయం దేవుని ఉనికిగా కనిపించే ప్రామాణిక సంకేతం కాబట్టి యేసు ప్రవచనానికి వారు ఆశ్చర్యపోయారు. మరియు యేసు తనను తాను దేవుని అసలైన నిజమైన ఆలయము గానూ, దేవుని నివాస స్థలంగానూ ప్రకటించు కున్నప్పుడు వారికి గొంతు మ్రింగుడు పడలేదు. అది పస్కా పండుగ సమయం. వేలాది మంది యాత్రికులు తమ తమ బలులను  సమర్పించు కోవడానికి యెరూషలేముకు వచ్చారు. అటువంటి సమయంలో వారి సౌలభ్యం కోసం, ఆలయ ప్రాంగణంలో జంతువులను అమ్మడం, తమ డబ్బును ఆలయ పన్ను కోసం రోమను నాణేలుగా మార్చుకోవడం జరిగేది. ఈ పద్దతులు ఆచరణాత్మకమైనవి అయినప్పటికీ, దేవుని ఇంటిని వాణిజ్య స్థలంగా మార్చి వేశాయి. ఇదే యేసు కోపానికి కారణమైనది.

 

యేసు ఆయా వ్యాపారులను వెళ్ళగొట్టినప్పుడు, ఆయన ఆలయాన్ని ఖండించలేదు కానీ ఆ ఆలయ ఉద్దేశ్యాన్ని శుద్ధి చేస్తున్నాడు. దైవారాధనను దురాశతో లేదా స్వార్థంతో ఏకం చేయకూడదనీ, ప్రజలు దానిని అర్థం చేసుకోవాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఒక కొత్త వాస్తవికతను నేర్పిస్తున్నది ఏమిటంటే  దేవుడు ఎన్నడూ రాతి భవనాలలో నివసించడు. కానీ మానవ సజీవ హృదయాలలో – మొదట ఒకరి స్వంత శరీరంలోనూ, మరియు విశ్వాస సంఘంలో వాసమై ఉంటాడు అని నేర్పిస్తున్నాడు. ప్రవక్త యెహెజ్కేలు చెప్పిన ఆలయం నుండి ప్రవహించే నది (యెహే 47) అనేది పవిత్రాత్మ శక్తివంతమైన ప్రతిరూపం. ఈ నది క్రీస్తు మరియు అతని పవిత్ర సజీవ సంఘం నుండి ప్రవహిస్తుంది. అది సమస్త ప్రపంచానికి జీవం, స్వస్థత మరియు పునరుద్ధరణను తీసు కొస్తుంది. పాపం నుండి మనల్ని శుద్ధి చేస్తుంది. ఆత్మలో మనకు నూతన  జీవితాన్ని ఇస్తుంది. దివ్య సంస్కారముల ద్వారా,  అందునా జ్ఞాన స్నానం, దివ్య సత్ర్పసాద సంస్కారముల ద్వారా, మనం ఈ జీవజలాన్ని పొందుతాము.

 

యేసు కోపం -  దేవుని ఆలయాలుగా మనం పిలువబడ్డామని గుర్తుచేస్తుంది. అందుకే , "మీరు దేవుని ఆలయమని మరియు దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా?" (1 కొరింథీ 3:16) అని పునీత పౌలుడు అంటాడు. యేసు ఆ భౌతిక యేరూషలేము ఆలయాన్ని శుద్ధి చేసినట్లే, మన హృదయాలు మరియు ఆత్మలను కూడా తరచుగా స్వార్థం, గర్వం, అసూయ లేదా ఉదాసీనతల నుండి శుద్ధి చేయడం అవసరం. దేవునితో మన సంబంధం ఒక వ్యాపార లావాదేవీ కాదు. ఇది పిల్లలు తమ ప్రేమగల తండ్రి పట్ల కలిగి ఉన్న ప్రేమగల సంబంధంలాంటిది. దేవుడు మన బేరసారాలను కోరుకోడు. కానీ మన హృదయాలను కోరుకుంటాడు (కీర్త 51). మన దేవుడు జీవించే సజీవ  దేవుడు. అప్పుడు మన ఆరాధన కూడా సజీవంగా ఉండాలి కదా! నిజాయితీగా, ఆనందంగా మరియు చురుకుగా ఉండాలి. మనం పవిత్ర ప్రార్థనలో పాల్గొన్నప్పుడు మనం ఒక ప్రేక్షకులంగా కూర్చోకూడదు. గురువు చేసే పూజలో  క్రీస్తుతో పాటు బలిపీఠంపై మన జీవితాలను అర్పిస్తున్నామని మర్చి పోకూడదు. చివరగా, యేసు కోపం మన విశ్వాస సమాజాన్ని సజీవ ఆలయంగా చూడమని సవాలు చేస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ సజీవ శిల. మరియు మనమందరము  కలిసి దేవుని నివాస స్థలాన్ని ఏర్పరుస్తున్నాము. కాబట్టి మన భక్తి, ఐక్యత మరియు సేవ ద్వారా మన ఆలయాన్ని పవిత్రంగా ఉంచుకుందాం. మన యేసు క్రీస్తు శరీరాలయమైన సంఘాన్ని నిర్మించడానికై మన విచారణను, మన సమాజంను, మన కుటుంబాలను,  మన సమయాన్ని, ప్రతిభను ప్రభువుకు సమర్పిద్దాం. దేవుడు మీకు తోడై వుండును గాక!!

 

బాప్టిజం మనలో ప్రతి ఒక్కరినీ దేవుని ఆలయంగా చేస్తుంది” (పునీత సీజరియస్ ఆఫ్ అర్లెస్)

Saturday, 1 November 2025

కాలం చేసిన వారందరి జ్ఞాపకార్థమై ఈ రోజు.... జ్ఞాన 3:1-9; రోమీ 5:5-11; యోహా 6:37-40 (C)

 

కాలం చేసిన వారందరి జ్ఞాపకార్థమై ఈ రోజు....

జ్ఞాన 3:1-9; రోమీ 5:5-11; యోహా 6:37-40 (C)

 

నిష్క్రమించిన విశ్వాసుల ఆత్మలు శాంతితో విశ్రాంతి పొందును గాక!”

 

మన ఆదర్శ ఆధ్యాత్మిక చరిత్రను సంఘ ప్రార్థనలలో సజీవంగా ఉంచిన విధానం కథోలిక సంఘపు అందమైన అంశాలలో ఒకటి. అందునా సకల ఆత్మల సంస్మరణ ఈ చరిత్రలో భాగమైన ఒక మచ్చు తునక. ఇప్పటికీ మన చర్చిలో ఇది సజీవ వాస్తవికతకు అద్దం పడుతుంది. ఈ జ్ఞాపకార్థం లేదా సంస్మరణ పదకొండవ శతాబ్దం నాటిది. ప్రాన్సు దేశపు క్లూనీ ప్రాంతానికి చెందిన పునీత ఓడిలో అనే కథోలిక మఠ సన్యాసి తమ తోటి మఠ సన్యాసులందరు మరణించిన వారందరి ఆత్మల కోసం ఒక రోజు ప్రార్థనలో గడపాలని ఆజ్ఞ ఇచ్చాడు. కొంతకాలం తర్వాత, మరణించిన విశ్వాసులందరి ఆత్మలు దేవుని శాశ్విత ప్రేమను పొందుకొనుటకై ఈ ఆచారమును సమస్త కథోలిక సంఘమంతా ఒక రోజు ప్రార్థనాగా  జరుపుకోవాలని తన ఆధిపత్యం నుండి ఆజ్ఞ  పొందుకున్నది. పద్నాలుగో శతాబ్దంలో, నవంబరు 1న జరిగే “ఆల్ సెయింట్స్” లేదా సకల పునీతుల పండుగతో అనుసంధానించబడి ఒక స్మారక చిహ్నాన్ని నవంబరు 2కి మార్చింది మాతృ తిరుసభ ఆధిపత్యం. పరలోకంలో పునీతులు పవిత్రంగా ఉన్నట్లు, మరణం ద్వారా దేవుని వైపు బయలుదేరిన విశ్వాసుల ఆత్మలన్నియు పరలోకంలోనికి చేరుకోలేవని మనం సత్యోపదేశ పాఠాల్లోనే నేర్చుకొన్నాము. కానీ - ప్రార్థనలు, దివ్య పూజా ఫలాలు మరియు దేవుని కృపా సహాయంతో పరలోకానికి చేరుకోవడానికి తమను తాము సిద్ధం చేసుకుంటాయి ఆయా ఆత్మలు. డాంటే అలిఘీరి అనే పాశ్చాత్య కథల గ్రంథకర్త తన డివైన్ కామెడీ  “ది పుర్గటోరియో” (ఉత్తరించు స్థలం లేదా Purgatory) అనే తన రెండవ పుస్తకంలో – మరణించిన వారి ఆత్మలు  దేవుని సంపూర్ణ ప్రేమను అంగీకరించేoత వరకు దేవుని పర్వతాన్ని ఎక్కడానికి అర్హతను పొందుకోరు. కాబట్టి వారు ఆ పర్వతానికి క్రిందనే ఉండి పోతారని చక్కటి ప్రదర్శన చేసాడు డాం టే. అయినప్పటికీ భూమిపై నివసించే వారి వారి  ప్రియమైనవారి లేదా మనందరి ప్రార్థనలు, త్యాగ క్రియల సహాయత వలన వారు దేవుని ప్రేమాకరుణలకు నోచుకొని వారి అజ్ఞానాంధకార ముసుగు తెరలు తెరచుకొని నీతి కిరణాలను చూడగలవు అని మన నమ్మకం కదా!!

 

ఈరోజు, ఒక ప్రత్యేక పద్ధతిలో, మనం మన ప్రియమైన మృతులను జ్ఞాపకం చేసుకుంటున్నాము. మనం నిరంతరం చేసే విశ్వాస ప్రకటన లేదా విశ్వాస సంగ్రహం అనేది నిత్యజీవం కోసం మన ఆశను ఆధారితం చేసుకునే ఒక వాగ్దానమే. తన మరణ పునరుత్థానంలో యేసు తనను విశ్వసించే వారందరి కోసం మరణాన్ని జయించాడు. ఎందుకంటే, “నీతిమంతుల ఆత్మలు దేవుని చేతిలో ఉన్నాయి. ఎటువంటి హాని వారిని తాకదు" (జ్ఞాన 3:1). విశ్వాస లేదా సకల ఆత్మల కోసం మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, వారి ఆత్మలు ప్రక్షాళన పొందుకొని తద్వారా పరలోకంలోని నిత్యజీవానికి ప్రయాణిస్తున్నాయి. ఎందుకంటే యేసు వాగ్దానం, "నా దగ్గరకు వచ్చే వారెవరినీ నేను బయటకు త్రోసివేయను" (యోహా 6:37) అని మనకు భరోసా ఇస్తుంది కదా!!

 

దేవుని కృపలో మరణించిన వారందరూ, అందునా ఇప్పటికీ అసంపూర్ణంగా శుద్ధి చేయబడిన వారందరూ, శిక్షకు కాదు, దైవీక ప్రేమ అగ్నికి లోనవుతారని సత్యపదేశం మనకు బోధిస్తుంది (CCC 1030–1032). "పరలోకంలో ఉన్న సాధువులున్నూ, ఉత్తరించు స్థలంలో శుద్ధి గావించబడుతున్న ఆత్మలున్నూ, మరియు భూమిపై వున్న మనం ఒక గొప్ప కుటుంబంగా దేవునిచే ఏర్పాటు చేయబడినాము అని మర్చిపోకూడదు. “మనం చనిపోయినవారి కోసం ప్రార్థించినప్పుడు, మనం ఎపుడూ ఈ కమ్యూనియన్‌లోనే జీవిస్తున్నాము. అందుకే మనం వారికి ప్రార్ధనా సహాయం చేద్దాం. స్మరించుకుందాం... మన అర్పణలు వారికి ఓదార్పునిస్తాయి" అని పితృ పాదులు పునీత జాను క్రిసోస్టము  మనకు ఉద్భోదిస్తున్నారు. మన ప్రార్థనలు అనేవి కాల పరిమితులను మించిన దయా కనికరమైనటువంటి  చర్యలు. కాబట్టి మనం మన త్యాగ క్రియలతో వారికి సహాయం చేద్దాం. స్మరించుకుందాం. యోబు కుమారులు తమ తండ్రి త్యాగ బలి ద్వారా శుద్ధిగావింపగలిగినప్పుడు (యోబు 1:5), యూదా మక్కబీయుడు కొంత డబ్బు వసూళ్ళు చేసి యేరూషలేము దేవాలయంలొ, యుద్ధంలో మరణించిన తన సైనికుల ఆత్మలు దేవుని దరికి చేరుకోవడానికై తమ  నిమిత్తం పాప పరిహార బలిని సమర్పింప చేసిన (2 మక్కబీ 12:43-45) విధానంలో కలిగిన విశ్వాసం - చనిపోయినవారి కోసం మనం చేసే త్యాగార్పణలు మన వారికి దేవుని దయను తీసుకురాలేవా? మనం ఎందుకు సందేహించాలి?"

 

ఈరోజు, పవిత్ర తల్లి సంఘం స్మశానవాటికలను సందర్శించడం, చనిపోయినవారి కోసం ప్రార్థించడం మరియు పవిత్ర దివ్యపూజా బలులను సమర్పించడం వంటి పుణ్య క్రియల ద్వారా మరణించిన వారి పట్ల మనకున్న ప్రేమ చురుకైనదనీ మరియు ఫలవంతమైనదని మనకు తెలియ చేస్తుంది. మన ప్రియమైనవారి కోసం మరియు అనాథ ఆత్మల కోసం ప్రార్థించడంలో, వారి తరఫున దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగునే వారు మనకు చేసిన ఉపకారముల నిమిత్తం వారికి ధన్యార్పణ చేసుకుంటున్నాము. వారి ద్వారా ప్రభువు మనలను ఆశీర్వదించిన అన్ని విధాలుబట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. "చివరి రోజున నేను వారిని లేపుదును" (యోహా 6:40) అని మనకు వాగ్దానం చేసిన రక్షక యేసు ద్వారా  మరణించిన మన ప్రియమైన వారిని దేవునికి మనం అప్పగించుదాము. మరణించిన వారి కోసం అర్పించే ప్రతీ దాతృత్వ చర్య, ప్రతీ ప్రార్థన, ప్రతీ జపమాల ప్రార్ధన వారి అంధకారములో ఒక చిన్నపాటి క్రొవ్వొత్తి వెలుగు లాంటిది. ఆ వెలుగు పరిపూర్ణ కాంతి వైపు చేరుకోవడానికి వారిని వేగవంతం చేస్తుంది.

"ఓ ప్రభూ! వారికి శాశ్వత విశ్రాంతిని ఇవ్వండి. వారిపై శాశ్వత కాంతిని ప్రకాశింపజేయండి"

 

 

Friday, 24 October 2025

వినయంలో పుట్టిన నివేదన సిరాకు 35:12-14,16-18; 2 తిమోతి 4:6-8,16-18; లూకా 18:9-14 (30/C)

 

వినయంలో పుట్టిన నివేదన

 

సిరాకు 35:12-14,16-18; 2 తిమోతి 4:6-8,16-18; లూకా 18:9-14 (30/C)

 

వినయవంతుల ప్రార్థన మేఘాలను చీల్చుతుంది. దాని గమ్యాన్ని చేరుకునే వరకు అది విశ్రాంతి తీసుకోదు.” (సిరాకు 35:17)

 

భక్తుడైన యూదుడు ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు మరియ 3 గంటలకు మూడుసార్లు ప్రార్థన చేసేవాడు. అదే ప్రార్థన ఆలయంలో చేస్తే అది చాలా ప్రభావవంతంగా ఉంటుందని భావించేవారు. దీని ప్రకారంగా, ఆయా సమయాల్లో, చాలామంది ప్రార్థన చేయడానికి ఆలయ ప్రాంగణాలకు వెళ్లేవారు. యేసు ఇద్దరు వ్యక్తులు పైకి వెళ్ళిన దాని గురించి మరియు వారు ప్రార్థించిన విధానం గురించి ప్రస్తావించడం సువార్తికుడు లూకా మనకు వివరిస్తున్న్నాడు. మనకు కథ తెలుసు. మన ప్రార్థన దేవునికి ప్రీతికరమైనదా కాదా అని మనం ఎలా తెలుసుకోగలం? దేవుని నామంలో మాట్లాడిన ప్రవక్త హోషేయ: “నేను త్యాగాన్ని కాదు, స్థిరమైన ప్రేమను కోరుకుంటున్నాను” (హోషే 6:6) అని దైవ అభీష్టాన్ని  ప్రవచించాడు. దేవుని పట్ల మరియు పొరుగువారి పట్ల ప్రేమతో కూడిన హృదయం నుండి ప్రార్ధన ఉద్భవించకపోతే, మనం దేవునికి చేసే ప్రార్థనలు మరియు త్యాగాలు ఆయనకు అర్థరహితంగా ఉంటాయి.

 

మనం వినయంతోనూ, దయ మరియు క్షమాపణ కోరుకునే పశ్చాత్తాప హృదయంతోనూ దేవుని వద్దకు రాకపోతే, ఆయన మన ప్రార్థనలను వింటాడని మనం ఎలా ఆశించగలం? మనకు దేవుని కృప మరియు సహాయం నిరంతరం అవసరం. అందుకే లేఖనం "దేవుడు గర్విష్ఠులను వ్యతిరేకిస్తాడు కానీ వినయస్థులకు కృపను అనుగ్రహిస్తాడు" అని మనకు చెబుతుంది (యాకో 4:6; సామె 3:34). యేసు ఉపమానం ప్రార్థనా స్వభావం మరియు దేవునితో మనకు వున్న సంబంధం గురించి మాట్లాడుతుంది. ప్రార్థన పట్ల రెండు విభిన్న వైఖరులను ఇది విభేదిస్తుంది. పరిసయ్యుడు మతపరమైన ఆచారాలలో గర్వాన్ని సూచిస్తాడు మరియు పన్ను వసూలు చేసే సుంకరి వినయాన్ని సూచించినప్పటికీ మత చ్చాoదస్తపరమైన మనస్సు గలవారు అతన్ని తృణీకరిస్తారు. మనం గర్వంతో కాకుండా వినయంతో దేవుణ్ణి వెతుకుతున్నందున దేవుడు అలాంటి ప్రార్థనను వింటాడు. షిలోహులోని హన్నా మొదలుకొని ఆలయంలో సొలొమోను ప్రార్ధాన వరకు, కార్మేలు పర్వతంపై  ఏలీయా నుండి యేసు కథలోని పన్ను వసూలు చేసే సుకంరి వరకు, నిజమైన ప్రార్థన ఎల్లప్పుడూ వినయం మరియు దేవునిపై ఆధారపడటం నుండే పుట్టింది. హన్నా, “ఓ సైన్యములకధిపతియగు ప్రభువా! నీ దాసి దుఃఖాన్ని నీవు చూస్తే...” (1 సమూ 1:11) అని ప్రార్థించింది. సొలొమోను రాజు, “నీ సేవకునికి నీ ప్రజలను పరిపాలించడానికి వివేకవంతమైన హృదయాన్ని ఇవ్వు” అని ప్రార్థించాడు (1 రాజు 3:9). ఏలీయా , "ఓ ప్రభువా, నాకు ఉత్తరమిమ్ము, ఈ ప్రజలు నీవే దేవుడవని తెలుసుకొనునట్లు నాకు ఉత్తరమిమ్ము" అని ప్రార్థించాడు.

 

జాను క్రిసోస్టము అనే పితృపాదులు పరిసయ్యుడు దేవునికి కాదు ప్రార్ధించింది, తనకు తనకే ప్రార్థించుకున్నాడు. అతను తన సొంత వ్యర్థానికకే ధూపం వేసుకున్నాడు” అని అంటున్నాడు.  అంటే తన తగ్గింపు జీవితాన్ని తెలుసు కున్నాడు అని అర్ధం. పునీత జాను డమస్సీన్ అనే మరో పితృ పాదులు, “ప్రార్థన అంటే ఒకరి మనస్సు మరియు హృదయాన్ని దేవుని వైపు ఎత్తడం లేదా దేవుని నుండి మంచి విషయాలను అభ్యర్థించడం” అని  అంటున్నాడు. కానీ మనం ప్రార్థించేటప్పుడు, మనం మన గర్వ సంకల్పపు ఎత్తుల నుండి మాట్లాడుతున్నామా లేదా వినయపూర్వకమైన పశ్చాత్తాపపడిన హృదయపు 'లోతుల నుండి' మాట్లాడుతున్నామా? (కీర్తన 130:1). పునీత అగుస్టీను ఇటువంటి వినయ తత్త్వాన్ని  సువార్తపు హృదయంగా వివరిస్తూ, “తాను అనారోగ్యంతో ఉన్నానని తెలిసినవాడు వైద్యుడిని వెతుకుతాడు. పాపపు ఒప్పుకోలు అనేది స్వస్థతకు నాంది.” అని వ్యాఖ్యానించాడు. మనం దేవుని ముందు బిచ్చగాళ్లం. “మనం ఎలా ప్రార్థించాలో మనకు తెలియదని” మనం వినయంగా అంగీకరించినప్పుడు మాత్రమే, ప్రార్థన బహుమతిని స్వేచ్ఛగా స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండగలం. దేవుని చెవి దీనుల వైపు వంగి ఉంటుంది. గర్విష్ఠులు గోపురాలు “దైవ శిఖరాలు”  నిర్మిస్తారు. వినయస్థులు జీవిత బలిపీఠాలను నిర్మిస్తారు. దేవుడు గోపురాలు లేదా “దైవ శిఖరాలు” పై కాకుండా, జీవిత బలిపీఠాలపై జీవిస్తాడు. దర్శనమిస్తాడు. నేడు మనం: “ఓ దేవా, పాపిని, నన్ను కరుణించు” అనే స్ఫూర్తితో ప్రార్థిద్దాం. మరియు మనం హృదయపూర్వకంగా, వినయంగా, నిజాయితీగా ప్రార్థిస్తే - అప్పుడు పన్ను వసూలు చేసే వ్యక్తివలే, మనం కూడా నీతిమంతులుగా ఇంటికి వెళ్ళగలము. అప్పుడు దేవుడు మాత్రమే ఇవ్వగల శాంతితో మన హృదయాలు నిండి ఉంటాయి.

 

"క్రీస్తులో మనం దేవునికి ఎలా ప్రార్థించాలో నేర్చుకుందాము - ఎందుకంటే ఆయన మన కోసం, మనలో, మరియు మన ద్వారా ప్రార్థించాడు" (పునీత అంబ్రోసు)

 

Saturday, 18 October 2025

నా అపవాదిని గద్దించువాడవు నీవే నిర్గమ 17:8-13; తిమోతి 3:14-4:2; లూకా 18:1-8 (29/C)

 

 


నా అపవాదిని గద్దించువాడవు నీవే

నిర్గమ 17:8-13; తిమోతి 3:14-4:2; లూకా 18:1-8 (29/C)

నా ప్రాణము నీకై దాహము గొని యున్నది, నా దేహము నీకొరకు ఆరాటపడుచున్నది” (కీర్త 62)

 

నేటి ప్రార్ధనా విధానం – ప్రార్థనలో చలించని పట్టుదలను పరిగణించమని మనల్ని ఆహ్వానిస్తుంది. సువార్తలో, "ఎల్లప్పుడూ అలసిపోకుండా ప్రార్థించవలసిన" ​​అవసరాన్ని యేసు మనకు గుర్తు చేస్తున్నాడు (లూకా 18:1). పాత నిబంధన కాలంలోని పేద విధవరాండ్రకు చాలా మంది విరోధులు వుండేవారు. వారు తమ బలహీనమైన నిస్సహాయ స్థితిని అనాగరికంగా ఉపయోగించుకుని వారి హక్కులపై దాడి చేసి, వారికి ఉన్న కొద్దిపాటిని కాచేసేవారు (యిర్మీ 21:3; యెష 1:17). లూకా నేడు ప్రస్తావించే  విధవరాలు ఒక అపరిచితురాలు మరియు తాను ఒంటరిగా అన్యాయమైన న్యాయమూర్తి వద్దకు వచ్చింది. ఆమెకు తన పక్షాన నిలబడటానికి ఏ స్నేహితులు లేదా ఏ న్యాయవాది లేరు. న్యాయమూర్తి స్పష్టంగా యూదు న్యాయమూర్తి మాత్రము కాదు. అతను హేరోదు లేదా రోమన్లు ​​నియమించిన జీతం పొందే న్యాయమూర్తులలో ఒకడు. అలాంటి న్యాయమూర్తులు అపఖ్యాతి పాలయ్యారు. ఒక బాధితుడు పలుకుబడి ప్రభావం లేదా డబ్బు ఉంటే తప్ప, తీర్పు వచ్చేది కాదు. లంచం ఇస్తేనే తప్ప తమ కేసు పరిష్కరించబడుతుందనే ఆశ వారికి ఉండేది కాదు. ఇటువంటి న్యాయమూర్తులను(DayyanehGezeroth) దోపిడీ న్యాయమూర్తులుగా పిలిచేవారు.

 

ఇటువంటి నేపద్యంలో దేవుడు ప్రార్థనలు వింటాడనీ వాటికి సమాధానం ఇస్తాడనీ నమ్మకంగా, దేవునితోనే సంబంధం కలిగి, పట్టుదలగల విధవరాలిలా ఉండాలని యేసు కోరుకుంటున్నాడు. యేసు  తన క్రియలతోనూ, తన సజీవ వాక్కుతో బోధిస్తున్నాడు. హృదయం నుండి మాట్లాడటం అంటే  హృదయంతో మాట్లాడడం. దేవుడు మానవ హృదయాన్ని చదువు తున్నాడు (కీర్త 44:21).  ప్రార్ధనలో నేను ఉపయోగించే పదాలకన్నా నన్ను బాగా తెలుసుకొని నాతో మాట్లాడే వాడు నా దేవుడు (2 దినవృత్త 18:13). తదుపరి నిమిషం, గంట, వారం, నెల లేదా సంవత్సరంలో మనకు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. దేవుడు మాత్రమే మన సమయాన్ని పూర్తిగా చూడగలడు. కాబట్టి   దీర్ఘకాలంలో మనకు ఏది మంచిదో అతనికి మాత్రమే తెలుసు (యిర్మీ 29:11). అందుకే మనం ప్రార్థనలో ఎప్పుడూ నిరుత్సాహపడకూడదని యేసు చెప్తున్నాడు.

 

అహరోను, హోరుల సహాయంతో, మోషే కొండపై చేస్తున్న ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నాడు.  అందుకే ఇశ్రాయేలు ప్రజలపై దాడి చేస్తున్న సైన్యాలను యెహోషువ ఓడించగలిగాడు. అమలేకీయులను ఓడించినది నిజంగా దేవుడే! యెహోషువ కాదు. మన శత్రువులను ఓడించేది నిజంగా దేవుడే! మనం కాదు కదా (నిర్గమ 14:14)! ప్రతీకారం మనది కాదు, ఆయనదే (ద్వితీ 32:35). మనం నమ్మకంగా ప్రార్థిస్తూ మంచి పోరాటం చేయడమే మన వంతు కృషిని మనం చేయాలి. ప్రార్ధనలో మనం బల హినులమైనపుడు మన క్రైస్తవ సమాజం తన ప్రార్థనలో మన చేతులను పైకెత్తి ప్రార్ధిస్తూ సహాయం చేస్తోంది. మన దేవుని ప్రేమ మరియు శ్రద్ధ మనతో ఉంటే, మనకు వ్యతిరేకంగా ఎవరు ఉండగలరు? (రోమా 8:31). నేటి మన సువార్త విధవరాలు మన సమాజంలోని పేదలు మరియు రక్షణ లేని వారందరికీ చిహ్నంగా వుంది. పట్టుదల అనే ఆయుధం ద్వారా తప్ప న్యాయమూర్తి నుండి తన న్యాయం పొందలేనన్న ఆశ తనలో లేదని ఆమెకు తెలుసు. ఇది సుస్పష్టం.

 

ఈ ఉపమానం రొట్టె కొరకు అర్ధరాత్రి స్నేహితుడి తలుపు తట్టిన ఉపమానం లాంటిది (లూకా 11 :5-13). ఇది అలాంటి వ్యక్తులతో భగవంతునుని విభేదిస్తుంది. అందుకే, విసిగి పోయిన న్యాయమూర్తి చివరికి ఒక విధవరాలికి న్యాయం చేయడంలో నిర్ణయం తీసుకొనగలిగితే, ప్రేమగల తండ్రి అయిన దేవుడు తన పిల్లలకు అవసరమైన దానిని ఎంత ఎక్కువగా ఇవ్వ గలడు?” అని యేసు అంటున్నాడు. మన ప్రార్ధనకు యేసు ప్రార్థన ఒక నమూనా. ఆయన పేతురుతో ఇలా అన్నాడు: “నీ విశ్వాసం విఫలం కాకూడదని నేను ప్రార్థించాను” (లూకా 22:32). శిలువ వేయబడినప్పుడు,  తండ్రీ, వారిని క్షమించు, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు” (లూకా 23:34) అని  ప్రార్ధంచాడు. మరియు ఆయన తన చివరి శ్వాసను విడిచి నప్పుడు, “తండ్రీ, నీ చేతుల్లో నా ఆత్మను అప్పగించుకుంటున్నాను” (లూకా 23:46) అని ప్రార్ధంచాడు.

 

విశ్వాసం అనేది దేవుడు మనకు ఇచ్చే బహుమతి. పునీత అగుస్టీను ప్రార్థించినట్లుగా, దేవుడు మొదట మనల్నితన  దయగల ప్రేమతో తన వైపుకు ఆకర్షించకపోతే మనం తనలోనికి ఆశతో నమ్మి రాలేము. మొదట ఆయన మనలను తన కృప కొరకు పిలువకపోతే మనం ఆయన దగ్గరకు రాలేము. తాను మనలను మొదట కనుగోనకపోతే మనం అయనను ఎన్నటికీ కనుగోనలేము. జీవితాంతం వరకు విశ్వాసంలో ఎదగాలని మరియు పట్టుదలతో ఉండాలనుకుంటే, మనం దేవుని వాక్యంతో మన విశ్వాసాన్ని పోషించుకోవాలి. దానిని పెంపొందించమని ప్రభువును అడగాలి (లూకా 17:5). పరీక్షలు మరియు ఎదురుదెబ్బలు మనల్ని నిరాశపరిచినప్పుడు, మనం మన ఆశ మరియు విశ్వాసాన్ని ఎక్కడ ఉంచుదాము? దేవుడు మన కోసం తన దయగల సంరక్షణ మరియు ఏర్పాటును కలిగి యున్నాడు. అందుకు నిరీక్షణతో దృఢమైన ఆశతో ప్రార్థిoచ లేమా?

 

 

"నేను నా జీవితాంతం ప్రభువు ఇంట్లో నివసించడానికి కోరుకుంటున్నాను..."(కీర్త 27:4)