AletheiAnveshana: వాక్య ధ్యానాoశము
Showing posts with label వాక్య ధ్యానాoశము. Show all posts
Showing posts with label వాక్య ధ్యానాoశము. Show all posts

Thursday, 2 April 2026

దివ్య సత్ప్రసాదం యాజకత్వమునకు నూతన నిబంధనకు మూల పునాది

 

దివ్య సత్ప్రసాదం

 యాజకత్వమునకు  నూతన నిబంధనకు

 మూల పునాది

 

ఈ రాత్రి, మన విశ్వాసపు అత్యంత పవిత్రమైన క్షణాలలోకి మనం ప్రవేశిస్తున్నాము. త్రిదినాలలో మొదటి రోజు పవిత్ర గురువారంనాడు పస్కా మర్మపు ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ రాత్రి, యేసు తన సంఘ వధువునకు అమూల్యమైన దివ్య సత్ప్రసాదం, యాజకత్వం మరియు వినయపూర్వకమైన సేవలో వ్యక్తమయ్యే ప్రేమ ఆజ్ఞ అనే మూడు బహుమతులను ప్రసాదిస్తున్నాడు. యోహాను సువార్త “ఆయన లోకమందున్న తనవారిని ప్రేమించి, వారిని అంతము వరకు ప్రేమించెను” (యోహా 13:1–15) అనే ఒక లోతైన గర్భిత ప్రకటనతో ప్రారంభమవుతుంది. ఈ మాటలు యేసు హృదయాన్ని వెల్లడిస్తున్నాయి. ఆయన ప్రేమ పాక్షికమైనది లేదా తాత్కాలికమైనది కాదు. అది సంపూర్ణమైనది మరియు త్యాగపూరితమైనది.

 

తన కడరాత్రి  భోజన సమయంలో, యేసు బల్ల మీద నుండి లేచి, తన పై వస్త్రాన్ని తీసివేసి, ఒక తువ్వాలును నడుముకు కట్టుకొని, మోకరించి, తన శిష్యుల పాదాలను కడిగాడు. ఆ కాలపు నమాజ సంస్కృతిలో, పాదాలు కడగడం అనేది అత్యంత కనిష్ఠ సేవకుని పని. అయినప్పటికీ, దేవుని కుమారుడు ఒక సేవకుని స్థానాన్ని తీసుకున్నాడు. పేతురు అందుకు ఆశ్చర్యపడి, “నీవు నా పాదాలను ఎన్నటికీ కడగకూడదు” అని అన్నాడు. అందుకు యేసు, “నేను నిన్ను కడితేనే తప్ప, నీకు నాతో పాలు ఉండదు” అని జవాబిచ్చాడు. ఈ చర్య ద్వారా, నిజమైన శిష్యరికం వినయం మరియు సేవలో పాతుకుపోయి ఉంటుందని యేసు బోధిస్తున్నాడు.

 

అదే రాత్రి, యేసు దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించాడు. పరిశుద్ధ పౌలుడు, “ఇది మీ కొరకు అప్పగింప బడనున్న నా శరీరము... ఈ గిన్నె నా రక్తములో నింపబడిన క్రొత్త నిబంధన” (1 కొరింథీ 11:23-26) అని వ్రాశాడు. ఇక్కడ, యేసు తనను తాను మానవాళికి పూర్తిగా అర్పించుకున్నాడు. దివ్య సత్ప్రసాదం కేవలం ఒక చిహ్నం కాదు. సంకేతం అంతకంటే కాదు. అది క్రీస్తు  నిజమైన ప్రత్యక్షత. మనలో తన ఉనికి. మనలో చైతన్యతను తీసుకొచ్చే తన ఆస్థిత్వం. తన దివ్య శరీరం (సత్ప్రసాదం) క్రైస్తవ జీవితానికి మూలం మరియు శిఖరం అని సత్యోపదేశo చెప్పకనే చెపుతుంది. ప్రతి దివ్యబలిపూజ క్రీస్తు త్యాగాన్ని ప్రత్యక్షం చేస్తుంది. తన  స్వంత జీవంతో మనలను పోషిస్తుంది. అయితే, దివ్య సత్ప్రసాదం ఇంకా కొనసాగడం కొరకు, యేసు యాజకత్వాన్ని స్థాపించాడు. ఇది భూ  చరిత్ర అంతటా శాశ్వితంగా నిలుస్తుంది. ఆయన, “నా జ్ఞాపకార్థం దీనిని చేయండి” అని చెప్పినప్పుడు, దివ్య సత్ప్రసాదాన్ని జరిపే మరియు తన ప్రజలను నడిపించే బాధ్యతను అపొస్తలులకు అప్పగించాడు. అందువల్ల, యాజకుడు క్రీస్తు ప్రతినిధిగా  సంఘానికి సేవ చేస్తూ, దేవుని వాక్యంతో మరియు క్రీస్తు శరీరంతో దానిని పోషిస్తున్నాడు.

 

యాజకత్వం అనేది ఒక అధికార స్థానం కాదు. అది త్యాగం మరియు సేవతో కూడిన దైవ పిలుపు. క్రీస్తు తన శిష్యుల పాదాలను కడిగినట్లే, యాజకులు వినయంతో, కరుణతో ప్రజలకు సేవ చేయడానికి పిలువబడ్డారు. తొలి సంఘ పితృపాదులు దివ్య సత్ప్రసాదానికి మరియు ప్రేమకు మధ్య ఉన్న ఈ సంబంధాన్ని అర్థం చేసుకున్నారు. హిప్పోకు చెందిన పునీత అగస్టీను, “మనం దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు, మనం స్వీకరించిన దానిగా — అంటే క్రీస్తు శరీరంగా — మారిపోతామ”ని బోధించాడు. జాన్ క్రిసోస్టోమ్, “పేదవారిలో క్రీస్తును విస్మరిస్తూ బలిపీఠం వద్దకు వచ్చి ఆయనను ఘనపరచలేమని విశ్వాసులకు గుర్తు చేశాడు. మరో మాటలో చెప్పాలంటే, దివ్య సత్ప్రసాదం మనం జీవించే విధానాన్ని మార్చుతుంది.

 

మన ప్రపంచం తరచుగా విభజన, అసమానత మరియు ఉదాసీనతలతో నిండిపోతుంది. చాలా మంది ఒంటరితనం, పేదరికం మరియు అన్యాయాన్ని అనుభవిస్తున్నారు. దివ్య సత్ప్రసాద వేడుక కరుణ మరియు సంఘీభావంతో కూడిన సమాజాలను నిర్మించమని మనకు పిలుపునిస్తుంది. మనం దివ్య సత్ప్రసాదం స్వికరించిన ప్రతిసారీ, క్రీస్తు పరిచర్యను కొనసాగించడానికి, అంటే సేవ చేయడానికి, క్షమించడానికి, సయోధ్య కుదర్చడానికి మరియు ప్రేమించడానికి యేసు పిలుపునందు కున్నాము. మనం దివ్య సత్ప్రసాదాన్ని నిజంగా స్వీకరించి, క్రీస్తు మాదిరిని అనుసరిస్తే, మన జీవితాలు ఆయన ప్రేమను ప్రతిబింబిస్తాయి. మన కుటుంబాలు క్షమాపణకు నిలయాలుగా, మన సమాజాలు సేవకు కేంద్రాలుగా మారతాయి మరియు మన ప్రపంచం దేవుని రాజ్యానికి మరింత చేరువవుతుంది. ఈ పవిత్రమైన వేడుకను మనం కొనసాగిస్తున్నప్పుడు, దివ్య సత్ప్రసాదమనే బహుమతికి దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం. మన యాజకుల కోసం ప్రార్థిద్దాం. ఈ రాత్రి యేసు ఇచ్చిన ఆజ్ఞ “నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి” అన్న దానిని పాటించడానికి తన కృప కొరకు ప్రార్ధన చేద్దాం.

“…ఆయనకు విధేయులైన వారందరి నిత్య రక్షణకు ఆయన మూలమయ్యాడు.

 

Saturday, 28 March 2026

శక్తిమంతుడును, వినయాన్వితుడైన రాజుకు సాష్టాంగ నమస్కారం యెష 50:4-7; ఫిలిప్పీ 2:6-11; మత్త 26:14—27:66 (మ్రాను కొమ్మల ఆదివారం, A)

 

శక్తిమంతుడును, వినయాన్వితుడైన రాజుకు సాష్టాంగ నమస్కారం

 

యెష 50:4-7; ఫిలిప్పీ 2:6-11; మత్త 26:14—27:66 (మ్రాను కొమ్మల ఆదివారం, A)

ప్రభు దేవా, నీవు ఎంత గొప్పవాడివో, మహిమా వైభవంలో, పటముగా కాబట్టిన వెలుగులో నిండియున్నావు”.

 

ఈ రోజు మనం పరిశుద్ధ వారాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ వారపు రోజులలో  యేసుతో పాటు ఆయన శిలువ మార్గంలో మనం ప్రయాణిస్తున్నాము. అలాగునే ఆయన పునరుత్థానం కొరకు ఎదురు చూస్తున్నాము. యెరూషలేములోకి యేసు విజయవంతంగా ప్రవేశించడాన్ని గుర్తుచేసుకోవడానికి, ఈ రోజు మన ఆరాధనను ఈతాకులు లేదా కొబ్బరాకుల ఊరేగింపుతో ప్రారంభిస్తున్నాము. యేసు శ్రమల కాలంలోని సంఘటనల క్రమతను ఈనాటి వాక్యారాధనలో సంపూర్ణంగా ప్రకటించబడుతుంది. అదే సంఘటనల క్రమతను మళ్ళి పరిశుద్ధ గురువారం నాడు ప్రభువు పస్కాభోజనం, శుభ శుక్రవారం మరియు ఈస్టర్ జాగరణ వంటి త్రిదినోత్సవ (త్రిదువుం/మూడు దినములు) ఆరాధనలను మనం జరుపుకునేటప్పుడు ప్రకటించబడతాయి. మ్రాను కొమ్మల ఆదివారం నాడు మనం యేసు శ్రమలను మత్తయి సువార్త (cycle A) నుండి  చదువుతాము. శుభ శుక్రవారం నాడు, యోహాను సువార్త నుండి యేసు శ్రమలను చదువుతాము. నేటి సువార్తలో మనం గ్రహించే యేసు శ్రమ మరియు మరణం గురించిన చరిత్ర , ప్రత్యేకంగా ఆయన తన తండ్రి చిత్తానికి విధేయత చూపడం, అదేవిధంగా పూర్వ లేఖనాల సంపూర్ణ పరిపూర్తిపై దృష్టి పెడుతుంది మత్తయి సువార్త.

 

మత్తయి మరియు మార్కు సువార్తలు యేసు శ్రమల వృత్తాంతంలో అనేక సారూప్యతలను కలిగి  ఉన్నప్పటికీ, మత్తయి సువార్తలో కొన్ని వివరాలు గమనించదగినవి. యేసును అప్పగించినందుకు యూదా చెల్లించిన మూల్యం మరియు ఆయన మరణాన్ని మత్తయి మాత్రమే సూచిస్తాడు. అలాగే పిలాతు భార్యకు కలలో హెచ్చరిక రావడం మరియు యేసు మరణం విషయంలో పిలాతు తన చేతులు కడుక్కోవడం వంటి వివరాలు కూడా ఉన్నాయి. చివరగా, యేసు మరణం తర్వాత సంభవించిన భూకంపాలు మరియు ఇతర దృగ్విషయాలను మత్తయి సువార్త మాత్రమే ప్రస్తావిస్తుంది. తొలి క్రైస్తవ సమాజానికి మరియు వారి యూదు సమకాలీనులకు మధ్య బహుశా ఉన్న ఉద్రిక్తతను మత్తయి సువార్త ప్రతిబింబిస్తుందని పండితులు గమనిస్తున్నారు. రెండవ వాటికను  మహా సభలో (1964), యేసు శ్రమలకు మరియు మరణానికి పాపులందరూ బాధ్యత వహించాలని, మరియు యేసు శ్రమలకు ఆయన యూదు సమకాలీనులను గానీ లేదా నేటి యూదు ప్రజలను గానీ నిందించడం తప్పు అని ఆసభలోని పండిత పితరులు స్పష్టం చేశారు (నోస్త్రా ఏతాతే - నం. 4 (ఇన్ అవర్ టైమ్/ మన కాలం 1965). ఇది నేడు మనం గ్రహించ దగిన విషయం.

 

మత్తయి సువార్తలోని పాత్రల ద్వారా యేసు శ్రమలను అర్థం చేసుకోవడానికి అనేక ప్రతిబింబాలు మనకు కనిపిస్తాయి. అవి ఇతరులను సూచించడం కాదు, మనల్నే ప్రతిబింబిస్తాయి. కొన్నిసార్లు మనం, యేసుకు ద్రోహం చేసి పశ్చాత్తాపపడిన యూదాలా ఉంటాము. కొన్నిసార్లు , ఆయనను నిరాకరించిన పేతురులా, లేదా యేసు అత్యంత కష్టకాలంలో నిద్రపోయి, ఆయనను అరెస్టు చేసినప్పుడు తొందరపాటుతో, హింసాత్మకంగా ప్రవర్తించిన శిష్యులలా మనం ఉంటాము. కొన్నిసార్లు , యేసు సిలువను మోయడంలో సహాయం చేయడానికి బలవంతంగా నియమించబడిన సీమోనులా మనం ఉంటాము. యేసుకు భయపడే నాయకుల్లా, లేదా సత్యం కోసం నిలబడకుండా చేతులు కడుక్కున్న పొంతు పిలాతులా కొన్నిసార్లు మనం ఉంటాము. కానీ మన పాపాలను క్షమించబడటానికి యేసు మరణించాడు. మళ్ళి మళ్ళి మరణిస్తూనే వుంటాడు.

 

యేసు రాజు. రాజాధి రాజు. ఈ రాజు తన రాచరికాన్ని మనపై బలవంతంగారుద్దడు. ఆయనే తనను తాను సమర్పించుకుంటున్నాడు. ఆయన రాచరికం సేవాభావంతో నిండి ఉంది. “ఆయన వాదించడు. వీధులలో తన స్వరం వినిపించేలా బిగ్గరగా అరవడు. ఆయన సాత్వికంగా, వినయంగా ఉంటాడు. ఆయన తన శ్రమల వైపు వేగంగా వెళ్తుండగా, ఆయన మార్గాన్ని వస్త్రాలతో, ఒలీవ కొమ్మలతో, లేదా ఖర్జూరపు ఆకులతో కప్పకుండా, మన శక్తికొలది ఆయన ముందు సాగిలపడి నమస్కరిస్తూ, ఆయనతో పాటు మనం కూడా పరుగెడదాం” (పునీత  ఆండ్రూ, బిషప్ - క్రీటు).

 

ప్రభువు నామమున వస్తున్నవాడు ధన్యుడు; ఈశ్రాయేలు రాజు ధన్యుడు” (Divine Office)

 

 

 

 

 

 

 

Saturday, 21 March 2026

“సమాధి నుండి బయటకు రా...” యెహె 37:12-14 రోమా 8:8-11; యోహా 11:1-45 (లెంట్ A / 5)

 


        సమాధి నుండి బయటకు రా...

 

యెహె 37:12-14 రోమా 8:8-11; యోహా 11:1-45 (లెంట్ A / 5)

ఆయన దేవుని మహిమ తేజోవంతమైన వెలుగు. ఆయన స్వభావానికి పరిపూర్ణమైన ప్రతిరూపం

 

మరణం మాత్రమే ఏలే చోట దేవుడు జీవాన్ని తెస్తాడు అన్నది నేటి లిటర్జికల్ పఠనాల సందేశం. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రవాసంలో నివసిస్తున్న (యెహె 37:12–14) రోజులవి. వారి దేశం  నాశనం చేయబడింది వారి ఆలయం ద్వంశమయింది. వారి ఆశ పాతిపెట్టబడింది. వారు ఇక  చనిపోయిన వ్యక్తులులా భావించుకున్నారు. కానీ యెహోవా దేవుడు “నేను మీ సమాధులను తెరిచి మిమ్మల్ని తిరిగి బ్రతికిస్తాను” అని ప్రవక్త యేహెజ్కేలు ద్వారా వాగ్దానం చేశాడు. దేవుడు తన “רוּחַ” (rua ఆత్మ) ను వారిలో ఉంచుతానని చెప్పాడు. హెబ్రీ పదం “రువా” అనే పదానికి “శ్వాస”, “ఆత్మ” లేదా “జీవశక్తి” అని అర్థం. సృష్టి కథనంలో దేవుడు ఆదాములోనికి (ఆది 2:7), అంటే మానవాళి భౌతికతలోకి ప్రాణం పోసినప్పుడు ఉపయోగించిన తన శక్తికి పదం ఇదే. జీవాన్ని సృష్టించిన దేవుడు జీవితాన్ని పునరుద్ధరించగలడు.

 

జనులు ఆధ్యాత్మికంగా లేదా సామాజికంగా చనిపోయినట్లు భావించినప్పుడు కూడా, దేవుని ఆత్మ వారిని పునరుద్ధరించగలదు. ఈ వాగ్దానం నేటి సువార్తలో నెరవేరినట్లు మనం చూస్తున్నాము (యోహా 11:1–45). లాజరు సమాధిలో నాలుగు రోజులు ఉన్నాడు. మానవీయంగా చెప్పాలంటే, ప్రతిదీ తనకు ముగిసిపోయింది. మార్తా మరియు మరియ దుఃఖిస్తున్నారు. ఆ సమాజం తన మరణాన్ని అంగీకరించింది. కానీ యేసు "నేనే పునరుత్థానం మరియు జీవం" అని  ఒక గర్భిత ప్రకటన చేశాడు. పునరుత్థానం కోసం ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదం "νάστασις (అనాస్తాసిస్)", దీని అర్థం "మళ్ళీ లేవడం". ఇది మరణం తర్వాత మనకు సంభవించే పరలోక జీవితం గురించి మాత్రమే కాదు.  నిరాశ నుండి కొత్త జీవితంలోకి ఎలాంటి వాడినైనా సరే దేవుడు పైకి లేపగలడని దీని అర్థం. యేసు అధికారంతో "లాజరు, బయటకు రా!" అని భావోద్వేగ గద్గద గొంతుతో పిలిచాడు. ఆ శక్తితో చనిపోయిన వ్యక్తి సమాధి నుండి బయటకు వచ్చేసాడు. ఈ అద్భుతం లోతైన వేదాంత సత్యాన్ని వెల్లడిస్తుంది. యేసు జీవానికి, జీవితానికి నాథుడు. మానవత్వం ముగింపును చూసే చోట, క్రీస్తు ఒక కొత్త ప్రారంభాన్ని సృష్టిస్తాడు.

 

 

మనలో ప్రతి ఒక్కరూ కొన్నిసార్లు మన జీవితాల్లో సమాధి అనుభవాన్ని కలిగే ఉన్నాము. ఆశ పాతివేయబడినట్లు అనిపించే ప్రదేశ అనుభవాలు. కొందరు పాప సమాధిలో, మరికొందరు భయం అనే సమాధిలో, తెగిపోయిన వివాహ సంబంధం అనే సమాధిలో, విశ్వాసం కోల్పోయిన లేదా నిరుత్సాహం అనే సమాధిలోనే జీవి స్తున్నారు. అయినప్పటికీ క్రీస్తు ప్రతి సమాధి ముందు నిలబడి, లాజరును పిలిచినట్లే మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన స్వరం మనల్ని బంధించే వాటి నుండి బయటపడమని ఆహ్వానిస్తుంది. ప్రార్థన, పశ్చాత్తాపం మరియు దేవునిపై నమ్మకం ద్వారా, మనం ఇంకా ఆధ్యాత్మిక పునరుత్థానాన్ని అనుభవించగలం. ఈ సందేశానికి సామాజిక అర్థం ఉంది. నేడు చాలా మంది “సామాజిక సమాధులు” అని పిలవబడే సమాధిలో నివసిస్తున్నారు. పేదరికం, ఒంటరితనం, అన్యాయం లేదా బహిష్కరణ అనేవే సామాజిక సమాధులు. క్రీస్తు అనుచరులుగా, మనం కొత్త జీవితాన్ని పొందడమే కాకుండా ఇతరులకు జీవితాన్ని అందించడంలో సహాయపడటానికి పిలువబడ్డాము. పోపు ఫ్రాన్సిసు తన “Fratelli Tutti” అనే విశ్వ లేఖలో, పాతుకుపోయిన సోదరభావం, సంఘీభావం  సమాజం మరచిపోయినట్లు భావించే వారికి ఆశను పునరుద్ధరించగలదని మనకు గుర్తు చేస్తుంది. నేటి సువార్త చివరలో, "అతని కట్లు విప్పి వదిలేయండి” అని యేసు సమాజానికి చెప్పాడు." లాజరును సమాధి నుండి బయటకు పిలిచిన తర్వాత, సమాజం అతన్ని బంధించే కట్టుల్ని తీసివేసింది. నేడు క్రీస్తు సంఘంగా ఇదే మన లక్ష్యం. మనల్ని బంధించే వాటి నుండి ఒకరినొకరు విడిపించుకోవడంలో సహాయపడటం.

 

మనం పవిత్ర వారాన్ని సమీపిస్తున్న కొద్దీ, క్రీస్తు నేటికీ అదే శక్తివంతమైన “బయటకు రా....”  అన్న మాటతో మనలను గద్దిస్తున్నాడు. మాట్లాడుతున్నాడు: భయం నుండి బయటకు రా.. . పాపం నుండి బయటకు రా... నిరాశ నుండి బయటకు రా.. అని పిలుస్తున్నాడు. తన  “రువా” (దేవుని ఆత్మ) మన జీవితాలను నింపినప్పుడు, మనం “అనస్తాసిస్‌” (పైకి లేప బడటం) ను అనుభవిస్తాము.  క్రీస్తుతో కొత్త బంగారు జీవితంలోఎదగలము.

 

దేవుని వాక్యమనే కృప ద్వారా ప్రతిఒక్కరూ సంపూర్ణంగా శుభ్రపరచబడతారు(Divine Office)

 

 

 

 

 

 

Saturday, 14 March 2026

దీక్షలో మన ఆధ్యాత్మిక దృష్టి పరీక్ష 1 సమూ 16:1b,6-7,10-13°; ఎఫెసీ 5:8-14; యోహా 9:1-41 (Lent A / 4)

 

దీక్షలో మన ఆధ్యాత్మిక దృష్టి పరీక్ష

 

1 సమూ 16:1b,6-7,10-13°; ఎఫెసీ 5:8-14; యోహా 9:1-41 (Lent A / 4)

సత్యము ననుసరించి జీవించువాడు వెలుగులోనికి వచ్చును” (Divine Office)

 

ఈ దీక్షా కాలపు నాల్గవ ఆదివారపు రోజున, లోతైన మానవ సమాజ ధోరణి నిమిత్తం దేవుని వాక్యం మనలను సవాలు చేస్తుంది. ప్రజలను తీర్పు తీర్చే ధోరణి కేవలం మనం బాహ్యంగా వారిని చూసే విధానం బట్టే జరుగుతుంది. ప్రవక్త సమూయేలు యెష్షయి కుమారులలో ఒకరిని ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించడానికి వచ్చినప్పుడు, అతను ఆయా కుమారుల రూపాన్ని మరియు బలాన్ని చూసి ఆకర్షితుడై నిర్దారించుకుంటాడు. కానీ ప్రభువు : "ఒకరి రూపాన్ని బట్టి లేదా అతని ఉన్నత బాహు స్థాయిని బట్టి తీర్పు తీర్చవద్దు... ఎందుకంటే  మనిషి చూసే విధంగా ప్రభువు చూడడు; మనిషి బాహ్య రూపాన్ని చూస్తాడు, కానీ ప్రభువు హృదయాన్ని చూస్తాడు" (1 సమూ 16:7)  అని అతనిని ఒక అద్భుతమైన జ్ఞాపికతో సరిదిద్దాడు. మనం తరచుగా ఇతరులను కనిపించే వారి వారి లక్షణాల బట్టి కొలుస్తాము. ఒక్కొక్క సారి వారి స్థితి, విజయం లేదా శారీరక రూపు రేఖల బలం మన నిర్ధారణ అవుతుంది. కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు.

 

యేసు అనుచరులు పుట్టుకతోనే అంధుడైన ఒక వ్యక్తిని చూసినప్పుడు, వారు వెంటనే యేసును రబ్బీ! ఎవరు పాపం చేసారు, ఈ మనిషినా లేక అతని తల్లిదండ్రులా, ఇతను గుడ్డివాడిగా పుట్టాడు?” (యోహా 9:2) అని అడుగుతారు. వేద శాస్త్రం పాత నిబంధన వారి ప్రశ్న ప్రతీకారం, శిక్ష, పాపఫలం (retribution) నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. కష్టాల కన్నీళ్ళు అనేది పాపానికి శిక్షగానూ మరియు  శ్రేయస్సు అనేది మంచి తనానికి ప్రతిఫలంగానూ ఉండాలన్నదే ఈ retribution సిద్దాంతం. ద్వితీయోపదేశకాండములో మనం ఈ దృక్పథ సిద్ధాంతాన్ని చూస్తున్నాము. ఇక్కడ విధేయత ఆశీర్వాదాలతో మరియు అవిధేయత శాపాలతో ముడిపడి ఉంటుంది. నేటికీ, మన సమాజంలోని అనేక మత సంస్కృతులు ఖర్మ సిద్దాంత భావన ద్వారా ఇలాంటి ఆలోచనను వ్యక్తపరుస్తున్నాయి. ప్రతి కష్టాల కడగండ్లు గత తప్పుల ఫలితంగానే వున్నాయని నమ్ముతాయి.

 

కానీ యేసు ఇటువంటి నింద తర్కాన్ని బద్దలు గొడుతున్నాడు. సమాజ సంఘ సంస్కర్త యేసు, “అతడుగానీ అతని తల్లిదండ్రులు గానీ పాపం చేయలేదు. దేవుని అద్భుత చేయిదములు అతని ద్వారా కనిపించేలా చేయడం కోసమే ఇలా జరిగింది” (యోహా 9:3) అని యేసు సమాధానమిచ్చాడు. దేవుని కృప ఎలా క్రియా రూపం దాలుస్తుందనే విషయముపైనే ఆయన దృష్టి పెడుతున్నాడు. అంధుడి బాధ స్వస్థపరిచే దేవుని శక్తికి నిదర్శనంగా వుందని గ్రహించ మంటాడు  క్రీస్తు. జరుగుతున్న సంభాషణను retribution తీర్పు నుండి మిషన్‌కు మారుస్తున్నాడు యేసు.  చిన్నవాడు, ఆఖరి వాడు మరియు తక్కువగా ఆకర్షణ పొందుకున్న దావీదు మానవ దృక్కోణం నుండి అల్పుడిగా కనిపించాడు. అయినప్పటికీ దేవుడు అతని విశ్వాస గర్భిత హృదయాన్ని చూశాడు. దేవుని ఎంపికలు తరచుగా మానవ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి కదా!! విజయం, ఉత్పాదకత, ఉత్పత్తి సంపద లేదా ప్రభావం ఆధారంగా ప్రజలను విలువైనదిగా భావిస్తుంది ఈ సమాజం. కానీ మానవ గౌరవం అనేది ఈ బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉండదు, వుండకూడదని  యేసు మనకు గుర్తు చేస్తున్నాడు.

 

16 వ బెనెడిక్టు పోపు గారు  తన"Deus Caritas Est" ("దేవుడు ప్రేమాస్వరూపి" 2005) అన్న విశ్వ లేఖలో పొరుగువారిని ప్రేమించడం ప్రతి క్రైస్తవుడి ప్రాథమిక బాధ్యత అని మనకు గుర్తు చేసాడు. మనం బాధలను ఎదుర్కొన్నప్పుడు, మన ప్రతిస్పందన ఉదాసీనత లేదా తీర్పు కాదు, కానీ నిర్దిష్టమైన దాతృత్వం.  పోప్ ఫ్రాన్సిస్ తన “Laudato Si” ("ప్రభువా, నీకు స్తుతి” 2015)  అన్న విశ్వ లేఖలో, ప్రతి జీవి మరియు ప్రతి మానవ వ్యక్తి దేవుడు ఇచ్చిన మంచితనాన్ని కలిగి ఉండాలని నొక్కి చెప్పాడు. అదేవిధంగా  బ్రద్దలైపోతున్న నేటి ప్రపంచమున మతాలు, దేశాల సరిహద్దులను దాటి, మనుషులందరూ ఒకే దేవుని బిడ్డలని  ప్రేరేపించిన తన విశ్వ సమాజ లేఖ “Fratelli Tutti” ("అందరూ సోదరులు" 2020) లో, ప్రతి మానవుడికి గౌరవంగా జీవించడానికి, సమాజంలో పూర్తిగా అభివృద్ధి చెందడానికి హక్కు ఉందని ధృవీకరిస్తూ, సోదరభావాన్ని, సౌభ్రాతృత్వాన్ని తిరిగి కనుగొనమని ఆయన ప్రపంచానికి పిలుపు నిచ్చాడు.

 

దేవుని పనిలో పాల్గొనమని యేసు మనల్ని ఆహ్వానిస్తున్నాడు (యోహా 9:4). క్రైస్తవులుగా మన పని గాయపడిన వారిని తీర్పు తీర్చడం కాదు. వారిని స్వస్థపరచడంలో సహాయం చేయడం. న్యాయం కోసం పోరాడుతున్న వారిని ఖండించడం కాదు. వారికి మద్దతు ఇవ్వడం. అంటే సామాజిక మంచిని నిర్మించడం. పేదలకు సేవ చేయడం, రోగులకు మద్దతు ఇవ్వడం, కుటుంబాలను బలోపేతం చేయడం మరియు మన సమాజాలలో న్యాయం మరియు కరుణను చైతన్య పరచడం. అంధుడు చివరన యేసును గుర్తించి ఆయనయందు విశ్వాసం ప్రకటించాడు. అయితే ఆధ్యాత్మికంగా జ్ఞానోదయం పొందుకున్నామని గర్వించే వారు ఇంకా అంధులుగానే మిగిలిపోతున్నారు. సువార్తికుడు యోహాను అందించే కథలోని నిజమైన అంధత్వం భౌతికమైనది కాదు, ఆధ్యాత్మికం. హృదయంతో చూడలేకపోవడం. మనం మన దీక్షా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు, మన స్వంత అంతర్ దృష్టిని పరిశీలించుకోమని మాతృ శ్రీసభ మనల్ని ఆహ్వానిస్తున్నది. మనం ప్రజలను వారి రూపాన్ని బట్టి తీర్పు తీరుస్తామా లేదా దేవుడు వారిని చూసే విధంగా చూడగలమా? క్రీస్తు మన కళ్ళు తెరిస్తే, మనం తీర్పు నుండి కరుణకు మరియు ఉదాసీనత నుండి సేవకు మారగలము. అప్పుడు, మన జీవితాల ద్వారా, దేవుని పనులు నిజంగా మన సమాజంలో కనిపిస్తాయి. అది నిజం. అదే తథ్యం.

 

 

ఆయన అద్భుతమైన కార్యములలో దేవుణ్ణి స్తుతించండి” (Divine Office).

 

 

 

 

 

Saturday, 7 March 2026

యూదుడు లేదా అన్యుడు కాదు... అందరూ క్రీస్తు యేసులో ఒక్కటే నిర్గమ 17:3-7; రోమా 5:1-2,5-8; యోహాను 4:5-42 (లెంట్ A /2)

 

యూదుడు లేదా అన్యుడు కాదు... అందరూ క్రీస్తు యేసులో ఒక్కటే

 

నిర్గమ 17:3-7; రోమా 5:1-2,5-8; యోహాను 4:5-42 (లెంట్ A /2)

బలహీనులకును అనాథలకును న్యాయం చేయండి. పీడితులకును పేదలకును న్యాయము తీర్చండి

 

ఈ ఆదివారం మరియు రాబోయే రెండు ఆదివారాల్లో, మత్తయి సువార్తను ధ్యానించడం కొంచెం ప్రక్కనపెట్టి యోహాను సువార్తలోని  కొన్ని అధ్యాయాలపై ధ్యానం చేస్తున్నాము మనము. యోహాను సువార్త ఒక నిర్దిష్ట ప్రార్ధనా/అర్చనా సంవత్సరానికి (liturgical Cycle) కేటాయించబడని ఏకైక సువార్త. బదులుగా, యోహాను సువార్త నుండి పఠనాలు మన మూడు సంవత్సరాల ప్రార్ధనా చక్రంలో కుదించబడ్డాయి. నేటి సువార్తలో యేసు మరియు సమరియకు చెందిన ఒక స్త్రీ మధ్య సంభాషణ యూదులు మరియు సమరియుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని వెల్లడిస్తుంది. ఇది వారి మధ్య సంభాషణను కూడా నిరోధించింది. “యూదుడా, సమరియ స్త్రీ అయిన నన్ను ఎలా మంచి నీళ్లు ఇవ్వమని అడుగగలవు?” అన్న వాక్యం ద్వారా ఆ స్త్రీ స్వయంగా తన సంప్రదాయం నుండి తానే విడిపోవడాన్ని సూచిస్తుంది.  అయినప్పటికీ యేసు ఆ స్త్రీతో సంభాషించడమే కాకుండా, ఆమె త్రాగే పాత్రను అందించమనీ అడుగుతాడు. ఇది యూదు చట్టం ప్రకారం అతన్ని అపవిత్రుడిని చేస్తుంది.

 

“ఆధునిక ప్రపంచంలో తిరుసభ” అనే అంశంపై రెండవ వాటికను మహా సభ  “పాస్టోరల్ రాజ్యాంగం” అనే శిర్షికన "గౌదియుం ఎత్ స్పెస్" (ఆనందం మరియు ఆశ) అనే ఒక బోధన చేసింది. అది చాలా శ్రేష్టమైన పాఠాన్ని కలిగివుంది. నేటి ప్రపంచాన్ని కలవరపెట్టే ఉద్రిక్తతలు వాస్తవానికి మానవ హృదయంలో పాతుకుపోయిన మరింత ప్రాథమిక ఉద్రిక్తతకు సంబంధించిన వాటిని విశిదం చేస్తుంది ఈ బోధన. మనిషి తనలోనే తనకు, అనేక అంశాలు వివిధ రకాల వివక్షతలో ఒకదానితో ఒకటి విభేదిస్తాయి. ఒక వైపు, ఒక జీవిగా తానుఅనేక పరిమితుల అనుభవాన్ని కలిగి ఉంటాడు. మరోవైపు, తన ఆకాంక్షలకు పరిమితి లేదని మరియు తాను ఉన్నతమైన జీవితానికి పిలువబడ్డాడని అతనికి తెలుసు. ఇంకా, తన బలహీనత మరియు పాపభరితత్వంలో, అతను తరచుగా తాను చేయకూడనిది చేస్తాడు. తాను చేయాలనుకున్నది చేయడంలో విఫలమవుతాడు. పర్యవసానంగా, అతను తనలో తాను సంఘర్షణకు గురవుతున్నాడు. ఇది సమాజంలో చాలా గొప్ప ఉద్రిక్తతలకు దారితీస్తుంది అని చెప్తుంది ఈ బోధన.

 

మానవులు మరియు చివరకు భూమి ఆధారిత జీవి ఏ జీవి అయినా దుమ్ము నుండి వచ్చి దుమ్ములో తిరిగి కలిసి పోవలిసిందే. “జాతస్య మరణం ధృవం”. మరణం తర్వాత తమతో ఏమి తీసుకువెళతారు? కాబట్టి, “గౌదియుం ఎత్ స్పెస్” - మనిషి అంటే ఏమిటి? ఇంత గొప్ప పురోగతి ఉన్నప్పటికీ ఇంకా కొనసాగే బాధ, చెడు, మరణాల అర్థం ఏమిటి? ఎంతో ఖర్చుతో సాధించిన ఆ విజయాల ప్రయోజనం ఏంగానూ? మనిషి సమాజానికి ఏమి దోహదపడగలడు? సమాజం నుండి అతను ఏమి ఆశించగలడు? భూమిపై ఈ జీవితం తర్వాత ఏమి తెస్తుంది?  అన్న ప్రశ్నలపై మనల్ని ఆలోచించమని పిలుస్తుంది ఈ బోధన. సమరియ స్త్రీ సంభాషణలోని అత్యున్నత అంశం - మెస్సీయలో మాత్రమే జీవించాలనే పిలుపు!! ప్రపంచంలో తన చరిత్రను సృష్టించిన అన్ని అడ్డంకులు మరియు సరిహద్దులను విస్మరించి, సత్యం మరియు ఆత్మతో ఆయనను ఆరాధించండి అని పిలుపు నిస్తుంది.

 

యేసు మరియు సమరయ స్త్రీ మధ్య జరిగిన సమావేశ ప్రాముఖ్యత అనేక స్థాయిలను కలిగి ఉంది. మొదటిది వ్యక్తిగతమైనది. ఆ స్త్రీ తనను తాను యేసునందు విశ్వాసంలోకి మార్చుకున్న విధంగా, మనం దేవుని వాక్యంలో మారడానికి పిలువబడ్డాము. రెండవది సామాజికమైనది. ఆమె తన స్వంత ప్రజలకు సువార్తికురాలిగా మారినట్లు, మనం సువార్తికులకు సువార్తికులుగా మారడానికి పిలువబడ్డాము. మూడవ స్థాయి విద్యాపరమైనది. దేవుని దయ పరిమితి లేదని తన శిష్యులకు బోధించడంలో యేసు సమరియ స్త్రీతో తనకు కలిగిన పరిచయాన్ని వివరిస్తున్నాడు. ఆయన దయను పొందడానికి మనము కలిగి యున్న సామాజిక అడ్డంకులను ఆయన లెక్కించడు. చివరగా, సమరయ పట్టణవాసుల మనోమార్పిడి అనేది సమస్త జనులను ఏకం చేసేవాడు యేసు మాత్రమె  అని నమ్మే ప్రపంచంలో - నూతనంగా సృష్టించబడే దైవరాజ్య సమాజానికి ముందస్తు రుచి!!

 

 

బలహీనులను పేదలను రక్షించండి. దుష్టుల చేతిలో నుండి వారిని విడిపించండి”.