AletheiAnveshana: వాక్య ధ్యానాoశము
Showing posts with label వాక్య ధ్యానాoశము. Show all posts
Showing posts with label వాక్య ధ్యానాoశము. Show all posts

Saturday, 16 August 2025

నా రక్షకుడే నాకు ప్రథానం యిర్మీయా 38:4-6,8-10; హెబ్రీ 12:1-4; లూకా 12:49-53 (20 / C)

 

నా రక్షకుడే నాకు ప్రథానం

యిర్మీయా 38:4-6,8-10; హెబ్రీ 12:1-4; లూకా 12:49-53 (20 / C)

దేవునికి భయపడే వారందరూ వచ్చి వినండి. ఆయన నా ఆత్మ కోసం ఏమి చేసాడో నేను చెబుతాను. అల్లెలూయా”.

 

యూదుల ఆలోచనలో, “అగ్ని దాదాపు ఎల్లప్పుడూ తీర్పుకు చిహ్నంగా వుంటుంది. స్వర్గం నుండి వచ్చే అగ్నిని భూమిపై సంభవించే విభజనతో యేసు ఎందుకు అనుసంధానించాడు? తండ్రి కొడుకుకు వ్యతిరేకంగా కొడుకు తండ్రికి వ్యతిరేకంగా" మరియు "తల్లి కూతురికి వ్యతిరేకంగా కూతురు తల్లికి వ్యతిరేకంగా" అనే తన ప్రకటనను తన అనుచరులు అక్షరాలా తీసుకుంటారని ఆయన ఆశించాడా? లేదా అన్నింటికంటే మించి తనను అనుసరించడం వల్ల కలిగే అవమాన వ్యధలను  ఉద్దేశపూర్వకంగా నొక్కి చెప్పడానికి  ఒక అలంకారిక ప్రసంగంగా ఉపయోగిస్తున్నాడా? ఒక ముఖ్యమైన పాఠాన్ని బోధించడానికి యేసు ఒక సాధారణ హీబ్రూ అతిశయోక్తిని (ఒక అలంకారిక ప్రసంగం) ప్రభువు ఉపయోగించాడని వేద శాస్త్రులు చెపుతున్నారు. మనం ఏ విషయంనైనా చాలా బలంగా నొక్కి చెప్పాలనుకున్నప్పుడు మనం తరచుగా అదే అతిశయోక్తులను వాడుతాము. అయితే, యేసు ఉపయోగించిన ఈ అతిశయోక్తిలో కలిగిన సువార్త సందేశం మన జీవితాలకు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది.


కుటుంబాల్లో సంభవించే విభజనను గురించి యేసు మాట్లాడినప్పుడు, ఆయన మనసులో ప్రవక్త మీకా ప్రవచనం వుండి ఉండవచ్చు. అ ప్రవచనం, ఒక మనిషికి శత్రువులు అతని ఇంటివారే (మీకా 7:6) అని ప్రవచిస్తుంది. దేవుని కుమారుడు మరియు లోక రక్షకుడు అయిన యేసుక్రీస్తు పట్ల విధేయత అంటే అన్ని ఇతర సంబంధాల కంటే ప్రాధాన్యతనిచ్చే విధేయత. దేవుని ప్రేమ అనేది మన జీవితాల్లో ఎవరు మొదటి స్థానంలో ఉండాలో అని ఎన్నుకునేలా మనల్ని ప్రోద్భలం చేస్తుంది. ఎటువంటి (సం)బంధాన్నైనా దేవుని కంటే మించి కలిగి వుండటం విగ్రహారాధన లాంటిది. అందుచేతనే తాము మొదట ఎవరిని ప్రేమిస్తారో, ఎవరికి ప్రప్రథమ స్థానాన్ని తమ జీవితాల్లో ఇస్తారో  పరిశీలించుకోమని యేసు తన శిష్యులను సవాలు చేస్తాడు. నిజమైన శిష్యుడు అన్నింటికంటే ఎక్కువగా దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తాడు మరియు యేసుక్రీస్తు కోసమే అన్నింటినీ వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. తన శిష్యులు కాదలచిన వాళ్ళు దేవునికి మాత్రమే కలిగే విధేయతను, జీవిత భాగస్వామి లేదా బంధువుల కంటే ఉన్నతమైన విధేయతను తనకు ఇవ్వాలని యేసు పట్టుబడుతున్నాడు. మనద్వారా దేవుడు ఏమి చేయాలనుకుంటున్నాడో దానిని  చేయనివ్వకుండా కుటుంబ సభ్యులు గానీ స్నేహితుల ఆలోచనలు గానీ మనలను నిరోధిస్తే లేదా వారి గురించిన ఆలోచన మనల్ని నిరోధిస్తే, వారే మన శత్రువులుగా మారే అవకాశం ఉంది. మనం  చేసే ప్రతీ పనిలోనూ దేవుణ్ణి మొదటి స్థానంలో ఉంచమని యేసుక్రీస్తు ప్రేమ మనలను బలోపేతం చేయగలుగుతుందా (2 కొరింథీ 5:14) ?


తాను శాంతిని తీసుకురావడానికి వచ్చానని అనుకోవద్దని యేసు జనసమూహానికి చెబుతున్నాడు ఇక్కడ. విభజనను తీసుకురావడానికి వచ్చానని చెబుతున్నాడు. మరియ తల్లి వైపు తిరిగి, ఆ బాల యేసును ఎత్తుకొని, “అనేకుల పతనమునకు  ఉద్దరింపునకు ఒక వివాదాస్పదముగా ఉండే సంకేతంగా ఉన్నాడని సిమియోనుడు ప్రవచించాడు (లూకా 2:34). దేవుని రాజ్యపు అంతిమ ముగింపు శాంతి, కానీ శాంతికి ఒక చ్చాలెంజింగు ధర సిద్దంగా ఉంది. దేవుని వాక్యం ఎక్కడ విని, దాని ప్రకారం ప్రవర్తిస్తే, అక్కడ విభజన జరుగుతుందని యేసు మనలను హెచ్చరిస్తున్నాడు. తల్లి తండ్రులు కుమార కుమార్తెలకు వ్యతిరేకంగానూ, అక్క చెల్లెండ్రు అన్నదమ్ములకు వ్యతిరేకంగా, బిడ్డలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా విభజించబడతారు.


16 వ. బెనెడిక్టు పోపు గారు యేసుక్రీస్తు కేవలం ఒక ప్రైవేట్ నమ్మకం లేదా ఒక అమూర్త ఆలోచన కాదు. కానీ అతను మానవ చరిత్రలో భాగం కావడం ప్రతీ పురుషుడు మరియు స్త్రీ జీవితాన్ని పునరుద్ధరించగల నిజమైన వ్యక్తి" అని ధృవీకరించాడు. విశ్వాసానికి ధైర్యం మరియు సన్యాసిత లేదా అంకురార్పణ  పోరాటం అవసరం. పాపం మరియు చెడు నిరంతరం మనల్ని ప్రలోభ పెడతాయి. అందుకే పోరాటం, ధైర్యవంతమైన ప్రయత్నం మరియు క్రీస్తు అభిరుచిలో పాల్గొనడం అనేవి చాలా అవసరం. పాపం పట్ల ద్వేషం శాంతియుతమైన విషయం కాదు. పరలోక రాజ్యం మనలో ప్రయత్నం, పోరాటం మరియు హింసను కోరుతుంది మరియు ఈ ప్రయత్నం చేసేవారు దానిని జయించేటటువంటి వారే (మత్త 11:12)!! మన మదినిండా  యేసును మనం నిలుపుకుంటే, మన నిరుత్సాహానికి స్థానం వుండదు. ఆయన త్యాగం మనం తరచుగా స్థిరపడి పోతున్నటువంటి ఆధ్యాత్మిక వెచ్చదనానికి వ్యతిరేకంగా వుంటుంది! దీనిని ఎపుడూ గమనిస్తూనే వుండాలి.

మనుష్యులు మీ మంచి పనులను చూసి మీ తండ్రిని మహిమపరచగలిగేలా మీ వెలుగు వారి ముందు చాలా ప్రకాశవంతంగా ప్రకాశించాలి(Divine Office)

 

Thursday, 14 August 2025

అమ్మా! నీ శరీరం పవిత్రం మహిమాన్వితం 1 దినవృత్తా 15:3-4,15-16,16:1-2; 1 కొరింథీ 15:54-57; లూకా 11:27-28 (C)

 

అమ్మా! నీ శరీరం పవిత్రం మహిమాన్వితం

1 దినవృత్తా 15:3-4,15-16,16:1-2; 1 కొరింథీ 15:54-57; లూకా 11:27-28 (C)

 

ఓ కన్య రాణి, లెమ్ము! నీవు నిత్య గౌరవానికి అర్హురాలవు. శాశ్వత రాజు అద్భుత రాజభవనంలోకి ప్రవేశించు.(Divine Office)

 

దేవుని తల్లి ఆరోహణ పండుగ రోజున తిరుసభ పితృ పాదులు తమ ప్రసంగాలలోనూ, వేద పండితులు తమ గ్రంథాలలో ఆమె ఆరోహణను గురించి వ్రాస్తూ గ్రంథ రచన కన్నా ముందే ఆదిమ సంఘ విశ్వాసులు అప్పటికే మరియ మాత ఆత్మ శరీరములతో  పరలోక ఆరోహణ చేసినట్లు విశ్వసించారని తెలియజేస్తున్నారు. వారు చేసినదంతా ఒక్కటే, అది అదే విశ్వాసాన్ని సకల జనులకు వెల్లడి చేసి దాని అంతర్య అర్థం మరియు సారాంశాన్ని సులువైన పదాలలో వివరించడం మాత్రమె చేస్తున్నామని వివరించారు. అన్నింటికంటే మించి, ఈనాటి వేడుక పవిత్ర కన్య మరియ శారీరక క్షీణతను అనుభవించలేదనే వాస్తవాన్ని మాత్రమే కాకుండా, ఆమె ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు మాతృకను అనుసరించి మరణం మరియు ఆమె స్వర్గపు మహిమపై సాధించిన విజయాన్ని కూడా గుర్తుచేస్తుందని వారు చాలా స్పష్టంగా చెప్పారు.

పునీత జాన్ డమస్సీను అనే పితృపాదులు ఆమె పొందుకున్న అధికారాలను ఈ విధంగా హెచ్చించాడు: పవిత్ర నిష్కళంక ప్రసవ ప్రక్రియ ద్వారా తన కన్యత్వాన్ని భంగ పరచకుండా ఎలా భద్రపరచబడినదో మృత్యువుచేత ఆమె శరీరాన్ని కుళ్ళిపోకుండా అదేవిధంగా భద్రపరచబడినది అని విశ్వసించడం సరైనదే. తన సృష్టికర్తకు పసితనంలో తన రొమ్ము వద్ద స్థానం ఇచ్చిన ఆమెకు అదే సృష్టికర్త తన నివాస స్థలంలో ప్రముఖ స్థానం ఇవ్వడం అనేది సరైనదే. పరలోకతండ్రి ఏర్పాటు చేసిన  స్వర్గపు కళ్యాణ  గదిలో ఈ వధువు నివసించడం సరైనదే. జనన సమయంలో దాటిపోయిన బాకు శిలువపై తన కుమారుడిని చూసిన క్షణంలో తన హృదయంలోకి దూసుకు పోయిన ఆ దుఃఖ బాకుతో, ఇప్పుడు అతని తండ్రి కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువును చూడటం ఆమెకు సరైనదే కదా! దేవుని తల్లి తన కుమారునికి చెందిన సమస్తమును తాను కలిగి ఉండటం అనేది మరియు దేవుని తల్లిగానూ సేవకురాలిగానూ ప్రతి సృష్టి జీవిచే గౌరవించబడటం సరైనదే. కాన్స్టాంటినోపుల్‌కు చెందిన పునీత జర్మనసు, “దేవునకు జన్మ నిచ్చిన తల్లి శరీరం కుళ్ళిపోకుండా కాపాడాలని భావించాడు దేవుడు. ఎందుకంటే ఆమె దేవుని నివాస స్థలం అయింది కాబట్టి. ఇది నాశనం కాని ఒక మహిమాన్వితమైన జీవితంగా మారింది. మచ్చలేని సజీవిగా పరిపూర్ణ జీవితాన్ని పంచుకుంది” అని విశ్వసించాడు.

నూతన ఆదాముకు (రోమి  5:12-21) నూతన హవ్వగా కన్య మరియను గుర్తుంచుకోవడం ముఖ్యం. అలాగని ఆమె ప్రభువుకు సమానం కాదు. కానీ మృత్యు శత్రువుపై సాధించిన యుద్ధంలో అతనికి సహకారాన్ని అందించింది. ఎదోను తోటలో వాగ్దానం చేయబడిన పాపానికి శాపం  మరియు మృత్యువుపై సాధించిన విజయంతో ముగిసింది (ఆది 3: 14-19). ఈ విజయానికి చివరి బహుమతికి క్రీస్తు మహిమాన్విత పునరుత్థానం అతి ప్రాముఖ్యమైనది. కానీ ఆ పోరాటంలో ధన్య కన్యమరియ భాగస్వామ్య సహకార ప్రక్రియ తన భూ మర్త్యశరీరాన్ని మహిమపరచడంలో ముగుస్తుంది. అపొస్తలుడు పౌలు చెప్పినట్లుగా: ఈ మర్త్య స్వభావం అమరత్వాన్ని ధరించినప్పుడు, మరణం విజయంలో మ్రింగివేయబడింది" (1 కొరింథీ 15) అని చెప్పిన లేఖనంలో మనకు చక్కగా ఈ ఆంతర్యం అర్ధమవుతుంది.

తండ్రి దేవుని రక్షణ ప్రణాళికలో కుమార వాక్కు దేవుడు యేసుక్రీస్తుకు గొప్ప తల్లిగా, తన శాశ్వతత్వంనందు అగోచారంగా  ఐక్యమై,  నిష్కళంకంగా గర్భం దాల్చింది. రక్షణ చరిత్రలో క్రీస్తు సహచరురాలిగా,  పాపాన్ని మరియు దాని పరిణామాలను ఆమె ఓడించింది. మరణంపై తన కుమారుడు విజయం సాధించడంలో అవినీతి సమాధి నుండి రక్షించబడే తుది కిరీట అధికారాన్ని పొందింది. ఆ విధంగా ఆమె తన ఆత్మశరీరాలతో స్వర్గపు అత్యున్నత మహిమకు దేవునిచే కొనిపోబడింది. అదే అమర రాజు తన కుమారుని కుడి ప్రక్కన, యుగ యుగాల రాణిగా ప్రకాశిస్తుంది.

"ప్రభువు ఆమెను ఎన్నుకున్నాడు. ఆమె పుట్టకముందే అతను ఆమెను ఎన్నుకున్నాడు. అతను తన సొంత నివాస స్థలంలో నివసించడానికి ఆమెను తీసుకొని వెళ్ళాడు" (Divine Office).

Friday, 8 August 2025

యేసు తట్టుచున్నాడు. అప్రమత్తంగా ఉండుము జ్ఞాన 18:6-9; హెబ్రీ 11:1-2,8-19; లూకా 12:32-48 (19/ C)

 

యేసు తట్టుచున్నాడు. అప్రమత్తంగా ఉండుము

జ్ఞాన 18:6-9; హెబ్రీ 11:1-2,8-19; లూకా 12:32-48 (19/ C)

“మనలో ప్రతి ఒక్కరూ మన హృదయంలో దేవుడిని కలిగి ఉన్నాము. ఆయన దివ్య ప్రతిరూపంగా రూపాంతరం చెందుతున్నాము(పునీత సినాయి అనస్తాసియుసు)

యేసు చెప్పిన గృహనిర్వాహకుని ఉపమానంలో జాగరూకత గురించిన సందేశాన్ని సువార్తికుడు లూకా మనకు అందిస్తున్నాడు. యేసు కాలంలోని గృహనిర్వాహకులు యజమాని లేనప్పుడు ఇంటిని దాని సిబ్బందిని నిర్వహించే బాధ్యత వహించేవారు. ఈ అలాంటి వారిలో ఒక వ్యక్తి చేసిన తప్పు ఏమిటంటే, యజమాని లేనప్పుడు బాధ్యతారహితంగా వ్యవహరించాడు. రాబోయే తీర్పుకు సిద్ధంగా ఉండాలనీ, అర్ధరాత్రిన వచ్చినప్పటికీ అప్రమత్తంగా ఉండాలనీ, విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహం వలే  ఎప్పుడూ వెనక్కి తిరగవద్దని యేసు మనల్ని హెచ్చరిస్తున్నాడు. విశ్వాసం సహనం ఆధ్యాత్మిక ధర్మాలుగా పరిగణించబడతాయి. పునీత పౌలు విశ్వాసాన్ని ఇలా నిర్వచించాడు, విశ్వాసమనేది మనం నిరీక్షిస్తున్న వాటిలో నమ్మకం, మనం చూడని వాటి గురించిన నిశ్చయత” (హెబ్రీ 11:1) అని నిర్వచించాడు.

యేసు పట్ల విశ్వాసం మరియు ప్రేమతో నిండిన ఇద్దరు యువతులు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా త్యాగం చేశారు. ఈ సంఘటన 202 క్రీ.శ. రోమను సామ్రాజ్యంలో భాగమైన ఉత్తర ఆఫ్రికాలోని కార్తేజు (ట్యునీషియా) అనే ప్రాంతములో జరిగింది. ఇటలీ దేశపు రోము చక్రవర్తి అయిన సేప్టిముస్ సేర్వానుసు పుట్టినరోజు వేడుకలకు సిద్ధమయ్యే సమయం అది. చక్రవర్తి పుట్టినరోజు వేడుకల మధ్య, మరణ శిక్షకు పోరాడుతున్న గ్లాడియేటర్ల (బానిస యుద్ద వీరులు)తో ఉచిత ఆటలు నిర్వహించబడ్డాయి. ఇటువంటి  పోరాట ఆటల మధ్యమధ్యన దేశ ద్రోహులకు విధించబడిన శిక్షను క్రూరమైన జంతువులకు ఆహారంగా ఇచ్చే వినోదాలు ఉండేవి. ఈ ఇద్దరు యువతులు ఆ వినోద క్రూర ఆటలకు బాలి అయ్యారు. వారు 22 ఏళ్ల ఉన్నత కుటుంబ యువతి మరియు ఆమె సేవకురాలు. ఇద్దరూ గర్భవతులే. ఒక మిషనరీ, యేసుక్రీస్తు తన శాశ్వత రాజ్యం మరియు దేవుని ప్రేమ గురించి బోధించటం వారు విన్నారు. వారు క్రైస్తవులు కావాలని నిర్ణయించుకున్నారు. క్రైస్తవులుగా జీవించడం వల్ల వారి ఆనందం ఎంత ఎక్కువ అయిందో, రోము చక్రవర్తి దృష్టిలో అది అంత కర్కశంగా మారింది. ఆ గొప్ప యువతులలో ఒకరు పెర్పెతువ (ఫెలిక్స్), రెండవ వారు ఫెలిచిత (సంతోషం) ఆమె సేవకురాలు. మరియు యేసుక్రీస్తులో దేవుని ప్రేమను ఇతరులు గ్రహించాలనీ, సాక్ష్యమివ్వాలని వారు నిర్ణయించుకున్నారు. తమ ఆనందాన్ని తమలోనే దాచుకునే అవకాశమే వారికి లేదు. క్రీస్తును తిరస్కరించడం అంటే తమను తాము తిరస్కరించుకోవడమేనని ఇద్దరూ నమ్మారు. ఇద్దరూ, నేను క్రైస్తవురాలిని” అని బాహాటం చేశారు. వారిని అరెస్టు చేసి భయంకరమైన జైలులో పడవేశారు. వినోద ఆటలు ప్రారంభమయ్యాయి. పెర్పెతువ మరియు ఫెలిచిత మరియు మరో ముగ్గురు వినోద యుద్ద భూమిన క్రూరమృగాల ముందు విసిరివేయబడ్డారు. రోమన్లు గర్భిణీ అమ్మాయిని చంపరు ఎందుకంటే అది శిశువును చంపడం లాంటిది. కానీ సైనికులు  ఆ అమ్మాయిలను అన్యమత దేవతల వలె అలంకరించారు. ఇది ప్రేక్షకులకు నచ్చలేదు. కాబట్టి, వారి గర్భాలు కంపించకుండా వారికి భారీ బట్టలు ధరింపచేసి  స్టేడియంలోకి నడిపించారు. అడవి దున్నల గుంపును ఆ రక్త భూమిలోనికి విడుదల చేశారు. అవి ఆ యువతులవైపు పరుగులు తీస్తున్న ప్పుడు భూమిపై నుండి లేచిన దుమ్ము వారిని కప్పివేసి వారిని కానరాకుండా చేసింది. పెర్పెతువ తన సేవకురాలు ఫెలిచితతో, "కానీ అందరూ చూసేలా మనం క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలి" అని అన్నది. వారి ధైర్య సాహసాలను చూచిన ప్రజలు క్రైస్తవులుగా మారకుండా నిరోధించడానికి, ఈ అమ్మాయిల ధైర్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోకుండా ఉండటానికై సైనికులు స్టేడియం గోడకు అతుక్కుపోయిన వారిని  మధ్యలోకి లాక్కోచ్చారు. సైనికులు దుమ్ములోనే వారిద్దరినీ చంపేశారు. గురువు ఏ పూజలోనైనా మొదటి దివ్య సత్ప్రసాద ప్రార్ధనను ప్రార్ధిస్తే మనం ఈ ఇద్దరి పేర్లను తప్పకుండా వింటాం. పెర్పేతువ ఫెలిచితల రక్త సాక్ష్యం నేటి మనకు ధైర్యాన్నిస్తుంది కదా! "బయటకు రండి, యుద్ధ భూమి మధ్యలోకి వచ్చి సాక్ష్యం ఇవ్వండి" అనేది క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వాలనే మన ఆత్మల అంతర్గత బలమైన కోరిక. యేసును తిరస్కరించేవారు ఆయన కోసం బాధపడమని మనల్ని పిలిచే యుద్ధ భూమి కేంద్రం వంటి వారు. మన విశ్వాసానికి సరైన ప్రతిస్పందన ఇతరులను క్రీస్తు వైపు నడిపించడం. మనం క్రీస్తును ఎన్నుకున్నాము. వెనక్కి తగ్గే అవకాశమే లేదు.

"చిన్న మందా, ఇక భయపడకు" (లూకా 12:32) అని యేసు చెప్పిన సున్నితమైన మాటలతో నేటి సువార్తా పఠనం ప్రారంభమవుతుంది. భయం అనేది శారీరక, ఆధ్యాత్మిక, మానసిక, భావోద్వేగ లేదా నైతిక ప్రమాదం వల్ల కలిగే ఆందోళన. మనం అన్ని రకాల విషయాలకు భయపడతాము! ఇది మనలోని మానవ సహజ నిర్మితం. మన ఆరోగ్యాన్ని కోల్పోతామని, ఉద్యోగాలు కోల్పోతామని, కుటుంబ సభ్యుడిని కోల్పోతామని లేదా మంచి స్నేహితులను కోల్పోతామని భయపడతాము. ఒంటరిగా జీవించడం, ఒంటరిగా చనిపోవడం, తిరస్కరణ, వైఫల్యం మరియు డబ్బును కోల్పోతామని భయపడతాము. మనం సాన్నిహిత్యం లేదా వదిలివేయబడతామని భయపడవచ్చు. భయం మన ఆధ్యాత్మిక మానసిక ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. మన భయాలు మనల్ని తమ బంధంలో బందిస్తాయి. దేవుని స్వేచ్ఛను అనుభవించకుండా నిరోధిస్తాయి. మన భయాలను ప్రతిరోజూ ఎదుర్కోవడం వలన ఆధ్యాత్మికంగా మానసికంగా ఎదగడానికి మనకు అవకాశాలను అందిస్తుంది. మన రక్షకుడిని కలవడానికి మనం సిద్ధమవుతున్నప్పుడు వాటిని సవాలుతో ఎదుర్కోవడానికి ఇది ఒక చక్కటి పిలుపు. పునీత అగస్టీను గారు, “మనలో ప్రతి ఒక్కరూ ముగింపుకు సిద్ధం కావాలి. ప్రతి రోజు చివరి రోజులా జీవించే ఎవరికీ చివరి రోజు అనేది ఎటువంటి హానిని కలిగించదు. మీరు శాంతియుతంగా చనిపోయే విధంగా జీవించండి. ఎందుకంటే ప్రతిరోజూ చనిపోయేవాడు ఎన్నడు చనిపోడు” అని అంటాడు.

ఇప్పుడు కావచ్చు రేపు కావచ్చు మన రక్షకుడు వచ్చినప్పుడు మనం మన పనులు చేసుకుంటూ ఉండాలని ఈ ఉపమానం మనకు గుర్తు చేస్తుంది. నేడు యేసు మన హృది తలుపు తట్టితే, ఆయనను స్వీకరించడానికి మనం సిద్ధంగానూ ఆసక్తిగానూ  ఉండగలమా? రోజున ఏ క్షణంలోనైనా ఆయన రాకకు మనం సిద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన అందరి హృదయపు తలుపు తట్టి, "వినుము! నేను నిలబడి మీ తలుపు తట్టుతున్నాను. మీరు నా స్వరం విని తలుపు తెరిస్తే, నేను లోపలికి వస్తాను మరియు మనం కలిసి విందు చేసుకుంటాము" (ప్రక 3:20). ఆయనే మనలను తన రాకకు సిద్ధపరుస్తాడు.

మన హృదయాలలో, క్రీస్తు తండ్రితో కలిసి తన నివాసాన్ని తీసుకుంటాడు, అతను ప్రవేశించినప్పుడు ఇలా అంటాడు: నేడు ఈ ఇంటికి మోక్షం వచ్చింది (పునీత సినాయి అనస్తాసియుసు)

Saturday, 2 August 2025

కష్టమైనను ఉత్తమమైనదానిని సంపాదించు ప్రసంగి 1:2; 2:21-23; కొలొ 3:1-5,9-11; లూకా 12:13-21 (18/ C)

 

కష్టమైనను ఉత్తమమైనదానిని సంపాదించు

ప్రసంగి 1:2; 2:21-23; కొలొ 3:1-5,9-11; లూకా 12:13-21 (18/ C)

మనం... సృష్టికర్తకు బదులుగా సృష్టించబడిన వాటిని పూజించి సేవ చేయగలమా? (రోమా 1:25)

కీర్తనకారుడు, నీవు సృజించిన ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రతారకలను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? నీ కంటెను వానిని కొంచెము తక్కువ వానిగా మాత్రమె చేసియున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు. నీ సృష్టియంతటి మీద వానికి అధికారమిచ్చి యున్నావు” (కీర్తన 8: 4-6) అని ప్రార్థించాడు. పోపు ఫ్రాన్సిసు మనలను ఇలా ఆదేశించాడు, “మీరు చాలా ప్రాముఖ్యమైనవారు! మీరు ఏమి కలిగి ఉన్నారో దానిని కాదు, మీరు ఏమిటో అన్నదానిని మాత్రమె  దేవుడు లెక్కిస్తాడు. అతని దృష్టిలో, మీరు ధరించే బట్టలు లేదా మీరు ఉపయోగించే సెల్ ఫోన్లు ఖచ్చితంగా పట్టింపు కాదు అతనికి. మీరు స్టైలిష్‌గా ఉన్నారా లేదా అనేది ఆయనకు పట్టింపు కాదు. ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తాడు! ఆయన దృష్టిలో మీరు చాలా విలువైనవారు, మీ విలువ అమూల్యమైనది." ఇదే విషయం యిర్మీయా 1:5; యెషయా 49:16; కీర్తన 8:4; కీర్తన 139:18-19 లలో మనకు వాగ్దానం చేయబడినది. మనం చిత్తశుద్ధితో జీవించడం ద్వారా మాత్రమె పరలోకంలో మన నిధిని నిల్వ చేసుకుంటాము. పునీత జాన్ మేరీ వియాన్నీ గారు, మనిషికి ప్రార్థించడం మరియు ప్రేమించడం అనేది ఒక అందమైన విధి మరియు బాధ్యత. మీరు ప్రార్థించి ప్రేమించినట్లయితే, మీరు ఈ లోకంలో ఆనందాన్ని పొందుతారు” అని తన బోధనలో వ్రాసాడు. “పేదల అవసరాలను మనం తీర్చ గలిగినపుడు, అది దయతో కూడిన పని కాదు. అది మనది కూడా కాదు. వారిది వారికే ఇచ్చెస్తున్నామనీ, మనం న్యాయపు రుణాన్ని చెల్లిస్తున్నాము" అని పునీత గ్రెగొరీ ది గ్రేట్ బోధించాడు. ఇది ఒక విప్లవాత్మకమైన బోధన.

క్రీస్తు విలువలు లోక విలువలకు విరుద్ధంగా వుంటాయి. పౌలు ఇలా అంటున్నాడు, మనం లోకం దృష్టిలో మూర్ఖులం, కానీ ఆయన దృష్టిలో జ్ఞానవంతులం. క్రీస్తు కోసం మనం మూర్ఖులం అవుతాము (1 కొరింథీ 3;19; 4:10). “లోకమంతటినీ సంపాదించి, మనల్ని మనం పోగొట్టుకోవడం వల్ల లేదా నాశనం చేసుకోవడం వల్ల మనకు ఏమి లాభం?” (లూకా 9:25). “మనకు అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నప్పటికీ, అది మన ఆత్మలకు ఏమాత్రం భద్రత తీసుకు రాలేదు” (లూకా 12:15). అమూల్యమైన ఉద్దేశపూర్వక జీవితం అనేది కేవలం డబ్బు లేదా భౌతిక వారసత్వాన్ని కూడబెట్టుకోవడంపై దృష్టి పెట్టదు. నేటి సువార్తలోని ధనవంతుడు తన శక్తిని సమయాన్ని సంపదపై మరియు సంపదను పోగుచేయడంపై ఖర్చు చేశాడు. యేసు మన సంపద మరియు ఆరోగ్యానికి వ్యతిరేకమా? “ఆయన పేదలను దుమ్ములో నుండి పైకి లేపుతాడు. పేదవారిని బూడిద కుప్ప నుండి పైకి లేపుతాడు. వారిని రాజులతో కూర్చోబెడతాడు. వారిని గౌరవ సింహాసనాన్ని వారసత్వంగా పొందేలా చేస్తాడు” (1 సమూ 2:8) అనే లేఖనాన్ని ఆయన తిరస్కరించడు. ఆయన సౌకర్యాలకు సంపదలకు వ్యతిరేకి కానే కాదు, కానీ ఆయనకు ఒక సాధారణ ప్రశ్న ఉంది, “మూర్ఖుడా! ఈ రాత్రి, నీ ప్రాణం నీ నుండి కోరబడితే, నీవు సిద్ధం చేసుకున్న సంపదలు ఎవరివి అవుతాయి?" ఈ ప్రశ్న పునీత లయోలా పురి ఇగ్నేషియస్‌తో మాట్లాడింది. తన సమాధానం చాలా మందికి నేటికీ స్ఫూర్తినిస్తుంది.

మరో తీవ్రమైన విషయం ఏమిటంటే, జీవనోపాధి కోసం మరియు ప్రగతి కొరకు పనిచేయడంలో విలువను చూడకపోవడం. కొందరు ఇలా అంటారు, “జీవితం చాలా చిన్నది. మనం ప్రజా ఖర్చుతో ఆహారం పొందవచ్చు కాబట్టి భారమైన పనులతో ఎందుకు బాధపడాలి?” రాష్ట్ర ప్రయోజనాలతో జీవించడం అనేది చెల్లుబాటు అయ్యే వృత్తిపరమైన ఎంపిక కాకూడదు. క్రీస్తు రెండవ రాకడ చాలా దగ్గరగా ఉందని, పని అనవసరమని భావించిన ప్రారంభ తొలి క్రైస్తవ సంఘంలోని  కొంతమంది విశ్వాసుల్లో ఆ ధోరణి ఉండేది. స్తబ్దత మరియు సోమరితనం ఎటువంటి అభివృద్ధిని తీసుకురాలేదు. దేవుని నుండి మనం పొందుకున్న ప్రతిభకు మనం జవాబుదారులం (మత్తయి 25:14-30). పునీత పౌలుడు ఈ విషయంలో ఒక వ్యవహారికసత్తావాది: “ఎవరైనా పని చేయడానికి నిరాకరిస్తే, వారు తినకూడదు” (2 థెస్స 3:10) అని నిర్ధారించాడు.

ధర్మం అనేది సాధారణంగా విపరీత వైపరిత్యాల మధ్య మధ్యస్థాయిగా ఉంటుంది. మనం దీన్ని డబ్బు కోసం శ్రమించే కోరికలకు అన్వయించుకోవాలి. మనకు కొన్ని ప్రాపంచిక వస్తువులు, నివసించడానికి ఒక ఇల్లు మరియు మన జీవితాలను పోషించు కోవడానికి డబ్బు అవసరం. సంపదలు వాటంతటకు అవే విలువైనవి కావు అలాగని విలువ తక్కువవి కూడా కాదు. మనం చూస్తున్నట్లుగా  సృష్టించబడిన ప్రతీ జీవి పుడమిలో పురోగతిని తీసుకురావడానికి ఎలా ప్రయత్నిస్తుందో అలాగునే  మనం కూడా మెరుగైన సమాజం కోసం పనిచేయడానికి పిలువబడ్డాము. సంపదలు మంచివే కానీ దేవునిలో ఐక్యత చెందడానికై మన ఆత్మలు కలిగియున్న వేదనను మాత్రం తీర్చలేవు. తత్ఫలితంగా, మనం వాటిని తాము ఉన్నవిధంగానే మరియు బాధ్యతాయుతమైన పురోగతికి ఒక మార్గంగా ఉపయోగించుకోవాలి. డబ్బును బాధ్యతాయుతంగా ఉపయోగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంధములో అగూర్ అనే అతను, “నాకు పేదరికం లేదా సంపద ఇవ్వకండి, కానీ నా రోజువారీ ఆహారాన్ని మాత్రమే ఇవ్వండి. లేకపోతే, నా దగ్గర చాలా ఉంటే  నిన్ను తిరస్కరించి, ‘ప్రభువు ఎవరు?’ అని అడగవచ్చు లేదా నేను పేదవాడిని అయి దొంగిలించి నా దేవుని నామాన్ని అవమానపరచవచ్చు” (సామెతలు 30: 8-9) అని భగవంతుణ్ణి వేడుకున్నాడు. అదే విధంగా సొలొమోను రాజు, “కాబట్టి నీ ప్రజలకు తీర్పు తీర్చడానికి నీ సేవకుడికి వివేకవంతమైన హృదయాన్ని దయ చేయుము, తద్వారా నేను మంచి చెడుల మధ్య తేడాను వివేచించగలను” (1 రాజు 3:9) అని ప్రార్థించాడు. అలా మనము మన సంపదల వినియోగార్ధ జ్ఞానము కొరకు ప్రార్ధన చేద్దాం.

"నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తిపరచబడుదురు" (మత్త 5:6)