దివ్య సత్ప్రసాదం
యాజకత్వమునకు నూతన నిబంధనకు
మూల పునాది
ఈ
రాత్రి, మన
విశ్వాసపు అత్యంత పవిత్రమైన క్షణాలలోకి మనం ప్రవేశిస్తున్నాము. త్రిదినాలలో మొదటి
రోజు పవిత్ర గురువారంనాడు పస్కా మర్మపు ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ రాత్రి, యేసు తన సంఘ
వధువునకు అమూల్యమైన దివ్య సత్ప్రసాదం, యాజకత్వం మరియు వినయపూర్వకమైన సేవలో
వ్యక్తమయ్యే ప్రేమ ఆజ్ఞ అనే మూడు బహుమతులను ప్రసాదిస్తున్నాడు. యోహాను సువార్త
“ఆయన లోకమందున్న తనవారిని ప్రేమించి, వారిని అంతము వరకు ప్రేమించెను” (యోహా 13:1–15) అనే ఒక
లోతైన గర్భిత ప్రకటనతో ప్రారంభమవుతుంది. ఈ మాటలు యేసు హృదయాన్ని వెల్లడిస్తున్నాయి.
ఆయన ప్రేమ పాక్షికమైనది లేదా తాత్కాలికమైనది కాదు. అది సంపూర్ణమైనది
మరియు త్యాగపూరితమైనది.
తన
కడరాత్రి భోజన సమయంలో, యేసు బల్ల మీద
నుండి లేచి, తన పై వస్త్రాన్ని తీసివేసి, ఒక తువ్వాలును నడుముకు కట్టుకొని, మోకరించి, తన శిష్యుల
పాదాలను కడిగాడు. ఆ కాలపు నమాజ సంస్కృతిలో, పాదాలు కడగడం అనేది అత్యంత కనిష్ఠ
సేవకుని పని. అయినప్పటికీ, దేవుని కుమారుడు ఒక సేవకుని స్థానాన్ని తీసుకున్నాడు. పేతురు అందుకు ఆశ్చర్యపడి, “నీవు నా పాదాలను
ఎన్నటికీ కడగకూడదు” అని అన్నాడు. అందుకు యేసు, “నేను నిన్ను కడితేనే తప్ప, నీకు నాతో పాలు
ఉండదు” అని జవాబిచ్చాడు. ఈ చర్య ద్వారా, నిజమైన శిష్యరికం వినయం మరియు సేవలో
పాతుకుపోయి ఉంటుందని యేసు బోధిస్తున్నాడు.
అదే
రాత్రి, యేసు
దివ్య సత్ప్రసాదాన్ని స్థాపించాడు. పరిశుద్ధ పౌలుడు, “ఇది మీ కొరకు అప్పగింప బడనున్న నా
శరీరము... ఈ గిన్నె నా రక్తములో నింపబడిన క్రొత్త నిబంధన” (1 కొరింథీ 11:23-26) అని
వ్రాశాడు. ఇక్కడ, యేసు తనను తాను మానవాళికి పూర్తిగా అర్పించుకున్నాడు. దివ్య
సత్ప్రసాదం కేవలం ఒక చిహ్నం కాదు. సంకేతం అంతకంటే కాదు. అది క్రీస్తు నిజమైన ప్రత్యక్షత. మనలో తన ఉనికి. మనలో చైతన్యతను
తీసుకొచ్చే తన ఆస్థిత్వం. తన దివ్య శరీరం (సత్ప్రసాదం) క్రైస్తవ జీవితానికి మూలం
మరియు శిఖరం అని సత్యోపదేశo చెప్పకనే చెపుతుంది.
ప్రతి దివ్యబలిపూజ క్రీస్తు త్యాగాన్ని ప్రత్యక్షం చేస్తుంది. తన స్వంత జీవంతో మనలను పోషిస్తుంది. అయితే, దివ్య సత్ప్రసాదం ఇంకా
కొనసాగడం కొరకు, యేసు యాజకత్వాన్ని స్థాపించాడు. ఇది భూ చరిత్ర అంతటా శాశ్వితంగా నిలుస్తుంది. ఆయన, “నా జ్ఞాపకార్థం
దీనిని చేయండి” అని చెప్పినప్పుడు,
దివ్య సత్ప్రసాదాన్ని జరిపే మరియు తన ప్రజలను నడిపించే బాధ్యతను
అపొస్తలులకు అప్పగించాడు. అందువల్ల,
యాజకుడు క్రీస్తు ప్రతినిధిగా సంఘానికి సేవ చేస్తూ,
దేవుని వాక్యంతో మరియు క్రీస్తు శరీరంతో దానిని పోషిస్తున్నాడు.
యాజకత్వం
అనేది ఒక అధికార స్థానం కాదు. అది త్యాగం మరియు సేవతో కూడిన దైవ పిలుపు.
క్రీస్తు తన శిష్యుల పాదాలను కడిగినట్లే, యాజకులు వినయంతో, కరుణతో ప్రజలకు
సేవ చేయడానికి పిలువబడ్డారు. తొలి సంఘ పితృపాదులు దివ్య సత్ప్రసాదానికి మరియు
ప్రేమకు మధ్య ఉన్న ఈ సంబంధాన్ని అర్థం చేసుకున్నారు. హిప్పోకు చెందిన పునీత అగస్టీను, “మనం దివ్య
సత్ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు,
మనం స్వీకరించిన దానిగా — అంటే క్రీస్తు శరీరంగా — మారిపోతామ”ని
బోధించాడు. జాన్ క్రిసోస్టోమ్,
“పేదవారిలో క్రీస్తును విస్మరిస్తూ బలిపీఠం వద్దకు వచ్చి ఆయనను
ఘనపరచలేమని విశ్వాసులకు గుర్తు చేశాడు. మరో మాటలో చెప్పాలంటే, దివ్య సత్ప్రసాదం
మనం జీవించే విధానాన్ని మార్చుతుంది.
మన
ప్రపంచం తరచుగా విభజన, అసమానత మరియు ఉదాసీనతలతో నిండిపోతుంది. చాలా మంది ఒంటరితనం, పేదరికం మరియు
అన్యాయాన్ని అనుభవిస్తున్నారు. దివ్య సత్ప్రసాద వేడుక కరుణ మరియు సంఘీభావంతో కూడిన
సమాజాలను నిర్మించమని మనకు పిలుపునిస్తుంది. మనం దివ్య సత్ప్రసాదం స్వికరించిన
ప్రతిసారీ, క్రీస్తు పరిచర్యను కొనసాగించడానికి, అంటే సేవ చేయడానికి, క్షమించడానికి, సయోధ్య
కుదర్చడానికి మరియు ప్రేమించడానికి యేసు పిలుపునందు కున్నాము. మనం దివ్య
సత్ప్రసాదాన్ని నిజంగా స్వీకరించి,
క్రీస్తు మాదిరిని అనుసరిస్తే, మన జీవితాలు ఆయన ప్రేమను
ప్రతిబింబిస్తాయి. మన కుటుంబాలు క్షమాపణకు నిలయాలుగా, మన సమాజాలు సేవకు
కేంద్రాలుగా మారతాయి మరియు మన ప్రపంచం దేవుని రాజ్యానికి మరింత చేరువవుతుంది. ఈ
పవిత్రమైన వేడుకను మనం కొనసాగిస్తున్నప్పుడు, దివ్య సత్ప్రసాదమనే బహుమతికి దేవునికి
కృతజ్ఞతలు తెలుపుదాం. మన యాజకుల కోసం ప్రార్థిద్దాం. ఈ రాత్రి యేసు ఇచ్చిన ఆజ్ఞ “నేను
మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి” అన్న దానిని పాటించడానికి
తన కృప కొరకు ప్రార్ధన చేద్దాం.
“…ఆయనకు విధేయులైన వారందరి నిత్య రక్షణకు ఆయన మూలమయ్యాడు”.