అందాన్ని సృష్టించిన
అందాన్ని ప్రేమించండి
సామె 8:22-31; రోమా 5:1-5; యోహాను 16:12-15 (సాధారణ 11/C)
“తండ్రి వాక్కు ద్వారా మరియు పరిశుద్ధాత్మలో సమస్తమును
చేయును” పునీత అథనాసియస్
ఈ రోజు మనం అత్యంత పవిత్ర
త్రిమూర్తులు త్రిత్వైక దేవుని పండుగను జరుపుకుంటున్నాము. ఇది దేవుని అంతర్గత జీవిత రహస్యాన్ని వెల్లడిస్తుంది. మన
దేవుడు వ్యక్తిగత దేవుడు మాత్రమే కాదు, తండ్రి, కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు
వ్యక్తులుగా ఉనికిలో ఉన్నవాడు. అదే సమయంలో ఒకే ఒక్క దేవుడై ఉన్నాడని పవిత్ర గ్రంథం మనకు హామీ ఇస్తుంది.
దీనికి మనం తార్కిక వివరణ ఇవ్వలేకపోయినా, కొంతవరకు దేవుని ఉనికిని
అనుభవించడానికి మన విశ్వాసం మనకు వీలు కల్పిస్తుంది. 16 వ. బెనెడిక్టు ఇలా అంటాడు, “ఆయన ఎవరో అని తెలుసుకోవడానికి దేవుడు చేసిన అద్భుతాల కోసం వెదకడం
కాకుండా, ఆయన ఉనికి అందం, మంచితనం కోసం దేవుడిని స్తుతించమని నేటి
అర్చనా విధానం మనల్ని ఆహ్వానిస్తుంది.” పునీత అగస్టీను తన “కన్ఫెషన్స్" అనే
పుస్తకంలో ఈ రహస్యాన్ని ఇలా ప్రశ్నిస్తూ వివరిస్తాడు, “నేను నా దేవుడిని
ప్రేమించినప్పుడు నేను ఏమి ప్రేమిస్తాను? భౌతిక సౌందర్యం లేదా తాత్కాలిక
క్రమం యొక్క అందం కాదు; భూసంబంధమైన కాంతి యొక్క ప్రకాశం కాదు; సామరస్యం మరియు సంగితపు మధురమైన శ్రావ్యత కాదు; పువ్వులు, పరిమళ ద్రవ్యాలు మరియు సుగంధ
ద్రవ్యాల సువాసన కాదు; మన్నా లేదా తేనె కాదు; శరీరం ఆలింగనం చేసుకోవడానికి
ఇష్టపడే అవయవాలు కూడా కాదు. నేను నా దేవుడిని ప్రేమించినప్పుడు నేను ప్రేమించేది
వీటిని కాదు. అయినప్పటికీ, నేను ఆయనను ప్రేమించినప్పుడు,
నా అంతరంగంలో కొలువైయున్న
అందమైన ప్రేమ కాంతిని మాత్రమె నేను
ప్రేమిస్తాను అనేది సర్వనిజం”.
ఈ రోజు మనం జరుపుకునే పరమ పవిత్ర
త్రిత్వం కాలానికి మరియు మానవ తార్కికతకు అతీతమైనది. ఇది మన విశ్వాస రహస్యం. కాంతి
కిరణాల కోసం చీకటిలో మాత్రమే మనం తడబడగలం. "ఇద్దరు అంటే సహవాసం, ముగ్గురు అంటే ఒక సమూహం" అనేది ఒక ప్రసిద్ధ నానుడి.
సువార్తలలోని అలంకారిక భాష “మూడు” అనే మాట పరిపూర్ణ సమరూపతను సూచిస్తుంది.
క్రీస్తు జీవితం నిరంతర త్రిమూర్తులను ప్రతిబింబిస్తుంది. బెత్లెహేంలోని యేసు జనన
దృశ్యంలో యేసు, మరియ యోసేపులు అనే పవిత్ర కుటుంబపు ముగ్గురు వ్యక్తులు. పశువుల
పాక వద్ద ముగ్గురు జ్ఞానులు. యేసు ఎదుర్కొన్న సైతాను మూడు శోధనలు. తప్పిపోయిన
కుమారుని ఉపమానంలో మూడు పాత్రలు. మంచి సమరయుని ఉపమానంలో ముగ్గురు బాటసారుల
ప్రవర్తన. విత్తువాని ఉపమానాలలో మూడు వేర్వేరు రకాల భూములు మూడు వేర్వేరు స్థాయిల
పంటలు. యేసును తిరస్కరించిన పేతురుని మూడు సమయాలు. కల్వరికి వెళ్ళే మార్గంలో యేసు
మూడు పర్యాయాలు బోర్ల పడిపోవడాలు. మరియు యేసు సిలువ వేయబడిన దృశ్యంలో ఇద్దరు దొంగల
మధ్య క్రీస్తుగా కన్పించే ముగ్గురు వ్యక్తులు. ఈ “మూడు” అనే సంఖ్య అర్ధం తరచుగా దైవిక సంపూర్ణత, ఒడంబడిక నిర్ధారణ, ఆధ్యాత్మిక పరివర్తన మరియు
పునరుత్థానం మరియు విముక్తిని సూచించే పరమార్ధం.
అలెగ్జాండ్రియాకు చెందిన
క్లెమెంట్ (క్రీ.శ. 150-215) ఇలా వ్రాశాడు: “ఎంత ఆశ్చర్యకరమైన
రహస్యం! విశ్వానికి ఒకే తండ్రి, విశ్వానికి ఒకే లోగోస్ (వాక్కు), మరియు ఒకే పరిశుద్ధాత్మ. ప్రతిచోటా అన్నింటి యందు అన్ని వేళలా ఒకేలా ఉన్నారు.
జ్ఞానమందును, సత్యమందును, రక్షణ ప్రణాళిక యందును ఒకే చిత్తమై యున్నారు. మువ్వురు కలిసి
ప్రేమ సంపూర్ణతను సూచిస్తున్నారు”. తండ్రి పంపిన పరిశుద్ధాత్మ కుమారుడి నుండి జనిస్తుంది. “దేవుడు ప్రేమ”. తమ విశ్వాసుల పట్ల
ఇది వారి మరువ రాని ప్రేమ. అదే ప్రేమలో మనం వారి త్రియేక దైవ స్వరూపంలో
సృష్టించబడ్డాము. తండ్రి దేవుడు మనల్ని సృష్టించాడు,
ఆయన ఏకైక కుమారుడు
మనల్ని రక్షించాడు, పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూనే ఉన్నారు. అలాగునే మన సాక్షిభూతమైన
జీవితాలు ఈ లోకంలో ఈ త్రిమూర్తులను ప్రతిబింబించాలి. ఎల్లప్పుడూ తండ్రిలా సృజనాత్మకంగా మనం ఉండాలి. ఆయన కుమారుడిలా కరుణామయులుగా ఉండాలి. పరిశుద్ధాత్మలాగా ఇతరుల సేవలో మన ప్రతిభను
ఉపయోగించాలి. దేవుని రహస్యాన్ని మనలో ఉంచుకోవడానికి మరియు భూమిపై మన స్వంత
స్వర్గపు "పౌరసత్వం" (ఫిలి 3:20)
జరుపుకోవడానికి, మనం పవిత్ర త్రిమూర్తుల వక్షస్థలంలో నివసించాలని లియో ది
గ్రేట్ వ్రాశాడు.
పిత పుత్ర పవిత్రాత్మ నామమున. ఆమేన్
No comments:
Post a Comment