అపొ 1:1-11;
ఎఫె 1:17-23;
లూకా 24:46-53
(6 /C)
“నేను నా తండ్రి
మరియు మీ తండ్రి, నా దేవుడు మరియు మీ దేవుడు వద్దకు
ఆరోహణమవుచున్నాను”.
అల్లెలూయ.
యేసు పునఃరుత్థానము తర్వాత 40వ రోజున ప్రభువు పరలోక ఆరోహణమును ఈరోజు మన తిరుసభ జరుపుకుంటుంది. యేసు ఆరోహణము ద్వారా ప్రభువు తన
భూసంబంధ పని అయినటువంటి మన విమోచనను పరి పూర్తి చేశాడని మాతృ శ్రీసభ మనకు
చెబుతుంది. తన పునరుత్థాన రోజు మరియు తన ఆరోహణ రోజు మధ్య వందలాది మందికి తన అనేక
ప్రత్యక్షతల ద్వారా, యేసు రెండు విషయాలను నిరూపించాడు. మొదటిది, తాను వారిని విమోచించడానికి వచ్చిన వాగ్దత్తపు మెస్సీయ అని
నిరూపించాడు. రెండవది, తమ సజీవ విశ్వాసంలో పట్టుదలతో ఉన్నవారు మరణాన్ని కూడా
అధిగమించి దేవుని రాజ్యాన్ని వారసత్వంగా పొందుతారని ఆయన నిరూపించాడు. అలాగునే ప్రభువు
తమతో ఉన్నాడనీ, వారి పరిచర్య పనిలో వారికి సహాయం చేస్తాడని వారికి పూర్తిగా హామీ ఇచ్చాడు.
యేసు పూర్తిగానూ శాశ్వతంగానూ తన
తండ్రితో తిరిగి ఐక్యమయ్యాడు. అపొస్తలుల కార్యముల వాస్తవ మాటలు ఏమిటంటే, “ఒక మేఘం ఆయనను వారి దృష్టి నుండి
తీసుకువెళ్ళింది” (అపొ 1:9). పాత నిబంధనలో మనకు
కన్పించే దేవునికి చిహ్నంగా వున్నటువంటి ఉరుము, మెరుపు, పర్వతం, వాయువు, అగ్ని, గుడారం మొదలైన చిహ్నాల వలే నేటి
పఠనంలో కన్పించే “మేఘం” ఇతర చిహ్నాల మాదిరిగానే దేవునకు ఒక చిహ్నంగా వున్నది.
కాబట్టి, “మేఘం ఆయనను తీసుకువెళ్లింది” అనే వాక్కు
- తండ్రి దేవుడు మానవశరీరం ధరించిన తన కుమారుని తిరిగి తన వద్దకు
తీసుకువెళ్లాడని అర్థం. మరియు మార్కు సువార్తలో కన్పించే, “ప్రభువైన యేసు... పరలోకానికి
తీసుకెళ్లబడ్డాడు” అన్నఅర్థం కూడా అదే! ఆయన వెళ్ళిపోవడం శాశ్వతం. తిరిగి న్యాయాధిపతిగా రావడం తధ్యం.
ఇప్పుడు శిష్యులు యేసును ఆకాశపు గఘనాలలో కనుగొనలేరు. కాబట్టి ఆకాశం వైపు చూడకుండా “తమ
కళ్ళను దించుకొని భూమివైపు చూడాలని” పిలుపును పొందారు. ఆతని సాన్నిధ్యం మన మధ్యననూ
మన ఒక్కొక్కరిలోనూ నెలకొని వున్నది.
ఈ నాటి, ఆరోహణ పండుగ నాడు, యేసు తన తండ్రితో సమాన మహిమను
పంచుకోవడానికి ఆరోహణమ వ్వడం వలన, ఆయన “మహోన్నత స్థితి”ని మనం కొనియాడుతునాము.
యేసు తన శిష్యులను విడిచిపెట్టే ముందు, వారికి తమ లక్ష్య దశాదిశ నిర్దేశo చేసాడు. “నా యందు విశ్వాసముంచువాడు నేను చేయు క్రియలు చేయును, నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నందున వీటికంటె గొప్ప క్రియలు
చేయును” (యోహాను 14:12-13) అని మరింత అద్భుతమైన క్రియలు చేయడానికి వారికి అభయ మిచ్చాడు యేసు.
తాను చేయలేనిది వారు చేయగలుగుతారు. వారు లోకమంతటికీ సువార్తను
ప్రకటించగలరు. ఈ రక్షణ సువార్తను ప్రకటించి స్వస్థపరిచే పనిని కొనసాగించడానికి వారికి
దిశను చూపించాడు. వారు పరిశుద్ధాత్మ నుండి శక్తిని పొందుతారు. వారు ఇక ఎప్పటికీ
ఒంటరిగా ఉండలేరు.
పరిశుద్ధాత్మ బహుమతి కోసం
యెరూషలేములో వేచి ఉండమని మన ప్రభువు వారిని ఆదేశించాడు (లూకా 24 49; అపొ 1:4-5). యెరూషలేములో, వారు వాగ్దానం చేయబడిన ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తూ ఆత్మ
వరాన్ని పొందుకున్నారు. శాశ్వత ఆత్మ కోసం మనం కోరుకునే "అత్యధికమైన విలువైన
వాగ్దానాన్ని" తన శిష్యులకు ఇచ్చినట్లు ఆయన మనకు ఇవ్వలేదా? మన ఆత్మలలో వాటి నెరవేర్పు కోసం వేచి చూద్దాం. సరైన సమయంలో, “యేసు పరలోకానికి వెళ్ళినట్లే పరలోకం నుండి తిరిగి (సరియైన సమయంలో) వస్తాడు” (అపొ 1:11). ఆ చివరి వాగ్దానం , “నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని నా దగ్గరకు తీసుకెళ్తాను, తద్వారా నేను ఉన్న చోట మీరు కూడా ఉంటారు (యోహాను 14:3) అన్నది కూడా నెరవేరుతుంది. ఈలోగా మనం “మన నడుములు కట్టుకుని, మన దీపాలను సవరించుకొని” ప్రభువు రాక కోసం ఎదురు
చూస్తున్న” వారిగా ఆయన మనల్ని కనుగొనవచ్చు గాక!
“నేడు మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమయ్యాడు. మన హృదయాలు ఆయనతో పాటు ఆరోహణ మవ్వాలి”
No comments:
Post a Comment