AletheiAnveshana: దీక్షలో మన ఆధ్యాత్మిక దృష్టి పరీక్ష 1 సమూ 16:1b,6-7,10-13°; ఎఫెసీ 5:8-14; యోహా 9:1-41 (Lent A / 4)

Saturday, 14 March 2026

దీక్షలో మన ఆధ్యాత్మిక దృష్టి పరీక్ష 1 సమూ 16:1b,6-7,10-13°; ఎఫెసీ 5:8-14; యోహా 9:1-41 (Lent A / 4)

 

దీక్షలో మన ఆధ్యాత్మిక దృష్టి పరీక్ష

 

1 సమూ 16:1b,6-7,10-13°; ఎఫెసీ 5:8-14; యోహా 9:1-41 (Lent A / 4)

సత్యము ననుసరించి జీవించువాడు వెలుగులోనికి వచ్చును” (Divine Office)

 

ఈ దీక్షా కాలపు నాల్గవ ఆదివారపు రోజున, లోతైన మానవ సమాజ ధోరణి నిమిత్తం దేవుని వాక్యం మనలను సవాలు చేస్తుంది. ప్రజలను తీర్పు తీర్చే ధోరణి కేవలం మనం బాహ్యంగా వారిని చూసే విధానం బట్టే జరుగుతుంది. ప్రవక్త సమూయేలు యెష్షయి కుమారులలో ఒకరిని ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించడానికి వచ్చినప్పుడు, అతను ఆయా కుమారుల రూపాన్ని మరియు బలాన్ని చూసి ఆకర్షితుడై నిర్దారించుకుంటాడు. కానీ ప్రభువు : "ఒకరి రూపాన్ని బట్టి లేదా అతని ఉన్నత బాహు స్థాయిని బట్టి తీర్పు తీర్చవద్దు... ఎందుకంటే  మనిషి చూసే విధంగా ప్రభువు చూడడు; మనిషి బాహ్య రూపాన్ని చూస్తాడు, కానీ ప్రభువు హృదయాన్ని చూస్తాడు" (1 సమూ 16:7)  అని అతనిని ఒక అద్భుతమైన జ్ఞాపికతో సరిదిద్దాడు. మనం తరచుగా ఇతరులను కనిపించే వారి వారి లక్షణాల బట్టి కొలుస్తాము. ఒక్కొక్క సారి వారి స్థితి, విజయం లేదా శారీరక రూపు రేఖల బలం మన నిర్ధారణ అవుతుంది. కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు.

 

యేసు అనుచరులు పుట్టుకతోనే అంధుడైన ఒక వ్యక్తిని చూసినప్పుడు, వారు వెంటనే యేసును రబ్బీ! ఎవరు పాపం చేసారు, ఈ మనిషినా లేక అతని తల్లిదండ్రులా, ఇతను గుడ్డివాడిగా పుట్టాడు?” (యోహా 9:2) అని అడుగుతారు. వేద శాస్త్రం పాత నిబంధన వారి ప్రశ్న ప్రతీకారం, శిక్ష, పాపఫలం (retribution) నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. కష్టాల కన్నీళ్ళు అనేది పాపానికి శిక్షగానూ మరియు  శ్రేయస్సు అనేది మంచి తనానికి ప్రతిఫలంగానూ ఉండాలన్నదే ఈ retribution సిద్దాంతం. ద్వితీయోపదేశకాండములో మనం ఈ దృక్పథ సిద్ధాంతాన్ని చూస్తున్నాము. ఇక్కడ విధేయత ఆశీర్వాదాలతో మరియు అవిధేయత శాపాలతో ముడిపడి ఉంటుంది. నేటికీ, మన సమాజంలోని అనేక మత సంస్కృతులు ఖర్మ సిద్దాంత భావన ద్వారా ఇలాంటి ఆలోచనను వ్యక్తపరుస్తున్నాయి. ప్రతి కష్టాల కడగండ్లు గత తప్పుల ఫలితంగానే వున్నాయని నమ్ముతాయి.

 

కానీ యేసు ఇటువంటి నింద తర్కాన్ని బద్దలు గొడుతున్నాడు. సమాజ సంఘ సంస్కర్త యేసు, “అతడుగానీ అతని తల్లిదండ్రులు గానీ పాపం చేయలేదు. దేవుని అద్భుత చేయిదములు అతని ద్వారా కనిపించేలా చేయడం కోసమే ఇలా జరిగింది” (యోహా 9:3) అని యేసు సమాధానమిచ్చాడు. దేవుని కృప ఎలా క్రియా రూపం దాలుస్తుందనే విషయముపైనే ఆయన దృష్టి పెడుతున్నాడు. అంధుడి బాధ స్వస్థపరిచే దేవుని శక్తికి నిదర్శనంగా వుందని గ్రహించ మంటాడు  క్రీస్తు. జరుగుతున్న సంభాషణను retribution తీర్పు నుండి మిషన్‌కు మారుస్తున్నాడు యేసు.  చిన్నవాడు, ఆఖరి వాడు మరియు తక్కువగా ఆకర్షణ పొందుకున్న దావీదు మానవ దృక్కోణం నుండి అల్పుడిగా కనిపించాడు. అయినప్పటికీ దేవుడు అతని విశ్వాస గర్భిత హృదయాన్ని చూశాడు. దేవుని ఎంపికలు తరచుగా మానవ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి కదా!! విజయం, ఉత్పాదకత, ఉత్పత్తి సంపద లేదా ప్రభావం ఆధారంగా ప్రజలను విలువైనదిగా భావిస్తుంది ఈ సమాజం. కానీ మానవ గౌరవం అనేది ఈ బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉండదు, వుండకూడదని  యేసు మనకు గుర్తు చేస్తున్నాడు.

 

16 వ బెనెడిక్టు పోపు గారు  తన"Deus Caritas Est" ("దేవుడు ప్రేమాస్వరూపి" 2005) అన్న విశ్వ లేఖలో పొరుగువారిని ప్రేమించడం ప్రతి క్రైస్తవుడి ప్రాథమిక బాధ్యత అని మనకు గుర్తు చేసాడు. మనం బాధలను ఎదుర్కొన్నప్పుడు, మన ప్రతిస్పందన ఉదాసీనత లేదా తీర్పు కాదు, కానీ నిర్దిష్టమైన దాతృత్వం.  పోప్ ఫ్రాన్సిస్ తన “Laudato Si” ("ప్రభువా, నీకు స్తుతి” 2015)  అన్న విశ్వ లేఖలో, ప్రతి జీవి మరియు ప్రతి మానవ వ్యక్తి దేవుడు ఇచ్చిన మంచితనాన్ని కలిగి ఉండాలని నొక్కి చెప్పాడు. అదేవిధంగా  బ్రద్దలైపోతున్న నేటి ప్రపంచమున మతాలు, దేశాల సరిహద్దులను దాటి, మనుషులందరూ ఒకే దేవుని బిడ్డలని  ప్రేరేపించిన తన విశ్వ సమాజ లేఖ “Fratelli Tutti” ("అందరూ సోదరులు" 2020) లో, ప్రతి మానవుడికి గౌరవంగా జీవించడానికి, సమాజంలో పూర్తిగా అభివృద్ధి చెందడానికి హక్కు ఉందని ధృవీకరిస్తూ, సోదరభావాన్ని, సౌభ్రాతృత్వాన్ని తిరిగి కనుగొనమని ఆయన ప్రపంచానికి పిలుపు నిచ్చాడు.

 

దేవుని పనిలో పాల్గొనమని యేసు మనల్ని ఆహ్వానిస్తున్నాడు (యోహా 9:4). క్రైస్తవులుగా మన పని గాయపడిన వారిని తీర్పు తీర్చడం కాదు. వారిని స్వస్థపరచడంలో సహాయం చేయడం. న్యాయం కోసం పోరాడుతున్న వారిని ఖండించడం కాదు. వారికి మద్దతు ఇవ్వడం. అంటే సామాజిక మంచిని నిర్మించడం. పేదలకు సేవ చేయడం, రోగులకు మద్దతు ఇవ్వడం, కుటుంబాలను బలోపేతం చేయడం మరియు మన సమాజాలలో న్యాయం మరియు కరుణను చైతన్య పరచడం. అంధుడు చివరన యేసును గుర్తించి ఆయనయందు విశ్వాసం ప్రకటించాడు. అయితే ఆధ్యాత్మికంగా జ్ఞానోదయం పొందుకున్నామని గర్వించే వారు ఇంకా అంధులుగానే మిగిలిపోతున్నారు. సువార్తికుడు యోహాను అందించే కథలోని నిజమైన అంధత్వం భౌతికమైనది కాదు, ఆధ్యాత్మికం. హృదయంతో చూడలేకపోవడం. మనం మన దీక్షా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు, మన స్వంత అంతర్ దృష్టిని పరిశీలించుకోమని మాతృ శ్రీసభ మనల్ని ఆహ్వానిస్తున్నది. మనం ప్రజలను వారి రూపాన్ని బట్టి తీర్పు తీరుస్తామా లేదా దేవుడు వారిని చూసే విధంగా చూడగలమా? క్రీస్తు మన కళ్ళు తెరిస్తే, మనం తీర్పు నుండి కరుణకు మరియు ఉదాసీనత నుండి సేవకు మారగలము. అప్పుడు, మన జీవితాల ద్వారా, దేవుని పనులు నిజంగా మన సమాజంలో కనిపిస్తాయి. అది నిజం. అదే తథ్యం.

 

 

ఆయన అద్భుతమైన కార్యములలో దేవుణ్ణి స్తుతించండి” (Divine Office).

 

 

 

 

 

No comments:

Post a Comment